గత రెండు సంవత్సరాలుగా, విశాఖలో భూ-కుంభకోణాలు జరిగిపోయాయని, వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తు చెయ్యాలని హడావిడి చేసారు. అయితే "సూది కోసం సోదికి వెళ్తే పాత రంకు బయటపడింది " అనే సామెత చందన, ఈ భూకుంభకోణం మొత్తం, కాంగ్రెస్ లోనే జరిగినట్టు తేలిపోయి, జగన్ మెడకే చుట్టుకుంది. రెండు రోజుల క్రితం, విశాఖలో భూరికార్డుల ట్యాంపరింగ్‌ పై విచారణ జరిపిన సిట్ కేబినెట్‌కు నివేదిక అందజేసింది. ఆ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉంది. ఈయన గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ధర్మాన కుమారుడి పేరుమీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్నాయి.

jagan 08112018 2

విచారణ జరిపిన సిట్ ఇచ్చిన నివేదికలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్ల పేర్లు ఉన్నాయి. 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. మొత్తంగా 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో సూచించింది. ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని సిట్ నివేదికలో వెల్లడించింది. ఇందులో కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సూచించింది. సిట్ నివేదిక పై తదుపరి చర్యలకు కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది.

jagan 08112018 3

ఈ భూకుంభకోణంలో గత ప్రభుత్వాల భాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూముల కొట్టేసిన బడా బాబులకు షాక్ తగిలింది. అప్పటి ఎన్ఓసీల రద్దుకు కేబినెట్ రంగం సిద్ధం చేస్తోంది. జగన్ ఆరోపించినట్టు, భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా సమర్పించ లేకపోయారని చెప్పింది. సీట్ నివేదికతో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పీకల దాకా మునిగింది. సిట్‌ నివేదికను మంగళవారం ఆమోదించిన మంత్రిమండలి... దానిని పరిశీలించి బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? అక్రమల లావాదేవీల్లో వేరేవారి పరమైన భూముల్ని ఎలా స్వాధీనం చేసుకోవాలన్న అంశంపై సిఫార్సులు చేసేందుకు రెవెన్యూ, సాధారణ పరిపాలన, న్యాయశాఖల కార్యదర్శులతో ఒక కమిటీని నియమించింది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక అందజేయాలని సూచించింది.

భారత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం నిర్మించడం ఓ చెత్తపని అని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపీ తప్పుపట్టారు. ఒక పక్క తమ నుంచి రూ.9,492 కోట్లను ఆర్థిక సాయం రూపంలో భారత్‌ తీసుకొందని.. అదే సమయంలో దాదాపు రూ.3వేల కోట్లు వెచ్చించి ఆ భారీ విగ్రహాన్ని నిర్మించిందని కన్జర్వేటీవ్‌ పార్టీ ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు. అప్పులు తీసుకుంటూ అభివృద్దిని పక్కన పెట్టి, విగ్రహాలు నిర్మించడం ఏంటని బ్రిటన్‌ ఎంపి ఒకరు మండిపడ్డారు. ఆ మాత్రం దానికి తామెందుకు రుణం ఇవ్వాలని కూడా ప్రకటించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తాము ఐదేళ్లలో భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను అందజేశామని తెలిపారు.

modi 08112018 2

మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించామన్నారు. ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ వంటి ప్రాజెక్టులకు భారత్‌ వేలకోట్ల రూపాయలు వెచ్చించగలుగుతున్నప్పుడు ఇక తాము సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరికొందరు ఎంపీలు కూడా పీటర్‌ అభిప్రాయంతో ఏకీభవించారు. కొన్నేళ్లుగా యుకే భారత్‌లోని వివిధ పథకాలకు ఆర్థిక సాయం అందజేస్తోంది. 2012లో 300 మిలియన్‌ పౌండ్లు, 2013లో 268 మిలియన్‌ పౌండ్లు, 2014లో 278 మిలియన్‌ పౌండ్లు, 2015లో 185 మిలియన్‌ పౌండ్లు అందజేసింది. ఇదే సమయంలో భారత్‌లో భారీ పటేల్‌ విగ్రహ నిర్మాణం ప్రారంభమైంది. వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భారత్‌కు ఆర్థిక సాయం ఆపేయాలని బ్రిటన్‌లోని పలు వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

modi 08112018 3

ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఇటీవల గుజరాత్ లో ప్రారంభమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం రికార్డులకు ఎక్కింది. ఈ విగ్రహ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వ, గుజరాత్ ప్రభుత్వం గొప్ప పనిగా అభివర్ణిస్తున్నాయి. అయితే, వివిధ పార్టీలు మాత్రం సర్దార్ విగ్రహ ఏర్పాటు పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేశాయి. సర్దార్ గొప్పదనాన్ని ఎవరూ తక్కువ చేయలేరు, కానీ సుమారు రూ.3 వేల కోట్ల ఖర్చు విగ్రహం కోసం పెట్టడం అవసరమా అనే విమర్శలు వచ్చాయి. అయితే, పర్యాటకం అభివృద్ధి అవుతుందని, తద్వారా అదాయం పెరుగుతుంది అని గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ విగ్రహ ఏర్పాటును సమర్థించుకున్నాయి.

