అమరావతి ఉద్యమాన్ని అణచడకోసం జగన్ చేస్తున్న అనేక ప్రయత్నాలు, రోజురోజుకీ నీరుగారి పోతుండటంతో, ఆయన దళిత అస్త్రాన్ని తెరపైకి తెచ్చి ఉద్యమంపైకి వదిలాడని, జగన్నన్న వదిలిన దళితబాణమైన సురేశ్, రాజధాని ఆందోళనకారులపైకి రివ్వున దూసుకొచ్చాడని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని అణచడానికి ఎంపీ సురేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, ఏ ఎంపీ చేయనివిధంగా తన వాహనశ్రేణితో, అనుచరులతో ఆందోళనలు జరిగే ప్రాంతంలో సురేశ్ పదేపదే ఎందుకు కవాతులు చేస్తున్నాడో, ధర్నాలు చేస్తున్న టెంట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. ఉద్యమంలో మహిళల పాత్ర నానాటికీ పెరుగుతుండటంతో పాలుపోని స్థితికి చేరిన ముఖ్యమంత్రి, ఉద్యమాన్ని నీరుగార్చడంకోసం, ఎంపీ సురేశ్ ను దళితబాణంగా మార్చి ప్రయోగించాడన్నారు. సురేశ్ ఎంపీగా ఎన్నికైన తొలినాళ్లలో జగన్ కు అత్యంత సన్నిహితంగా మెదిలేవారని, తరువాత ఎంపీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ఒకటి సీఎం టేబుల్ పైకి చేరిందని, ఆనాటి నుంచీ వారిద్దరికీ మధ్యన అంతరం పెరిగిందన్నారు.

తాజాగా అమరావతి ఉద్యమం ఉధృతమవుతుండటంతో దాన్ని అణచడంకోసం సురేశ్ ను పావుగా వాడుకోవడానికి జగన్ సిద్ధపడ్డాడని, ఆ క్రమంలోనే అమరావతి జేఏసీ మహిళలబస్సుపైకి ఆయన్ని ఉసిగొల్పాడని వర్ల దుయ్యబట్టారు. గతంలో నందిగంలో సురేశ్ పర్యటించాడని, అక్కడ కూడా ఆయనకు గులాబీ పువ్వులచ్చి, అమరావతి ఉద్యమానికి మద్ధతు పలకాలని స్థానికులుకోరితే, వారిపైన ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టాడన్నారు. తాజాగా అమరావతి అమరేశ్వరుడి దర్శనానికి వెళ్లొస్తున్న మహిళలపై, ఎంపీ తన ప్రతాపం చూపాడని, ఆడవాళ్లలనే ఇంగితం లేకుండా పోరంబోకులు.... లం.... డాష్..డాష్..., మగాళ్లు మిమ్మల్ని ఎలా బయటకు రానిస్తున్నారు.. అంటూ చెప్పలేనివిధంగా, అసభ్య పదజాలంతో నీచాతినీచంగా మాట్లాడాడని, చెప్పలేనిభాషలో దుర్భాషలాడారని వర్ల మండిపడ్డారు. దేవుడి దగ్గరకు వెళ్లొస్తూ, దారిపొడవునా జరుగుతున్న అమరావతి ఆందోళనలకు మధ్దతు తెలుపుతూ, వస్తున్న అమరావతి జేఏసీ మహిళాసభ్యలకు, ఎంపీ నందిగం సురేశ్ తారసపడ్డాడని, ఆయన్ని చూడగానే ఎంపీగారు..ఎంపీ గారు అంటూ నలుగురుమహిళలు దగ్గరకెళ్లి, నమస్కారం పెట్టి, అమరావతి ఉద్యమానికి తమరు మద్ధతుతెలపాలని, జై అమరావతి నినాదాలు చేయాలని కోరారని, వారు ఆ మాటన్న వెంటనే, ఎంపీ, ఆయన అనుచరులు, ఆగ్రహావేశాలతో ఊగిపోయారని రామయ్య వివరించారు.

