ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. టిడిపికి అనుకూలమైన వాతావరణం రాష్ట్రమంతా ఏర్పడింది. ఈ సారి అధికారం దక్కడం ఖాయమని టిడిపి సీటు ఎలాగైనా సాధించాలని ఆశావహులు ఎత్తుగడలు పన్నుతున్నారు. కొందరైతే అధిష్టానంపై బ్లాక్ మెయిలింగ్, ఒత్తిడులకీ దిగుతున్నారు. కౌరవసభ నుంచి వెళ్లిపోతున్నానని, గెలిచి టిడిపి అధికారం చేపట్టి గౌరవసభలో మళ్లీ అడుగు పెడతానని చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లోనూ తెలుగుదేశం పట్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇటువంటి సమయంలో మొహమాటాలకి పోయి, ఒత్తిడులకి లొంగి సీట్లు ఇస్తే..లక్ష్యం చేరుకోవడం కష్టమని చంద్రబాబే ఫిక్స్ అయ్యారు. సత్తెనపల్లి టిడిపి కన్నా లక్ష్మీనారాయణకి ప్రకటిస్తూనే ఇదే సంకేతాలు పంపారు బాబు. దీనిపై కొందరు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఒత్తిడి పెంచాలని చూస్తే..సీబీఎన్ నుంచి వచ్చిన సమాధానం `` ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తాను ఏ మొహమాటాలూ పెట్టుకోదలచుకోలేదు`` అని స్పష్టం చేశారు. మొహమాటపడి టికెట్లు ఇస్తే ప్రభుత్వంలోకి రాలేమంటూ కుండబద్దలు కొట్టారు. అభ్యర్థుల ఎంపికపై ఐదు మార్గాల్లో సర్వేలు నివేదికలు పరిశీలించిన తరువాతే ఎంపిక ఉంటుందని చెప్పారు. మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం సత్తెనపల్లి టికెట్ దక్కకపోవడంపై అలకబూని, రకరకాలుగా ఒత్తిడి పెంచే మార్గాలని ఎంచుకున్నారు. ఆయనలాంటి వారికి అందరికీ ఇదే సమాధానం అని చెప్పకనే చంద్రబాబు చెప్పారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో వచ్చేవారిని దగ్గరకు రానివ్వొద్దని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలపైనా నియంత్రణలో ఉండాలంటూ సంకేతాలు పంపారు. తాము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదని తేల్చేశారు. మొత్తానికి చంద్రబాబు చాలా క్లియర్ గా ఉన్నారు. మొహమాటాల్లేవు, ఒత్తిళ్లకి లొంగేది లేదని స్పష్టమైన సంకేతాలిచ్చేశారు.
news
ఏపీలో పొలిటికల్ ట్రెండ్ మారింది..బాబు వైపు మోదీషా చూపు
ఏపీలో పొలిటికల్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టిడిపి ఈ రేంజులో పుంజుకుంటుందని ఏ రాజకీయ పార్టీలు వూహించలేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపి అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలు, సర్వేలు వెలువడుతున్నాయి. టిడిపితో ఆల్రెడీ జనసేన పొత్తు కన్ ఫామ్ అయ్యింది. జనసేన బీజేపీ అలయెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ పెద్దలు వైసీపీతో రహస్యపొత్తు కొనసాగిస్తున్నారు. ఇంత గందరగోళమైన ఎత్తులు-పొత్తుల మధ్య ముందస్తు ముచ్చట్లు ఉండనే ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక టిడిపి బీజేపీతో సంబంధాలకి ఆసక్తి చూపించినా, వారు వైసీపీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. నిత్యమూ కేసులు, హత్యలు, అప్పుల కోసం తమ చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డికి జనాదరణ తగ్గిపోయిందని కమలనాథులు కనిపెట్టేశారు. తెలంగాణలోనూ తమ అవసరానికి కోట్లు సాయం చేయగలడు కానీ, ఓట్లు తేలేని జగన్ రెడ్డిని దూరం పెట్టే యోచనలో కేంద్రంలోని బీజేపీ పెద్దలున్నారని విశ్వసనీయ సమాచారం. పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన జగన్ రెడ్డికి తమ అవసరమే కానీ, తమకు జగన్ ఏ విధంగానూ ఉపయోగపడేలా లేడని వ్యూహం మార్చేశారు. దాదాపు ఆరేళ్లుగా ఎడమొఖం-పెడమొఖంగా ఉన్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో తొలి భేటీ జరగబోతోంది. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ పెను రాజకీయ మార్పులకు వేదిక కానుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీకి ఏమీ లేదనే సంగతి వారికీ తెలుసు. ఇక్కడ బీజేపీతో టైఅప్ అయితే టిడిపి ఓట్లతో వారికి సీట్లు తేవడం తప్పించి ఇంకే మేలూ జరగదు. బీజేపీ టిడిపి వైపు చూడడానికి అసలు సిసలు ఫాక్టర్ తెలంగాణ. కర్ణాటకలో బొక్కబోర్లాపడి దక్షిణాదిలో పవర్లో లేని బీజేపీగా మిగిలిపోయింది. పదేళ్ల కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటే, టిడిపి వంటి ఓటుబ్యాంకున్న పార్టీతో పొత్తు ఖరారైతే తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేయొచ్చనే దిశగానే పొత్తుల వ్యూహం ఉండొచ్చని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ రెడ్డా మజాకా.. అజ్ఞాతంలోకి ఉద్యోగసంఘ రాష్ట్ర నేత
చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఉద్యోగసంఘ నేతలు ఎన్ని డిమాండ్లు, ఎన్ని నిరసనలు చేశారో లెక్కే లేదు. వేదికలపై నుంచి సీఎం బాబు, నాటి సర్కారుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఏ నాడూ ఏ ఉద్యోగసంఘ నేతని కనీసం హెచ్చరించిన పాపాన పోలేదు. ఫిట్మెంట్ తెలంగాణ కంటే ఎక్కువగా ప్రకటిస్తే, అప్పటి టిడిపి సర్కారుని అభినందించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఎవడి కోసం పెంచుతాడంటూ బహిరంగ వేదిక నుంచే చంద్రబాబుని తూలనాడుతూ మాట్లాడారు. అయినా ఏనాడూ ఆయనపై ఏ కేసులూ సర్కారు పెట్టలేదు. ఉద్యోగపరంగా, సంఘపరంగా ఇబ్బందులు పెట్టలేదు. లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలోనూ ఉద్యోగులకీ ఏ లోటూ రాకుండా చూసుకుంది టిడిపి ప్రభుత్వం. అయినా సరే రెండుచేతులతో ఓట్లు వేసి-వేయించి వైసీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఉద్యోగులు. ఇది వారే చెప్పిన మాట. పాలిచ్చే ఆవుని కాదనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టయ్యింది. తమకి ఇచ్చిన హామీలు, న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం చంద్రబాబు మాదిరిగానే జగన్ రెడ్డిని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సభ్యులు. దీంతో ఈ సంఘాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. కోర్టుకెళ్లిన ఏపీజీఈఏ విజయం సాధించింది. అయితే జగన్ రెడ్డిది పాము పగ. తన సర్కారుకి జీ హూజూర్ అనకుండా పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు సూర్యనారాయణని టార్గెట్ చేశారు. వాణిజ్యపన్నులశాఖలో నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనే ఆరోపణల కేసుని సూర్యనారాయణ చుట్టూ బిగించారు. ఈ కేసులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టిన కేసని అందరికీ తెలుసు. అయినా ఆ పెద్దల కళ్లలో ఆనందం చూడటం కోసం ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణని అరెస్టు చేయడం తప్పించి పోలీసులు ఇంకేం చేయలేరు. పాపం, ఉద్యోగులు-ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబు మాదిరిగానే బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్లు సాధించుకోవచ్చనుకుని జగన్ రెడ్డి దగ్గర తోక జాడించారు. ఆయన తోకే కాదు జీవితమే కట్ చేసేలా ఉన్నారు.
రాంగోపాల్ వర్మ `వ్యూహం` బెడిసికొట్టింది
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే గడ్డిపోచ కూడా ఒడ్డు చేరుస్తుంది. అవే పరిస్థితులు ప్రతికూలంగా మారితే గడ్డిపోచే పామై కాటేస్తుంది. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది. 2019 ఎన్నికలకి ముందు రాంగోపాల్ వర్మతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి కొంత టిడిపిని డ్యామేజ్ చేయించగలిగారు. యాత్ర తీయించి కొంత మైలేజ్ తెచ్చుకున్నారు. కోడికత్తి డ్రామా అని తెలిసినా సానుభూతి కలిసి వచ్చింది. బాబాయ్పై గొడ్డలిపోటు వేయించి నారాసుర రక్తచరిత్ర అని చేసిన ప్రచారం సీట్లు తెచ్చి పెట్టింది. పన్నిన కుతంత్రాలన్నీ ఫలించి సీఎం పదవి దక్కింది. అయితే పాలన పడకేసింది. ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అభివృద్ధి అథఃపాతాళంలోకి చేరింది. ఒక్కచాన్స్ ఇచ్చిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా దింపేద్దామా అన్నంత కోపంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో మళ్లీ గత ఎన్నికలకి పన్నిన కుతంత్రాలలో ఒక్కొక్కటి బయటకి తీస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ టీముతోపాటు రాంగోపాల్ వర్మ కూడా ప్యాకేజీకి వైసీపీ కోసం పనిచేశారు. మళ్లీ ఇప్పుడు కూడా తమ పని మొదలుపెట్టారు ఈ ప్యాకేజీ డైరెక్టర్. జగన్ రెడ్డికి ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా 'వ్యూహం' పేరుతో రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. ఆలోచనకు, అహంకారానికి మధ్య జరిగే యుద్ధం అంటూ క్యాప్షన్ కూడా చెప్పారు. దీని ఫస్ట్ లుక్ షూట్ ఫోటోలు విడుదల చేశారు. జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాతకి కూడా జగన్ సర్కారు తాయిలం టిటిడి బోర్డు సభ్యత్వం ఆల్రెడీ కట్టబెట్టేశారు. జగన్ రెడ్డికి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి. జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చేయించిన అరాచకాలు, బాధితులు ఆర్తనాదాల నేపథ్యంలో రియల్ విలన్ జగన్ని రీల్ హీరోగా రాంగోపాల్ వర్మ చేసే ప్రయత్నం ఎదురు తన్నేస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. దీనికి ఉదాహరణగా పోస్టర్లు రిలీజ్ చేసిన వెంటనే ట్రోల్స్, మీమ్స్ హోరెత్తిపోయాయి. వాటి రీచ్ కూడా విపరీతంగా ఉండడం వ్యూహం బెడిసికొట్టడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.