జగన్ మోహన్ రెడ్డికి కొరకారని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఈ రోజు ఢిల్లీ వెళ్ళటం, చర్చనీయంసం అయ్యింది. ఒక పక్క వైసీపీ షోకాజ్ నోటీస్ ఇవ్వటం, మరో పక్క ఆ షోకాజ్ నోటీస్ చెల్లదు అంటూ రఘురామ కృష్ణం రాజు చెప్పటం, ఆ తరువాత రోజే ఆయన ఢిల్లీ వెళ్ళటం చర్చనీయాంసం అయ్యింది. ఢిల్లీ వెళ్ళటంతోనే, రఘురామకృష్ణం రాజు, కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. వైసీపీ నుంచి, ఆ పార్టీ రాజ్యసభ సాభ్యుడు విజయసాయి రెడ్డి తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వటం పై, నిన్న రఘురామకృష్ణం రాజు సీరియస్ అయిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు, విజయసాయి రెడ్డి హోదా పై, నిన్న రాసిన లేఖలో రఘురామకృష్ణం రాజు, ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ విజయసాయి రెడ్డి నోటీసు ఇవ్వటం పై, రఘురామ రాజు అభ్యంతరం వ్యక్తం చేసారు. అలాగే గతంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడ ఉపయోగించకూడదు అని ఆదేశాలు ఉన్నా, విజయసాయి రెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసు లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఉండటాన్ని, రఘురామకృష్ణం రాజు తప్పుబట్టారు.

అలాగే తమ పార్టీలో, నిబంధనలు ప్రకారం, అసలు క్రమశిక్షణా కమిటీనే లేదని, ఇది నిబంధనలకు వ్యతిరేకం అని అన్నారు, రఘురామకృష్ణం రాజు. అలాంటిది, విజయసాయి రెడి తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వటం చట్టబద్దత కాదు అంటూ, రఘురామకృష్ణం రాజు చెప్తున్నారు. ఈ అంశాలు అన్నిటి పై, రఘురామకృష్ణం రాజు, ఈ రోజు కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి, తనకు ఇచ్చిన నోటీసులు, జరిగన పరిణామాలు, రూల్స్ కు వ్యతిరేకంగా తమ పార్టీ నడుస్తుంది అంటూ, సొంత పార్టీ పైనే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే, ఎన్నికల కమీషనర్ ను కలిసిన తరువాత, కొంత మంది బీజేపీ పెద్దలను కూడా రఘురామకృష్ణం రాజు కలిసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పార్లమెంట్ స్పీకర్ కు కూడా ఆయన తనకు కేంద్ర బలగాలతో భద్రత కావాలి అంటూ, ఇప్పటికే లేఖ రాసారు. దీని పై కూడా ఆయన, స్పీకర్ ను కలిసే అవకాసం ఉందని, అలాగే కేంద్ర హోం శాఖ వర్గాలను కూడా, ఆయన కలిసి, రాష్ట్రంలో తన పై వస్తున్న బెదిరింపులు పై, ఫిర్యాదు చేయ్యనున్నట్టు తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "మండలిలో మంత్రుల దుర్భాషలాడటం, మాపై దాడిచేయడంపై 18న చైర్మన్ కు తెదేపా ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు. తమ తప్పులు బయటపడతాయని ఆరు రోజుల తర్వాత మంత్రులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వాస్తముంటే మండలిలో ఆనాడు జరిగిన సంఘటనలపై వీడియో ఫుటేజీ బయట పెట్టండి. మండలిలో 17న జరిగిన బిజినెస్ పై వైసీపీ మంత్రులు, నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. గతంలో మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినపుడు లైవ్ టెలీకాస్ట్ ఆపేశారు. మండలిలో సమస్య ఉన్నప్పుడు లైవ్ టెలీకాస్ట్ నిలిపివేయడంలో ప్రభుత్వ ఉద్దేశాలు తేటతెల్లం అవుతున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ,మండలిలలో 13మంది చొప్పున మంత్రులు వంతులవారీగా ఉండాలి. కానీ 17 న ఒకేసారి 18 మంది మంత్రులు హాజరవడం తెదేపా సభ్యులపై దాడికి అన్నది స్పష్టం. వెల్లంపల్లిని తెదేపా సభ్యులంతా కొడితే తక్షణం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతూ మాపై ఫిర్యాదు చేసే వారు. కానీ అలా జరగలేదు. ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో ప్రవేశ పెట్టనీయ కుండా మంత్రులే అడ్డుకుని తెదేపా సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును ఆమోదింప జేసుకోవడంపైనే మంత్రులు ఆసక్తి చూపారు. మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీ వద్ద ఉందని ప్రభుత్వం కోర్టులో చెప్పింది.అలాంటప్పుడు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి ఆపై మూడు రాజధానుల బిల్లుపై మాట్లాడదామని చెప్పాం. కానీ వాస్తవం అలాఉంటే ...వైసీపీ మంత్రుల తప్పులు కప్పి పుచ్చడానికి తెదేపా సభ్యులపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు."

