అత్యాధునికమైన సదుపాయాలతో ఆకట్టుకుంటున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ లోని నూతన టెర్మినల్ సందర్శకులను రా...రామ్మని పిలుస్తోంది. సుమారు రూ.162 కోట్లతో నిర్మించిన ఈ టెర్మినల్ అందాలు, పచ్చదనం కప్పినట్లు ఉన్న గ్రీనరీని తిలకించాలనే ఆసక్తితో పిల్లలు ఇక్క డకు ఎక్కువగా వస్తున్నారు.
అయితే, భద్రతా కారణాల వల్ల ఎయిర్ పోర్ట్ లోకి అనుమతించరనే అపోహలు వల్ల లోపలికి వచ్చేందుకు ఎక్కువ మంది సాహసించట్లేదు. వాస్తవంగా భద్రతపరంగా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సమయంలో మినహా మిగిలిన అన్ని రోజుల్లో సందర్శకులను విమానాశ్రయంలోకి అనుమతిస్తారు.
ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లోపలికి వెళ్లాలంటే మాత్రం రూ.30తో ఎంట్రీ పాస్ తీసుకోవాలి. అది కూడా పూర్తిగా భద్రత తనిఖీలు చేసిన తర్వాతే డిపార్చార్, ఎరైవల్ బ్లాక్ లోని నిర్ణీత ప్రాంతం వరకే అనుమతిస్తారు. టెర్మినల్ ఆవరణలోని గ్రీనరీ, రంగురంగుల విద్యుత్ ఫౌంటేన్లు, గార్డెన్, వంద అడుగుల భారీ జాతీయ పతాకం, పాత టెర్మినల్ నుంచి రన్వే పరిసరాలను వీక్షించవచ్చు.