నడిరోడ్డుపై ఉన్నాను...తానొక బాధ్యతగల ఎంపీననే విజ్ఞతకూడా లేకుండా, విచక్షణ కోల్పోయి సదరు మహిళలని నోటొకొచ్చినట్టు దూషిస్తూ ‍నీచాతినీచంగా, అసభ్యంగా, అనరాని మాటలు అనాల్సిన అవసరం సురేశ్ కు ఎందుకొచ్చిందని వర్ల ప్రశ్నించారు. అమరావతి ఉద్యమమన్నా, అందులో పాల్గొంటున్న వారంతా ఎంపీకి ఎందుకంత అక్కసో తెలియడంలేదన్నారు. తన వాహనశ్రేణిలో అనుచరులను ఎక్కించుకొని, ఉద్యమకారులను రెచ్చగొట్టేలా, వారిని తప్పుదారి పట్టించేలా పదేపదే, సురేశ్ అమరావతి ప్రాంతంలో ఎందుకు పర్యటిస్తున్నాడో చెప్పాలన్నారు. పనిమీద వెళ్లినా, తనపని తాను చూసుకొని రాకుండా ఉద్యమకారుల మధ్యలోకి ఎందుకు దూరుతున్నాడో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. జేఏసీ మహిళలు జై అమరావతి నినాదాలు చేయమని కోరడమే తప్పెలా అవుతుందో.. అంతదానికే వారి బస్సుని అడ్డగించి, తన అనుచరులతో దాన్ని చుట్టుముట్టి, బస్సులోని బయటకురాకుండా డ్రమ్ములు అడ్డుపెట్టి, అద్దాలు మూసేసి, కారం చల్లి, ఆడవాళ్లపై అంత అమానుషంగా ఎందుకు ప్రవర్తించారో, ఎవరి మెప్పుకోసం అంత హీనస్థితికి దిగజారారో సురేశ్ సమాధానం చెప్పాలని వర్ల నిలదీశారు.

ప్రాణభయంతో మహిళలు, చిన్నారులు అరుస్తున్నాకూడా లెక్కచేయకుండా వారిపై దూషణలకు దిగి, హింసాకాండకు పాల్పడటం ఎంపీకి తగునా అన్నారు. దళితకార్డుతో తనను అవమానించారని, తన కాలర్ పట్టుకున్నారని, ఎంపీ చెబుతున్నాడని, చుట్టూ పోలీసులను, అనుచరగణాన్ని పెట్టుకున్న వ్యక్తి చొక్కా పట్టుకునే ధైర్యం సాధారణ మహిళలకు ఉంటుందా అని రామయ్య ప్రశ్నించారు. ఎంపీనే తిట్టి, వారిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, అతని అనుచరులు మరింత రెచ్చిపోయారని, ఒక మహిళచుట్టూ చేరి, ఆమెను తాకరానిచోట తాకుతూ, బట్టలు నడుంపట్టుకొని, చేయరాని దుష్కృత్యాలన్నీ చేశారని రామయ్య తెలిపారు. ఎంపీ వెళ్లాక కూడా అతని అనుచరవర్గం మహిళల బస్సుని ముందుకుపోనీయలేదన్నారు. దాదాపు 3 గంటలవరకు దాన్ని అడ్డుకొని, చంబల్ బందిపోటు దొంగలమాదిరిగా ఎంపీ దగ్గరుండే కిరాయిమూకలు క్రూరంగా ప్రవర్తించారన్నారు. ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే, ఆ స్థానాన్ని అవమానించేలా, తన దళితతత్వాన్ని తనే చులకనచేసుకునేలా సురేశ్ ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే, గన్ను కంటే ముందు జగనన్న వస్తాడని చెప్పిన రోజా అక్క, అమరావతి మహిళల విషయంలో జరిగిన దారుణానికి ఏం సమాధానం చెబుతుందని వర్ల ప్రశ్నించారు.

తమను నమ్ముకున్న వాళ్ళకోసం తమకుటుంబం ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తమస్వగ్రామం నిమ్మాడలో దివంగత తెదేపా నేత అతని సోదరుడు కింజరాపు ఎర్రన్నాయుడు 63వ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎర్రన్న ఘాట్ వద్దకు చేరుకున్న అతని కుటుంబ సభ్యులు భార్య విజయకుమారి, తల్లి కళావతమ్మ, కుమారుడు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, సోదరులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కె. హరివరప్రసాద్, ఏసీపీ కె. ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ నారాయణమూర్తి, తదితరులు ఎర్రన్నఘాటకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్.. ఎర్రన్న.. అంటూ జోహార్లర్పించారు. అలాగే మెయిన్ రోడ్ లో ఉన్న ఎర్రన్న విగ్రహానికి సైతం అంతా కలిసి పూలమాలలు వేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే, ఎంపీలు ప్రారంభించారు.