"కౌన్సిల్ అవసరమా’’ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ కన్నా మండలి స్థాయి పెద్దది. ఒక సభలోని సభ్యులు మరో సభపై ఆరోపణలు,వ్యాఖ్యానాలు చేయకూడదని తమ్మినేని గుర్తించాలి. ఆయన స్పీకర్ గాఉన్నారు కానీ రాజకీయ స్థానంలో లేరు. ద్రవ్య వినిమయ బిల్లు, మండలి గురించి వ్యంగ్యాస్తాలు చేయడం తమ్మినేనికి తగదు. వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడకూడదు. రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత వెంకయ్య నాయుడు బీజీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తించాలి. `కమ్మవైరస్’ అంటూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను కులం పెట్టి దూషించడం తగదు. రాజ్యాంగ ప్రత్యేక వ్యవస్థ అయిన ఎస్.ఈ సి తో తమ్మినేనికి ఎం పని. రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేయడమేనా తమ్మినేని సంస్కృతీ,విధానం. మండలిలో రూల్స్ తెలుసుకుని నడుచుకోవాలి."

"మండలిని,చైర్మన్ , సభ్యులను ఇక నుంచీ అవమానకరంగా మాట్లాడితే తమ్మినేనిపై చర్యలు తీసుకుంటాం . స్పీకర్ స్థానాన్ని కాపాడాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎవరికీ ఫోన్ చేసినా తమ్మినేని సీతారాం భూకుంభకోణాలు,కలింగ కార్పోరేషన్ పేరుతో కులంపేరు చెప్పి, ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం,ఏపీ ఎండీసీ వెబ్ సైట్ లో బుక్ చేస్తే నెలరోజులకు దొరికే ఇసుక తమ్మినేని ని సంప్రదిస్తే డబ్బులు ఎక్కువిస్తే ఒకేరోజులో లభ్యమవుతోందని చెబుతున్నారు. ఇసుక అమ్మకాలలో దొంగబిల్లులు ఇస్తున్న మిషన్ , బిల్లులను మాజీ శాసనసభ్యులు కూనా రవి కుమార్ పట్టిచ్చినా ఇంత వరకూ చర్యలులేవు. ప్రభుత్వ యంత్రాంగం,రాజకీయ నాయకులు కలసిపోయారు. వైసీపీకి చెందిన 95 ఎమ్మెల్యేలు, 12 ఎంపీలపై కేసులు, ఎఫ్ ఐ ఆర్ లు ఉన్నాయి.దేశంలోని ప్రాంతీయ పార్టీలలో వైసీపీ నేతలపైనే అత్యధిక కేసులున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను కూలుస్తున్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదే. ఇటువంటి వ్యక్తుల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏమిటి? వైసీపీనేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం, మాటల్లో ప్రతిదీ అసత్యాలు,అబద్దాలు, ప్రతిపక్ష నాయకులపై దూషణలు ప్రజల ముందు పెడుతున్నాం. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు,ఎవరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో ప్రజలే గమనించాలి. ఇప్పటికే అబద్దాలు,అసత్యాలు మాట్లాడి ప్రజల్లో వైసీపీ నేతలు అభాసుపాలయ్యారు. ఇప్పటికైనా వైసీపీ మంత్రులు, నాయకులు వాస్తవాలను మాట్లాడాలి, రాజకీయాల గౌరవాన్ని నిలబెట్టాలి."

వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు, ఆ పార్టీ నేత, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసు, పార్టీ అధినేతను కించపరుచుతున్నారు అంటూ, కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ తో విజయసాయి రెడ్డి, రఘు రామ రాజుకు నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అంటూ, రఘురామకృష్ణం రాజుకు నోటీసులో తెలిపారు. అయితే దీని పై రఘురామరాజు ఈ రోజే నేను సమాధానం ఇస్తానని, నిన్న మీడియాతో తెలిపిన సంగతి తెలిసిందే. రఘురామ రాజు ఎలా స్పందిస్తారా అని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన ఈ రోజు ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో షోకాజ్ నోటీసు స్పందన పై, ఆయన వెరైటీగా, లాజికల్ గా, వైసిపీకి షాక్ ఇచ్చే విధంగా స్పందించారు. నేను ఆ షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇవ్వాలి అంటే, ముందు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ, మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా, ప్రశ్నలు సంధించారు రఘురామ రాజు.

