నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో, రాష్ట్రంలోనే మొట్టమొదటి సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలకు వీలుగా, ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. గుంటూరులో, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది.
బ్లూ రంగులో ఉన్న ఈ ట్రాక్, చూపరులను ఆకర్షిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు సింథటిక్ ట్రాకు ఒక్కటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా జాతీయ క్రీడలు నిర్వహించాలనే ఉద్దేశంతో, బిడ్ను కూడా గతేడాది దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ క్రీడలు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంపై దృష్టిసారించింది.
ఈ సింథటిక్ ట్రాక్తో ఇక మీదట జాతీయ, అంతరాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఇక్కడ జరపడానికి మార్గం సుగుమమైంది.
ఇవి సింథటిక్ ట్రాక్ విశేషాలు
- సింథటిక్ ట్రాకు 400 మీటర్ల ఉంటుంది
- ఒకేసారి ఎనిమిది మంది పరిగెత్తే వీలు ఉంటుంది
- ట్రాకు మధ్యలోనే షాట్పుట్, ఫుట్బాల్, హాకీ, లాంగ్జంప్ వంటి క్రీడలు ఆడవచ్చు
- వర్షం పడితే చుక్కనీరు కూడా ట్రాకుపై నిలబడదు
- దీని నిర్మాణానికి రూ.6.86 కోట్లు వెచ్చించారు. అందులో కేంద్ర ప్రభుత్వ క్రీడలు, యువజన సర్వీసులశాఖ రూ.5.4 కోట్లు కేటాయించింది
- నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) సంస్థ, దీని నిర్మాణం చేస్తుంది
- సింథటిక్ ట్రాకుపై ఆడడం వల్ల క్రీడాకారులకు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు రావు, మరింత ఉత్సాహం వస్తుంది
సింథటిక్ ట్రాక్ నిర్మాణం ఎలా జరిగింది
దీని నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను కెనడా నుంచి దిగుమతి చేసుకోగా, ట్రాకును మలేషియాకు చెందిన గుత్తేదారులు నిర్మించారు. 400 మీటర్ల పరిధిలో విస్తరించిన ఈ ట్రాకును భూమి లోపల నుంచి పలు విధాలుగా నిర్మించుకుంటూ వచ్చారు. లోపలికి మూడు అడుగుల మేర తవ్వి పునాది నుంచి కంకరు, ఇసుక వేశారు. దానిపై రెండు లేయర్లు బిటమిన్(తారు) వేశారు. దానిపై ఎర్ర రంగుతో కూడిన ఒక లేయర్ సింథటిక్ వేశారు. దీనిపై రబ్బరు, లిక్విడ్తో కూడిన బ్లూ గ్రాన్యూల్స్ను బ్లోయింగ్ మిషన్తో అద్దారు. మొత్తం 40 ఎంఎం సైజులో ఆయా మిశ్రమాలను వినియోగించారు. దీని నిర్మాణానికి 230 డ్రమ్ముల లిక్విడ్, రంగులు వాడారు. ట్రాకు లోపల, బయట వేర్వేరుగా డ్రెయిన్ల ఏర్పాటు ఉంది.