achem 24022020 2

అనంతరం జరిగిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం నాయకులపైన, కార్యకర్తల పైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పేదల పథకాలు నిలిపేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెడతానని ఎర్రన్న జయంతి సభ సాక్షిగా చెప్తున్నట్లు పేర్కొన్నారు. తనపైన ఉద్దేశ్యపూర్వకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను అవినీతికి పాల్పడనని అవసరమైతే ఇతరుల వద్ద డబ్బు అడిగి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీని అన్ని విధాలా ఆదుకోవడంలో తాను ముందుంటానని, ఈ క్రమంలో ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. ప్రజాబలమే తనకు శ్రీరామరక్షని అన్నారు. ఇ ఎస్ ఐ స్కామ్ లో తాను తప్పు చేసా నని నిరూపించాలని, తమది తప్పు చేసే కుటుంబం కాదని, తమ వద్ద తప్పు లేకపోతే ఎవరినైనా అడుగుతామని, అంతే తప్పు చేసే కుటుంబం తమది కాదన్నారు

achem 24022020 3

ఎర్రన్నాయుడు సాక్షిగా తాను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం దిక్కు ఉన్నది చేసుకోవచ్చు నని ఆయన ఘాటుగా విమర్శించారు. తాము నిత్యం ప్రజలు వద్ద ఉంటూ ఎర్రన్న అడుగుజాడల్లో నడుస్తామ న్నారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందన్నారు. ప్రజలందరికీ నిష్పక్షపాత పాలన అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అన్నారు. తన తండ్రి ఎర్రన్న జయంతి సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో వారసత్వ రాజకీయాలు తగ్గిపోతున్న తరుణంలో తమ కుటుంబానికి వారసత్వ రాజకీయ నాయకులుగా ముగ్గురిని అందించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దీనికి ఎర్రన్నాయుడు ఆశీస్సులే కారణమన్నారు. చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా ఉన్న అచ్చెన్నాయుడంటే జగన్మోహన్ రెడ్డికి భయమని, అందుకే అతనిపై కక్షసాధింపు చేస్తున్నారన్నారు. రక్తదానంకు మించిన దానం లేదని, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

వైసీపీ నేతలు కార్మికుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. వాటికి సమాధానం చెప్పాలి. కార్మిక సమాజం వైసీపీ నేతలను చూసి అసహ్యించుకుంటున్నారు. కోటి మంది కార్మికులను వైసీపీ రోడ్డున పడేసింది వాస్తవం కాదా? ఇసుక కొరత సృష్టించి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడేందుకు వైసీపీ కారణం కాదా? చంద్రబాబు గారి పాలనలో ఏరోజూ కార్మికులు రోడ్డు ఎక్కలేదు. నేడు లక్షలాది మంది కార్మికులు రోడ్డెక్కారు. నేడు కార్మికులు తినడానికి తిండి లేక, అనారోగ్యం పాలైతే చికత్స తీసుకోలేక అవస్థలు పడుతున్నారన్న సంగతి వెల్లంపల్లి మర్చిపోయారా? టీడీపీ హయాంలో చంద్రన్న బీమా పథకం తీసుకువస్తే.. నేడు ఆ పథకాన్ని రద్దు చేశారు. కార్మికులకు పెద్దన్నగా చంద్రన్న నిలిచారు. నేడు కార్మికులకు రక్షణ లేకుండా చేసిన ఘనత వైసీపీది. కార్మికులు అనే పదం పలికే అర్హత వైసీపీకి లేదు. అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అన్యా క్యాంటీన్ల మూసివేతపై రేపటి నుంచి మేం ఆందోళనలు చేస్తున్నాం.

రూ.15కే మూడు పూటలా అన్నం పెట్టాం. నేడు కార్మికుల పొట్ట కొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయి. అమరావతిలోనే లక్ష మంది కార్మికులు పనిచేసేవారు. వీరంతా రోడ్డున పడ్డారు. దీనికి బాధ్యులు వైసీపీ కాదా? వెల్లంపల్లి తన నియోజకవర్గంలో పర్యటిస్తే.. కార్మికుల అవస్థలు తెలుస్తాయి. అచ్చెంన్నాయుడు గారు నిబద్ధత గల వ్యక్తి. వెల్లంపల్లి ఇప్పటివరకు ఎన్ని జెండాలు మార్చారో అందరికీ తెలుసు. తన స్థాయి ఏంటో వెల్లంపల్లి తెలుసుకుని మాట్లాడాలి. ఊసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్. అమ్మవారి నవరాత్రుల సందర్భంగా బ్లాక్ లో టికెట్లు, దొంగ టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. పోస్టింగ్ ల కోసం అధికారుల వద్ద డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా? బీసీలకు చెందిన రూ.4వేల కోట్ల నిధులను దారిమళ్లిస్తే అచ్చెంన్నాయుడు గారు అడగటం తప్పా?

