lepakshi utsavalu 26022016

హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన డిసెంబరు 27, 28 తేదీల్లో, లేపాక్షి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డిసెంబరు 27న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ నేపధ్యంలో లేపాక్షి వైభోగం గురించి మీకు కొన్ని విషయాలు.

ఎక్కడ ఉంది:
రాయలేలిన రాతనాలసీమలో ఒక ప్రాంతం ఈ లేపాక్షి. సుందర పర్యాటక క్షేత్రం అయిన లేపాక్షి అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణానికి 16 కి.మీల దూరంలో ఉంది. మనదేశంలో ఉన్న108 మహిమాన్వితమైన దివ్యశైవక్షేత్రాలలో లేపాక్షి ఒకటి. పాపనాశేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. క్రీ.శ.1529-1542 మధ్య కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.

ఆ పేరు ఎలా వచ్చింది:
సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

లేపాక్షి బసవన్న:
లేపాక్షిని గురించిన ప్రస్తావన ఎప్పుడు, ఎక్కడ వచ్చినా, మనకు ‘బసవన్న’కూడా గుర్తుకువస్తుంది, అదే లేపాక్షి బసవన్న’. లేపాక్షి కి వెళ్ళి ఈ బసవన్నను దర్శించుకోనిదే, ఆ వెళ్ళిన వాళ్ళకు లేపాక్షి సందర్శనం పూర్తి అయినట్లుగా భావింపబడదు అనడం అతిశయోక్తి కానే కాదు!. పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది.

ఆశ్చర్యపరిచే వేలాడే స్తంభం:
లేపాక్షి ఆలయంలో ఉన్న నత్యమండపంలో తూర్పు వైపున చివరి నుంచి రెండో వరసులో ఉన్న వేలాడే స్తంభం అక్కడ ప్రత్యేకత. ఈ దృశ్యం దేశంలో ఎక్కడా ఉండదు.

శిల్పకళ వైభవం:
లేపాక్షి శిల్పకళ, దేశంలోనే అజంతా, ఎల్లోరా తరువాత లేపాక్షికే అంతంటి విశిష్ట స్థానం ఉంది. సూక్ష్మమైన డిజైన్లతో పాటు వ్యాకరణ, దేవతా ప్రతిమలు, నాట్యమండపంలో 70 స్తంభాల పై శిల్పాలు, రంభ నాట్యం చేస్తుండగా సూర్యుడు, తంబరుడు, నందీశ్వరుడు, విశ్వబ్రహ్మ, వాయుద్యాలు వాయుస్తుండగా, శివపార్వతులు తిలకిస్తున్నట్టు ఉండే శిల్పాలు ఆకట్టుకుంటాయి. 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గర్భగుడి పైకప్పు పై ఉన్న వీరభద్రుడి చిత్రం చాలా పెద్దది. ఏడు శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం ఆకట్టుకుంటుంది. ఆలయంలో 876 స్తంభాలలో 246 స్తంభాలపై శిల్పాలు ఉంటాయి.

విజయవాడ నుంచి లేపాక్షికి వెళ్ళటానికి సదుపాయాలు:
బస్సు: విజయవాడ నుంచి హిందూపురం బస్సు, 612 కీ.మీ. బస్సు చార్జీ, రూ.726/-. అక్కడ నుంచి లేపక్షికి 15 కీ.మీ. బస్సు చార్జీ, రూ.11/-. అదే, అనంతపురం నుంచి అయితే, లేపక్షికి 110 కీ.మీ. బస్సు చార్జీ, రూ.136/-
రైలు: విజయవాడ నుంచి హిందూపురం, 643 కీ.మీ. రైలు చార్జీ, రూ.335/-. (స్లీపర్)
విమానం: బెంగళూరు నుంచి లేపక్షికి 101 కీ.మీ. విజయవాడ నుంచి ఎయిర్ కొస్తా, స్పైస్ జెట్ , ఎయిర్ ఇండియా సర్వీసులు ఉన్నాయి. చార్జీ, రూ.4,000/- వరకు ఉంటుంది.

హోటల్స్:
హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, పెనుకొండలో మంచి హోటల్స్ ఉన్నాయి. హిందూపురంలో ఐతే, పల్లా లాడ్జి , సప్తగిరి, జేవిఎస్ పారడైస్, అజంతా, సాయి తేజ, సాగర రెసిడెన్సి, ఇంకా కొన్ని చిన్న లాడ్జిలు ఉన్నాయి.

ఇంకా సమీపంలో చాల చూడదగ్గ ప్రదేశాలు, గుడిలు, దర్గాలు ఉన్నాయి

Advertisements

లేపాక్షి ఉత్సవాలుకు మనమూ వెల్లోద్దాం రండి.. Last Updated: 22 March 2016