వైసీపీ గూండా మూకల దాడులతో రాష్ట్రం రావణకాష్టమైపోయింది. కబ్జాలు, అత్యాచారాలు, సజీవదహనాలు, దాడులతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. నేరాంధ్రప్రదేశ్ అయ్యిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వైసీపీ అరాచకాలకు అండాదండలు అందిస్తోన్న కేంద్రం కూడా విశాఖ క్రైం కేపిటల్ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ సభలో వైసీపీ పాలనలో నేరాలు-ఘోరాలు పెరిగాయని ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైసీపీ ఎంపీ, సీఎం ఆత్మీయుడు ఆడిటర్ జీవిల కిడ్నాప్ జరిగింది. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో వైసీపీ సైకో పాము వెంకటేశ్వర రెడ్డి ఆయన గ్యాంగ్ గంజాయి మత్తులో పదిహేనేళ్ల బాలుడు అమర్నాథ్ ని అత్యంత దారుణంగా సజీవ దహనం చేశారు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ప్రతిరోజూ ప్రతి గ్రామంలో వైకాపా అరాచకాలు రాసేందుకు పేపర్లలో పేజీలు కూడా చాలడంలేదు. ప్రజల పట్ల ప్రేమ లేకపోయినా, పదవి కోసం నటించేందుకైనా ముఖ్యమంత్రి హోదాలో ఈ నేరాలపై సమీక్ష చేసిన పాపాన జగన్ రెడ్డి పోలేదు. చివరికి డిజిపి వచ్చి జరుగుతున్నవి నేరాలే కాదు, క్రైమ్ రేటు పెరగలేదు, ఏపీలో శాంతీ ఉంది-భద్రతకి ఢోకా లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. రాష్ట్రంలో నేరాలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పేందుకు వైసీపీ కోసం బీజేపీలో ఉండి పనిచేసే ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటన ఉదాహరణ. వైసీపీ నేరాలని కప్పిపుచ్చటం కోసం ఏకంగా బీజేపీ బిగ్ బాస్ అమిత్ షా ప్రసంగాన్నే తిరగేసిన విశ్వాసం జీవీఎల్ నరసింహారావు సొంతం. అటువంటి జీవీఎల్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు. ఇది ఒక్కటి చాలు ఏపీలో భయంకర పరిస్థితులు వివరించడానికి. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, దౌర్జన్యాలతో రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే..పట్టించుకోలేనంత బిజీలో సీఎం జగన్ రెడ్డి ఉన్నారు. అదేంటంటే బూతు దర్శకుడు రాంగోపాల్ వర్మతో భేటీ అయ్యారు. తనపై సినిమా తీయించుకుంటున్నారు. శాంతిభద్రతలపై సమీక్షించేందుకు సమయం లేని సీఎం జగన్ రెడ్డికి ఆర్జీవీతో భేటీ అవ్వడానికి మాత్రం టైం బాగానే దొరికింది.
news
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ చేతులెత్తేస్తోన్న వైసీపీ ఎంపీలు
వైసీపీలో ఒక్కసారి పరిస్థితులు మారిపోయాయి. వై నాట్ 175 స్లోగన్ ఎదురు తన్నేసింది. కుప్పం కొట్టేస్తున్నామనే ప్రగల్భాలు పులివెందుల చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డాయి. గెలుపు మాట అటుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని దుస్థితి వైసీపీని వెంటాడుతోంది. ముఖ్యంగా 25 స్థానాల్లో 22 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడంలేదని ప్రచారం సాగుతోంది.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆర్థిక బలం చూసి అసెంబ్లీకి పంపితే..ఇక్కడ పార్లమెంటు స్థానానికి కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీది. కాకినాడ ఎంపీ వంగా గీత, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా ఎమ్మెల్యే స్థానాల నుంచి బరిలోకి దిగుతామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి రెబల్ గా మారిన రఘురామకృష్ణంరాజు స్థానంలో కొత్త అభ్యర్థిని దింపేందుకు కసరత్తు చేస్తున్నారు వైసీపీ వ్యూహకర్తలు.
విజయవాడ పార్లమెంటు నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పివిపి (పొట్లూరి వరప్రసాద్) ఈ సారి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంలేదని, వైసీపీ అధిష్టానం కూడా టిడిపి ఎంపీ కేశినేని నానితో టచ్లోకి వెళుతుందని సమాచారం. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలుండి కూడా ఎంపీలుగా ఉండేందుకు వైసీపీలో ఎందుకు అనాసక్తి చూపుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఎంపీగా ఎన్నికైనా, పార్టీ అధికారంలో ఉన్నా ఢిల్లీలోనా..తమ నియోజకవర్గంలోనా ఎంపీలని కూరలో కరివేపాకులుగా తీసిపారేస్తుండడంతో చాలా మంది మరోసారి పోటీకి విముఖత చూపుతున్నారు. ఎంపీలు ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా..మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అనుమతి తప్పనిసరి. ఎమ్మెల్యేలు కూడా ఎంపీలకి కనీస గౌరవం ఇవ్వకపోవడంతో తామూ ఎమ్మెల్యే స్థానాలకే పోటీ చేస్తామంటూ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టే ఎంపీల సంఖ్య పెరిగిపోయింది.
కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం పై వైసీపీ మార్క్ కక్ష సాధింపు
జగన్ రెడ్డిని చంద్రబాబు సైకో అంటారు. సీఎంగా ఉండి జగన్ రెడ్డి చేష్టలు సైకోని తలపిస్తూ చంద్రబాబు మాటల్ని నిజం చేస్తున్నాయి. కుప్పం ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత చంద్రబాబుని ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అంతకుముందు పల్నాడులో బాధితుల్ని పరామర్శించేందుకు వెళితే చంద్రబాబు ఇంటికి పోలీసులు తాళ్లతో కట్టి నిలువరించారు. ఇలా అడుగడుగునా చంద్రబాబుని అడ్డుకుంటూ వస్తూన్న జగన్ రెడ్డి సర్కారు తాజాగా తన నియోజకవర్గం కుప్పంలో బాబు సొంత ఇల్లు నిర్మించుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసి ఏడాది గడచినా అనుమతులివ్వకుండా తాత్సారం చేస్తోంది. కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కోసం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం-పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు రెండెకరాల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. దీనిని రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంటి నిర్మాణం కోసం అన్ని పత్రాలతో దరఖాస్తు చేశారు. అథారిటీ సర్వేయర్ సర్వే చేశారు. పత్రాలు సమర్పించలేదని ఇచ్చిన సమాచారంతో మళ్లీ సంబంధిత పత్రాలను ఉడాకు అందజేశారు. గుంటూరులోని డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ అండ్ ప్లానింగ్కు కూడా ఈ ఏడాది జనవరి రెండో వారంలో స్థలానికి సంబంధించిన అన్ని పేపర్లు పంపించినా, అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం అన్ని దరఖాస్తులు పూర్తిచేసి పత్రాలు అందజేసినా అనుమతులు రాకపోవడం వెనుక సైకో పాలకుల ఒత్తిడి ఉందని తెలుస్తోంది.
మొన్న శరత్ చంద్రా రెడ్డి, నిన్న మాగుంట.. నేడు జగన్ గ్యాంగ్లో మరో కీలక వికెట్టు అరెస్ట్
వైఎస్ జగన్ రెడ్డికి ఆయువుపట్టులాంటి ఆర్థిక సామ్రాజ్యాధినేతలు ఒక్కొక్కరూ ఊచలు లెక్క పెట్టేందుకు క్యూ కడుతున్నారు. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడైన అరబిందో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి, చివరికి జగన్ చొరవతో అప్రూవర్గా మారి బెయిల్ పై బయటకొచ్చాడు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ తనయుడు మాగుంట రాఘవరెడ్డి అరెస్టయ్యాడు. చీకటి వ్యాపారాలు చేస్తూ, జగన్ రెడ్డికి ఆర్థిక అండదండలు అందిస్తారనే ప్రచారంలో వున్న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యకేసులో అరెస్టయి బెయిల్ పై బయటకొచ్చారు. వైఎస్ జగన్ రెడ్డి కోసం మీడియా ప్రమాణాలు కూడా పాటించకుండా అడ్డగోలు కథనాలు అచ్చోసి వదిలేసే డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపి గతంలో రూ.264 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్ కు చెందిన 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఈడీ ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. ఈ కేసులోనే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేసింది. జగన్ తో ఇటీవల భేటీ అయి ఒప్పందాలు కూడా చేసుకున్న బైజూస్ రవీంద్రన్ పైనా ఈడీ కేసు నమోదు చేసింది. వైఎస్ జగన్ రెడ్డి అతని బంధువులకి అత్యంత సన్నిహితుడైన సేఫ్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ శనగల శ్రీధర్ రెడ్డిని ముంబై కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన రూ.21 కోట్ల విలువైన ట్రమాడాల్ ట్యాబ్లెట్లను సూడాన్లో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేసిన కస్టమ్స్ అధికారులు.. మన రాష్ట్రానికి చెందిన సేఫ్ ఫార్మా కంపెనీ కంపెనీ డైరెక్టర్ శనగల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ సేఫ్ ఫార్మాతో వైసీపీలో పెద్దలకి సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. మొత్తానికి జగన్ రెడ్డియే కాదు, ఆయన చుట్టూ ఉన్నవారు, ఆయనతో ఒప్పందాలు చేసుకున్న వారూ ఏదో ఒక కేసులో అరెస్టు అవుతున్నారు.