ఆదరణ పథకాన్ని రద్దు చేశారని అడగడం తప్పా? అచ్చెంన్నాయుడు గారికి భయపడి ఆయనపై బురద జల్లుతున్నారు. ఈఎస్ఐ విషయంలో విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చెంన్నాయుడు గారి పేరు లేదు. టెలి హెల్త్ సర్వీస్ లో కూడ అచ్చెంన్నాయుడు గారి పేరు లేదు. కొనుగోళ్లకు సంబంధించి ఆయన పాత్ర ఎక్కడా లేదు. 51 జీవోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ మాదిరిగా చేయాలని లేఖ రాశారు. దీనిని పట్టుకుని బురద జల్లుతున్నారు. లేఖలో అధికారులను నిబంధనలు పాటించవద్దని ఎక్కడా చెప్పలేదు. ఆధారాలు లేకుండా వైసీప నేతలు బురద జల్లుతున్నారు. ఇప్పటికైనా వెల్లంపల్లి శ్రీనివాస్ జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సెలెక్ట్ కమిటీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గవర్నర్ చెంతకు చేరడంతో ఆయన తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దీనికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే, అధికార పక్షమైన వైకాపా అభివృద్ధి వికేంద్రీకరణ సీఆర్డీయే చట్టం ఉపసంహరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించుకోగా, మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ చైర్మన్ ప్రకటించి నెలరోజులు కావస్తున్నా ఈ వ్యవహారం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఈ నెలరోజుల సమయంలో మండలి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సెలెక్ట్ కమిటీ వేసేందుకు విపక్ష తెదేపా, అడ్డుకునేందుకు అధికార వైకాపా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. సెలెక్ట్ సమస్య చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే సెలెక్ట్ కమిటీ మనుగడ ఆధారపడి ఉంది. గతంలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం తెదేపా, వైకాపా మధ్య మాటల యుద్ధం జరగ్గా, తరువాత ఉద్యోగుల సమస్యగా మారింది. నిబంధనలకు అనుగుణంగా లేదని అసెంబ్లీ కార్యదర్శి సెలెక్ట్ కమిటీకి సంబంధించిన ఫైల్‌ను రెండు సార్లు తిప్పి పంపడం చైర్మకు ఆగ్రహా న్ని తెప్పించింది.

ఒక సభ స్పీకర్ విచక్షణాధికారాన్ని, ఒక అధికారి ఎలా నియంత్రిస్తారు అంటూ, షరీఫ్ ఆగ్రహానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవ కాశం ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా కలుగచేసుకోవు అని, అలాంటిది ప్రభుత్వం, ఇప్పుడు ఒక ఉద్యోగి చేత సభనే ధిక్కరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. సెలెక్ట్ కమిటీ నియమించాలని సభలో తాము తీసుకున్న నిర్ణయమని చైర్మన్ చె ప్పినా, కార్యదర్శి రెండు సార్లు ఫైల్ వెనక్కు తిప్పి పంపించారు. ఈ అంశంలో ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సెలెక్టు కమిటీ ఏర్పాటు కాకుండా తన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మనీ బిల్లులకు, సాధారణ బిల్లులకు వ్యత్యాసం ఉంటుం దని, ఈ రెండు బిల్లులు మనీ బిల్లులు కావన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి షరీఫ్ తెచ్చారు. మనీ బిల్లులకు వర్తించే నిబంధనలను ఈ బిల్లులకు సాకుగా చూపుతూ మండలి కార్యదర్శి వెనక్కి పంపారని, ఇది పూర్తిగా సభ గౌరవాన్ని మంటగలపటమేనని చెప్పారు.

కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికి రెండుసార్లు తాను ఆదేశాలు ఇచ్చానని, అయితే మండలి కార్యదర్శి వీటిని వెనక్కి తిప్పి పంపారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించని అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మండలి చైర్మన్ కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయేరద్దు బిల్లులపై మండలిలో జరిగిన చర్చ అనంతరం పరిణామాలలో తన విచక్షణాధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపిన విషయాన్ని గవర్నర్‌కు చైర్మన్ షరీఫ్ వివరించారు. మండలి కార్యదర్శితో పాటు మరో అధికారిపై కూడా మండలి ఛైర్మన్, గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. తేదీలతో సహా వీళ్లు చేసిన పనిని, సవివరంగా గవర్నర్‌కు వివరించి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చైర్మనను కోరటం సంచలనంగా మారింది. అయితే ఏకంగా చైర్మన్ వెళ్లి తన నిస్సహాయతను గవర్నర్‌కు చెప్పడం చర్చనీ యాంశంగా మారింది. ఇది అతి పెద్ద రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్ళే అవకాశం ఉందని, చైర్మన్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందిగా గవర్నర్‌ కోరే అవకాశం ఉందని, వార్తలు వ్పాయి. గవర్నర్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వం ఇరకాటం లో పడే అవకాశం ఉంది. ఈ తరుణంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read