రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్​ - 5 జోన్​) ఏర్పాటు విషయంపై.. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు, భూములిచ్చిన రైతులు.. సీఆర్డీఏకు అభ్యంతరాలు సమర్పించేందుకు 30 రోజులు గడువు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటు ధరల్లో గృహనిర్మాణ జోన్ - 5 ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900 ఎకరాల్ని ఆర్ - 5 జోన్‌గా పేర్కొంది.

ఈ వ్యవహారంపై అభ్యంతరాలు సమర్పించేందుకు 15 రోజులు గడువిస్తూ ప్రభుత్వం ఈనెల 10న గెజిట్ జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యం, రాష్ట్రంలో లాక్​డౌన్ పరిస్థితుల కారణంగా అభ్యంతరాలు సమర్పించేందుకు గడువును పొడిగించాలని కోరుతూ రైతు ఎ.నందకిశోర్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం అభ్యంతరాల సమర్పణ గడువును పొడిగించింది.

మరో పక్క, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌, వ్యవస్థాపక కుటుంబ సభ్యుల నియామకాలపై... ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులని కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజు, వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఊర్మిల గజపతిరాజు, ఆర్వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఆదేశాలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్​ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

నేటి నుంచి దేశమంతా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇల్లు విడిచి బయటకు రావటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. జనతా కర్ఫ్యూను మించి లాక్​డౌన్​ను అమలు చేస్తామని స్పష్టం చేశారు.21 రోజుల పాటు ఈ లాక్​డౌన్​ కొనసాగుతుందని తెలిపారు ప్రధాని. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారని.. అందువల్ల రానున్న 21 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు.లక్ష్మణ రేఖ..ప్రతి ఇంటికీ లాక్​డౌన్​ నిర్ణయం లక్ష్మణ రేఖ వంటిదని మోదీ అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. రహదారులపై ఎవరూ తిరగవద్దన్నారు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజులు పడుతుందని.. అందువల్ల తెలియకుండానే అతని నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రధాని మాట్లాడుతూ, "ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదు. ఈ దేశంలో ఏం జరిగినా ఇళ్లలోనే ఉండాలి. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. ఏం జరిగినా ఇంటిచుట్టూ ఉన్న లక్ష్మణరేఖ దాటి రావొద్దు. కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ లాక్‌డౌన్ నిర్ణయం.. ప్రతి ఇంటికి లక్ష్మణరేఖ. కరోనా సోకినవాళ్లు తొలుత సాధారణంగానే ఉంటారు, కాబట్టి ఇతరులను కలిసే ప్రయత్నం చేయవద్దు. రహదారులపై ఎవరూ తిరగవద్దు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్నిరోజుల సమయం పడుతుంది."

"దానివల్ల తెలియకుండానే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం. వైరస్ సోకిన వ్యక్తి వందలమందికి వ్యాపింపజేయగలడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరేందుకు 67 రోజులు పట్టింది. తర్వాత 11 రోజుల్లోనే మరో లక్ష మంది బాధితులు నమోదయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో లక్ష మందికి సోకేందుకు 4 రోజులే పడుతుంది. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెప్పేందుకు ఈ గణాంకాలే ఉదాహరణ. చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్‌ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వైద్య సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయింపు. ఆరోగ్య సేవలకే తొలి ప్రధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నా. సంక్షోభ సమయంలో భుజం భుజం కలిపి పనిచేయాలి. కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం ఇదే విషయంపై ఆలోచిస్తున్నాయి. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. కేంద్ర, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. నిర్లక్ష్య ధోరణితో మందులు తీసుకుంటే మరింత ప్రమాదంలో పడతారు. 21 రోజుల లాక్‌డౌన్‌.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు "

రాష్ట్రంలో లాక్‌డౌన్ రెండోరోజుకూ మంచి స్పందన వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, స్వచ్ఛందంగా సహకరించారని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ మన చేతుల్లోనే ఉందని చెప్పారు. కరోనా నివారణ చర్యలను మరింత కట్టుదిట్టంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలో విదేశాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ప్రజలకు డీజీపీ సవాంగ్ సూచించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరుతున్నామన్న డీజీపీ... విదేశాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గ్రహించి ప్రవర్తించాలని సూచించారు. అవసరం లేకుండా తిరిగేవాళ్ల వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 298 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విదేశాల నుంచి వచ్చేవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారన్న డీజీపీ... అలాంటి వారిపై కేసులు పెట్టి పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దుల్లోనూ ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. కరోనాపై ప్రతిరోజూ ఆంక్షలు పెరిగే అవకాశం ఉందన్న డీజీపీ సవాంగ్‌... అత్యవసర సమయాల్లోనూ కారులో ఇద్దరినే అనుమతిస్తామని చెప్పారు. ఏపీకి వచ్చే అన్ని రహదారులను పూర్తిగా మూసివేస్తున్నామని డీజీపీ తెలిపారు. రాత్రి నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వాహనాలను అనుమతించట్లేదని పేర్కొన్నారు. అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రహదారుల మూసివేత కారణంగా ప్రజలెవరూ రాకపోకలు కొనసాగించరాదని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ వాయిదా వేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అంగన్వాడీలు ఇళ్ల వద్దకే వచ్చి పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఒకేచోటకు రాకుండా పలుచోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు నిలిపివేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 8కి చేరాయని వైద్యవిద్య సంచాలకుడు వెంకటేశ్‌ తెలిపారు. లండన్‌ నుంచి తిరుపతి వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మక్కా నుంచి విశాఖ వచ్చిన వ్యక్తి కుమార్తెకు నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. అనంతపురం బోధనాస్పత్రిలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలో కడప, విశాఖలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని వెంకటేశ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు లాక్​డౌన్​ పోలీసులు నియంత్రణతో పూర్తిస్థాయిలో అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసర దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు మూసివేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిత్యావసరాల దుకాణాలు సైతం ఉదయం పది గంటల తర్వాత మూసి వేయించారు పోలీసులు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

ఇక మరో పక్క, కరోనా ప్రభావంతో కృష్ణా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. లాక్​డౌన్ ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం కోరుతుంది. ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లలో ఉదయం 7 గంటలకే కూరగాయలు అయిపోతున్నాయి. ఇదే అదునుగా దళారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కష్టకాలంలో ప్రజలకు బాసటగా నిలిచేందుకు ముందుకువచ్చారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లికి చెందిన తోట వెంకయ్య.

సుమారు 50 వేల రూపాయలతో కూరగాయలు కొనుగోలు చేసి గ్రామాల్లో ఉచితంగా పంపణీ చేశారు. రెండు రోజుల నుంచి కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ నెల 31 వరకు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని తోట వెంకయ్య తెలిపారు. దాతలు మరికొంత మంది ముందుకొస్తే ప్రజల ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read