దేశంలో ఇప్పటివరకూ మోదీ వ్యతిరేక కూటమి ఏర్పడడంపై జనంలో ఒక సానుకూల అభిప్రాయం లేదు. రాహుల్ గాంధీ వెనుక ప్రతిపక్షాలేవీ రావని, ప్రతిపక్షాల్లో వాటికి వాటికీ మధ్య సఖ్యత ఉండదని, ప్రధానమంత్రి పదవి కోసం వారిలో వారు కాట్లాడుకుంటారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సైతం బహిరంగ సభల్లో తీవ్రంగా విమర్శించారు. కాని ఉన్నట్లుండి చంద్రబాబు ఢిల్లీ వచ్చి ముఖ్యమైన నేతలను కలుసుకోవడం, వారంతా ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడం, త్వరలో అంతా కలుసుకుని భవిష్యత్ కార్యాచరణకు పూనుకోవడం పరిస్థితిలో గుణాత్మక మార్పును తీసుకువచ్చింది. చంద్రబాబు వెలిబుచ్చిన కీలక అభిప్రాయాలతో దేశంలో ప్రతిపక్షాలే కాదు, ప్రజాస్వామిక వాదులు, ఇతర మేధావులూ కూడా అంగీకరిస్తున్నారు.

delhi 07112018 2

ఒకటి, దేశంలో సిబిఐ, ఆర్‌బిఐ, ఐబి, ఈడీ, ఐటి, సివిసి మొదలైన అనేక వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడంతో అవి కుప్పకూలిపోతున్నాయి. రెండు, దేశంలో మతతత్వాన్ని, మూకోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ వాతావరణం కలుషితమైంది. మూడు, ప్రతిపక్షాల్లో ఒకో పార్టీని టార్గెట్ చేసి బలహీనపరచడం ద్వారా మోదీ, అమిత్ షాలు ప్రయోజనం పొందాలనుకోవడం. ఈ మూడు చర్యలు దేశంలో నిర్బంధ వాతావరణాన్ని ఏర్పర్చడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు కలిసిన రాహుల్, ములాయం, అఖిలేష్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సురవరం, సీతారాం ఏచూరితో పాటు పలు పార్టీల నేతలూ గ్రహించారు.

delhi 07112018 3

సార్వత్రక ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసే మాట దేవుడెరుగు, ప్రస్తుతం బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ కూర్చుని చర్చించుకుని బలమైన సంయుక్త కార్యాచరణ ఏర్పర్చుకోకపోతే మొదటికే మోసం వస్తుందని, తాము కకావికలం అవుతామని ఆ పార్టీలన్నీ గ్రహించాయి. అసలు ఆ రకంగా అంతా ఒకే అభిప్రాయానికి రావడం, కలుసుకోవాలనుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఒక చరిత్రాత్మక పరిణామం. ఈ పరిణామం వల్ల ప్రజలకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుందన్న ఆత్మవిశ్వాసం కలుగుతుందనీ, ఆ ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో మోదీకి, బిజెపికి వ్యతిరేక వాతావరణం బలపడేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. నాలుగు రాష్ట్రాల్లో కనుక బిజెపి దెబ్బతింటే ప్రతిపక్షాల ఐక్యత మరింత బలపడుతుంది.

 

జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణంలో భాగంగా, మరో రెండు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. దీని కోసం ఈ నెల 20 నుంచి షడ్యుల్ అనుకున్నా, చంద్రబాబు ఈ రోజే, ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన కర్ణాటక, వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధాహ్నం మూడు గంటలకు బెంగూళురు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ సీఎం కుమారస్వామి, జేడీఎస్‌ అధినేత దేవెగౌడలను కలిసి మాట్లాడతారు. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో దేవెగౌడ నివాసంలో వీరి భేటీ జరగనుంది.

cbn 08112018 2

కర్ణాటక కాంగ్రెస్‌ నేత శివ కుమార్‌ తదితరులు కూడా అక్కడ ఆయనను కలుస్తారు. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో.. ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు జేడీఎస్‌తోనూ చర్చించనున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

cbn 08112018 3

ఈ నెలలో ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల భేటీని నిర్వహించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దీనికి ముందస్తు కసరత్తులో భాగంగా ఆయన వివిధ పార్టీల నేతలను స్వయంగా కలుసుకొని మాట్లాడుతున్నారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని చంద్రబాబు అభినందించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కుమార స్వామికి ఫోన్‌ చేసి తన అభినందనలు తెలిపారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల నెలకొన్న వ్యతిరేక వాతావరణానికి ఈ ఫలితాలు నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read