సింగిల్ సింహంని ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. వై నాట్175 ఏమో కానీ 17 కూడా వ‌స్తాయో రావో కూడా డౌట్ కొట్టేస్తోంది. చేతిలో అధికారం మాత్రమే ఉంది. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య‌ ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌నే అప‌హాస్యం చేసేలా బ‌రితెగిస్తున్నార‌నే రోజుకొక విస్తుగొలిపే ఓట్ల స్కాం బ‌య‌ట‌ప‌డుతోంది. టిడిపి గెలిచే చోట వారి సానుభూతిప‌రుల ఓట్ల తీసివేత‌, వైసీపీ ఓడిపోయే చోట దొంగ ఓట్లు చేర్పించ‌డం ఇదే రాష్ట్ర‌మంతా సాగిస్తోంది వైసీపీ.
విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో వార్డులు, బూతులవారీగా టిడిపి సానుభూతిప‌రుల ఓట్ల గల్లంతుపై టిడిపి ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఈ స్కాం వెలుగు చూసింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించకుండా ఓట్లు తొలగించారని, దాదాపు 40 వేల ఓట్లు తొలగించార‌ని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.గుంటూరు పట్టాభిపురం 36 డివిజన్ లోని ఒకే డోర్ నెం. తో123ఓట్లు, అదే ఇంటి నెంబర్ తో33వ డివిజన్ పండరిపురం లో300ల ఓట్లు చేర్పించిన అధికారుల గుట్టుని టిడిపి నేత‌లు ర‌ట్టు చేశారు. గతంలో నివాసాలుగా ఉండి, నేడు స్కూల్ గా మార్చిన 36వ డివిజన్ లోని భవనంలో137ఓట్లను చేర్చించిన కార్పొరేషన్ అధికారుల అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా టిడిపి నేతలు బ‌య‌ట‌పెట్టారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలా వైసీపీ వంద‌ల సంఖ్య‌లో దొంగ ఓట్లు చేర్పించిన వైనంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కార్పొరేష‌న్ అధికారుల‌కి ఫిర్యాదు చేశారు.

జ‌గ‌న్ రెడ్డికి కావాల్సింది బాబాయ్ హ‌త్య‌కేసు నుంచి తాను త‌ప్పించుకోవ‌డం, త‌మ్ముడు అవినాష్ రెడ్డిని త‌ప్పించ‌డం. కేసీఆర్ కి అత్య‌వ‌స‌ర‌మైన‌ది ఢిల్లీ లిక్క‌ర్ స్కాములో కుమార్తె క‌విత ఎట్టి ప‌రిస్థితుల్లో అరెస్టు కాకుండా చూడ‌టం. దేశాన్నిఅంతా శాసిస్తూ దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీలో  మాత్రం త‌మ‌కి అడుగడుగునా అడ్డుత‌గులుతున్న కేజ్రీవాల్‌ని అడ్డు తొల‌గించుకోవ‌డం బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ముందున్న ప్ర‌థ‌మ ల‌క్ష్యం. ఈ ముగ్గురి అవ‌స‌రాలు తీర్చేందుకు ఒకే ఒక దారి దొరికింది. అదే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో వైసీపీ నేత శ‌ర‌త్ చంద్రారెడ్డిని అప్రూవ‌ర్‌గా మార్చ‌డం. ఢిల్లీ లిక్క‌ర్ స్కాములో శ‌ర‌త్ చంద్రారెడ్డిని అప్రూవ‌ర్ గా మార్చ‌డంలో ఏపీ సీఎం జ‌గన్ రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. అటు బీజేపీ చెప్పిన‌ట్టు త‌లాడించిన వెంట‌నే వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి సేఫ్ అయిపోయాడు. జ‌గ‌న్ రెడ్డిని విచారించాల్సిన సీబీఐ మౌనం దాల్చేసింది. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో క్వీన్ అని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె క‌విత పేరు చార్జిషీట్లలో క‌నిపించ‌లేదు. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ కి చెక్ పెట్ట‌డానికి ఇటు జ‌గ‌న్ రెడ్డి గ్యాంగ్‌ని, అటు క‌విత సిండికేట్‌ని కూడా వ‌దిలేశార‌ని స్ప‌ష్టం అవుతోంది. కేజ్రీవాల్ చాలా అమాయ‌కంగా కేసీఆర్, జ‌గ‌న్ రెడ్డితో చేతులు క‌లిపి ఎంత పెద్ద త‌ప్పు చేశానో అని ఇప్పుడు అర్థం చేసుకుని ఉంటారు. అయితే చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుని ఏం ప్ర‌యోజ‌నం లేద‌న్న చందంగా మారింది ప‌రిస్థితి. ఢిల్లీ మద్యం కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన వెంట‌నే ప‌రిస్థితుల‌న్నీ ఈ సిండికేటులో కీల‌కంగా ఉన్న జ‌గ‌న్ గ్యాంగ్, కేసీఆర్ ఇంటి మ‌నుషుల‌కి అనుకూలంగా మారిపోయి రిలీఫ్ దొరికేస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా భార్య మంచంపై ఉంది. అయినా ఆయ‌న‌కి బెయిల్ దొర‌క‌లేదు. ఈ లిక్క‌ర్ స్కాంలో పెద్ద చేయి అయిన కేసీఆర్ కుమార్తె క‌విత పేరే మాయం చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వ‌రెడ్డికి రిలీఫ్ ఇచ్చేశారు.  ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం అక్క‌డ కేజ్రీవాల్ మ‌నుషుల‌తో క‌లిసి చేసిన జ‌గ‌న్ రెడ్డి, కేసీఆర్ మ‌నుషులు అదే కేసులో ఎటువంటి సంబంధం లేన‌ట్టు త‌ప్పించుకుని..పూర్తిగా కేజ్రీవాల్ ని ఇరికించేశారు.