రఘురామ మాట్లాడుతూ "నేను ఎప్పుడూ మా నాయకుడు ఒక్క మాట అనలేదు. అయినా నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయితే ఆ షోకాజ్ నోటీసుకు రిప్లై ఇద్దాం అనుకుంటే, నాకు ఇచ్చిన నోటీస్ లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాకు బీఫారం ఇచ్చింది అని రాసారు. అయితే నా బీఫాం కాని, ఎలక్షన్ సర్టిఫికేట్ లో కాని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది. నాకు నోటీస్ ఇచ్చిన లెటర్ హెడ్ లో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంది. నాకు డౌట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు లో చూసాను. అక్కడ కూడా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది. మరి నా బీఫారం గురించి చెప్తూ నోటీసు ఇచ్చారు కాబట్టి, పేరులో తేడా ఉంది కాబట్టి, నాకు క్లారిఫికేషన్ కావాలి. నేను వివరణ ఇవ్వాల్సింది, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, అందుకే నేను ఈ ప్రశ్న అడుగుతున్నా, లేకపోతే రేపు నాకు లీగల్ ఇబ్బందులు వస్తాయి. అలాగే, మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం, ఇలాంటి నోటీసులు క్రమశిక్షణ కమిటీ ఇవ్వాలి. మరి జనరల్ సెక్రటరీ ఎందుకు ఇచ్చారు ? నేనే రిప్లై ఇవ్వాల్సింది వైఎస్ఆర్ పార్టీకి కాదు. పార్టీ మారితే నాకు ఆ వివరాలు ఇవ్వండి. స్టేట్ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ ఎలా ఉంటారు ? నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వెంటనే, నేను మళ్ళీ షోకాజ్ నోటీస్ కు సమాధానం చెప్తాను" అని రఘు రామ రాజు అన్నారు. మరి, వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

వైసీపీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై, ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా, లెటర్ లో ఆయన, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ, వెటకారం చేసినట్టు కనిపిచింది. లేఖ మొదట్లోనే, విజయసాయి రెడ్డిని సంబోధిస్తూ, "శ్రీ విజయసాయి రెడ్డి - నేషనల్ జనరల్ సెక్రటరీ టు స్టేట్ రికగ్-నైజెడ్ రీజినల్ పార్టీ" అంటూ సంబోధించటంలోనే, విజయసాయి రెడ్డిని ఎంత వెటకారం చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక పొతే, లేఖ చివర్లో కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు. నేను మీరు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్తాను, కాకపోతే ముందు మీరు, నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధనం ఇవ్వండి అని అన్నారు. ఒక వేళ, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోతే, నేను మీరు ఈ కమ్యూనికేషన్ చెయ్యటానికి అనర్హుడుగా భావిస్తూ, మీ పైన లీగల్ ప్రొసీడింగ్స్ కు వెళ్తానని, మీరు అందరినీ తప్పుదోవ పట్టించారని, మీ పై లీగల్ గా వెళ్తానని, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు. ఇక చివరగా, విజయసాయి రెడ్డి పై, డైరెక్ట్ గా విమర్శలు సంధించారు.

మన పార్టీ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీరు ప్రయత్నం చెయ్యకండి అని విజయసాయి రెడ్డిని కోరారు. ప్రజాస్వామ్య పధ్ధతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, మీరే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్నారు, మీకంటే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్న వారు లేరు అంటూ, విజయసాయి రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే, ఎన్నికల కమిషన్ అనేది లేకుండా పోతుంది అంటూ, ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇక అంతకు ముందు కూడా, మాది ఒక ప్రాంతీయ పార్టీ, అయితే విజయసాయి రెడ్డి మాత్రం, నేను నేషనల్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకుంటున్నారని, అని అక్కడ కూడా విజయసాయి రెడ్డి పై గురి పెట్టారు. ఇక ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు, పార్టీ క్రమశిక్షణా విభాగం చర్యలు తీసుకుంటుందని, క్రమశిక్షణా విభాగం గురించి ఈసికి చెప్పాలని, మరి క్రమశిక్షణా విభాగంలో విజయసాయి రెడ్డి ఎప్పుడు వచ్చారు ? ఆయన ఒక్కడే ఉన్నారా అంటూ, ప్రశ్నించారు మొత్తానికి, రఘురామ రాజు, విజయసాయి రెడ్డిని టార్గెట్ చెయ్యటం పై, ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read