నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు భారీ ఎత్తున రానున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి తరలివచ్చే పరిశ్రమల కోసం రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్ కారిడార్ లే అవుట్లో అభివృద్ధి పనులు ముమ్మరమయ్యాయి.
డీఆర్డీవో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాల తయారీ... హెలికాప్టర్ తయారీలో ఉపయోగ పడే విడిభాగాలు తయారీ... ఎల్ఈడీ టీవీల్లో ఉపయోగించే పరికరాలు మొదలు ఎలక్రానిక్ వస్తువులకు అవసరమయ్యే విడిభాగాలను తయారుచేసే కంపెనీలూ రాబోతున్నాయి
ముందుగా 75 కంపెనీలు ప్రారంభమవుతాయి. వీటి ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షంగా, మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకు తుందన్నారు. పూర్తిస్థాయిలో వచ్చాక మరో 400 చిన్న మధ్యతరహా కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలతోనూ అటు అభివృద్ది, ఇటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగానే చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆకర్షించేందుకు గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో ఒక పారిశ్రామిక లే-అవుట్ ను ఏపీఐఐసీ సిద్ధం చేసింది. ఇందులో 75 సంస్థలకు కలిపి 81 ఎకరాలు కేటాయించింది. దీన్నీ ఒక మోడల్ పారిశ్రామిక ఎస్టేట్గా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు, మౌలిక సదుపా యాలను కల్పిస్తున్నారు. దీన్నిచూసి ఇతర కంపెనీలు కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఎస్టేట్లో భూములు పొందిన చిన్న మధ్యతరహా కంపెనీల యజమానులంతా సోమవారం అక్కడకు రానున్నారు. మౌలిక సదుపాయాలు, తమ ప్లాట్ల అభివృద్ధిని పరిశీలిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం వీరు తమ కంపెనీల నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ లే అవుట్ కు శంకుస్థాపన చేస్తారు.