కొన్నాళ్లుగా తాడేప‌ల్లి ప్యాలెస్‌లోకి ఎంట్రీ కూడా బంద్ అయిన విజ‌య‌సాయిరెడ్డి మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. ఒకానొక ద‌శ‌లో బీజేపీలో చేరిపోతార‌ని కూడా సాయిరెడ్డిపై ప్ర‌చారం సాగింది. విజ‌య‌సాయిరెడ్డి నుంచి ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు మొద‌ట పీకేశారు. ఢిల్లీ వైసీపీ కోఆర్డినేట‌ర్ గా త‌ప్పించేశారు. సోష‌ల్ మీడియా ఇన్చార్జిగా పీకేశారు. వైసీపీ అనుబంధ సంఘాల బాధ్య‌త‌లు ఇచ్చిన‌ట్టే ఇచ్చి చెవిరెడ్డికి అప్ప‌గించేశారు. అప్ప‌టి నుంచి తాడేప‌ల్లి ప్యాలెస్‌లోకి, ఇటు తాడేప‌ల్లి వైసీపీ కార్యాల‌యానికి కూడా సాయిరెడ్డికి ఎంట్రీ బంద్ అయ్యింది. ఏమైందో ఏమో కానీ సోష‌ల్మీడియాలో కూడా ప‌తివ్ర‌త ప‌ర‌మాన్నం వండిన‌ట్టు ట్వీట్ల భాష కూడా సాంప్ర‌దాయ‌కంగా మారిపోయింది. ఇదే స‌మ‌యంలో సాయిరెడ్డికి అల్లుడు తార‌క‌ర‌త్న మ‌ర‌ణం మ‌రింత చిక్కుల్లోకి నెట్టేసింది. త‌న అల్లుడి మ‌ర‌ణం స‌మ‌యంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు, బాల‌య్య‌ల‌తో ఉండ‌ట‌మేకాదు, వారిని పొగ‌డాల్సి వ‌చ్చింది. ఈ కార‌ణంగానే సాయిరెడ్డిని జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ చేశార‌నే రూమ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఇదేది కాదు. ఏదో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ అని ఇప్పుడు అర్థ‌మైంది. త‌న అల్లుడు అన్న శ‌ర‌త్ చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అప్రూవ‌ర్ గా మార్చి జ‌గ‌న్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు నుంచి కాపాడ‌డంలో సాయిరెడ్డి కీల‌క పాత్ర పోషించారు. అంటే ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న‌ది జ‌గ‌న్ రెడ్డితో విభేదాల వ‌ల్ల కాద‌ని, ఢిల్లీ స్థాయిలో పెద్ద‌ల‌ని, లాబీయిస్టుల‌ని దింపి వ్య‌వ‌స్థ‌ల మేనేజ్ చేస్తూ ..చాలా కేసుల్నించి జ‌గ‌న్ రెడ్డిని కాపాడ‌డంలో తెర‌వెనుక సూత్ర‌ధారి సాయిరెడ్డి అని తెలుస్తోంది. ఇంకా తెర‌వెనుక డ్రామాలు క‌ట్టిపెట్టి మ‌ళ్లీ సాయిరెడ్డి తెర‌పైకి వ‌చ్చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ  మహిళ, యువజన, విద్యార్ధి విభాగాల ఆధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. జోనల్ స్థాయిలో పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సోష‌ల్ మీడియాలోనూ మ‌ళ్లీ రోత ట్వీట్లు వేస్తూ తాను మార‌లేద‌ని, మారిన‌ట్టు న‌టించాన‌ని నిరూపించుకున్నారు విజ‌య‌సాయిరెడ్డి.

టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల ఢిల్లీలో చేసిన మెరుపు టూరుతో వైసీపీ బేజారెత్తిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ తాము ఆడిందే ఆట‌గా, పాడిందే పాట‌గా ఆమోదిస్తున్న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు...త‌న హ‌వా జ‌నంలో త‌గ్గిపోయింద‌ని గుర్తించిన త‌రువాతే బాబుని పిలిపించుకున్నార‌నే విష‌యంపై క్లారిటీ తెచ్చేసుకున్నారు జ‌గ‌న్. ఇప్పుడు ముంద‌స్తుకి వెళ్తే ఉన్న‌ది పోయింది-ఉంచుకున్న‌దీ పోతుంది అనే తీరుగా త‌న ప‌రిస్థితి త‌యార‌వుతుంద‌ని ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్ ముంద‌స్తు లేదు తూచ్ అనేశారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు త‌న‌ని అవ‌స‌రానికి వాడుకుని, ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గిపోయింద‌ని గుర్తించి దూరం పెట్టినా ఏం చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితి జ‌గ‌న్ రెడ్డిది. త‌న‌ని దేక‌డంలేదు స‌రే, త‌న‌కీ-బీజేపీకి కూడా అస్స‌లు గిట్ట‌ని చంద్ర‌బాబుతో ఎలా క‌లుస్తార‌నేది జ‌గ‌న్ కి నిద్ర‌ప‌ట్ట‌నీయ‌డంలేదు. కేంద్రం దూర‌మ‌య్యే స్థితిలో, ముంద‌స్తుకి వెళ్లి 9 నెల‌లు పాలించే అధికారాన్ని కూడా ఎందుకు పోగొట్టుకోవాల‌నే ఆలోచ‌న‌లో వైసీపీ పాల‌కులు ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ప‌డైనా..పూర్తిస్థాయి అధికారం అనుభ‌వించేద్దామ‌ని, ఆ త‌రువాత ఎలాగూ ఓడిపోతాం కాబ‌ట్టి దొరికినంత దోచుకుందామ‌నే ప్లాన్‌లో ఉన్నార‌ని వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. చంద్ర‌బాబు అమిత్‌షాతో ఏం మాట్లాడారో ఎవ‌రూ చెప్ప‌లేదు. కానీ పిక్చ‌ర్ వైసీపీ క‌ళ్లకి క్లియ‌ర్ అయిపోయింది. అందుకే కేబినెట్ మీటింగ్‌లోనే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండ‌వ‌ని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల‌ని సీఎం జ‌గ‌న్ రెడ్డి తేల్చేశారు.

Page 11 of 3183

Advertisements

Latest Articles

Most Read