రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అమరావతి. మొన్నటి వరకు కార్యాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్, నిమ్మగడ్డ కేసులు ప్రతి రోజు కోర్టుల్లో నాని, ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించాయి. అయితే ప్రభుత్వం మాత్రం, తాను అనుకున్నది చెయ్యాలి అనే పట్టుదలతో, కోర్టుల ముందు మాత్రం, ఇబ్బందులు పడింది. అన్ని విషయాల్లో ఇటు హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అమరావతి అంశం తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని కోసం, రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు ప్రభుత్వం ఆమోదించుకుంది. అయితే ఈ రెండు బిల్లులు చెల్లవు అంటూ, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, మరి కొన్ని సంఘాలు కలిసి, హైకోర్టులో పిటీషన్ వేసి, బిల్లులను నిలుపుదల చెయ్యాలని, హైకోర్టుని కోరాయి.

దీని పై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చెయ్యమని, ఎన్ని రోజులు కావాలని అడగటం, దానికి ప్రభుత్వ తరుపు న్యాయవాది పది రోజులు కావాలి అని చెప్పటంతో, హైకోర్టు అందుకు అంగీకరిస్తూ, అప్పటి వరకు స్టేటస్ కో విధించింది. అయితే ఇప్పుడు హైకోర్టు నిర్ణయం పై, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాలు నిలిపివేయాలని సుప్రీంని కోరింది. హైకోర్టు ఎక్స్‌పార్టీగా పేర్కొంటూ, ప్రాధమిక కారణాలు తెలియకుండా, హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అని ప్రభుత్వం పిటీషన్ లో తెలిపింది. అయితే, ప్రభుత్వానికి కోర్టుకు వెళ్ళే హక్కు ఉన్నా, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ హైకోర్టు కేవలం ప్రభుత్వానికి కౌంటర్ వెయ్యటం కోసమని, పది రోజులు గడువు ఇస్తూ, స్టేటస్ కో విధించింది కానీ, స్టే ఇవ్వలేదు. ఒక వేళ ప్రభుత్వం, మేము 2-3 రోజుల్లో కౌంటర్ ఇస్తాం అంటే కోర్టు ఏమి చెప్పేదో. పది రోజులు కూడా ఆగకుండా, ఇంత హడావిడిగా ప్రభుత్వం సుప్రీంకు ఎందుకు వెళ్లిందో అర్ధం కావటం లేదు. మరి ప్రభుత్వ ఆలోచన ఏమిటో, రేపు సుప్రీం కోర్టు ఏమి చెప్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఏ నాడు తన కులం గురించి ప్రస్తావన తేలేదు. ఆయన ప్రజల ముందుకు కానీ, మీడియా ముందుకు కానీ వచ్చే సమయంలో కూడా, తన కులం వారిని దూరం పెట్టి, వేరే కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చే వారు. ఎంతో మంది ప్రత్యర్ధులు, చంద్రబాబుతో రాజకీయం చేసినా, ఏ నాడు చంద్రబాబుని కులం పేరుతొ టార్గెట్ చెయ్యలేదు. చివరకు అందరి కంటే బద్ధ శత్రువు అయిన రాజశేఖర్ రెడ్డి కూడా, ఎప్పుడూ కుల రాజకీయం చెయ్యలేదు. దీన్ని బట్టే, చంద్రబాబు సామాజిక న్యాయం పాటించారో, తన కులానికి ప్రాధాన్యత ఇచ్చే వారో అర్ధం అవుతుంది. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి, చంద్రబాబుని, కులంతో కలిపి టార్గెట్ చేసారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో, అది పతాక స్థాయికి చేరింది. అమరావతిలో 75 శాతం మంది బడుగు బలహీనవర్గాల వారు ఉంటే, కమ్మ వారి కంటే, రెడ్డి వారి జనాభానే అమరావతిలో ఎక్కువ. అయినా చంద్రబాబు కులం కోసం అమరావతిని తెచ్చారు అంటూ ఆరోపణలు చేసారు.

ఇప్పటికీ అవే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో, ఎప్పుడూ కులం గురించి మాట్లాడని చంద్రబాబు, మొదటి సారి విసుగు చెంది, కుల ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు ఈ రోజు అమరావతి విషయం పై మీడియా సమావేశం పెట్టారు "నా స్వార్థం కోసం ఏం చేయలేదు. నా బంధువులు, నాకులం వారు ఆనాడు హైదరాబాద్ లో లేరు. ఆరోజు అభివృద్ధి చేశాను కాబట్టి ఓ తృప్తి ఉంది. అమరావతి నిర్మాణాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాను. భావితరాల భవిష్యత్తుకు వీచికగా భావించాను. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలి. రాజకీయంగా నన్ను ఎదుర్కొ లేక కుల ముద్ర వేశారు. అమరావతి నా కోసమో, నా కుటుంబం కోసమో, నా కులం కోసమో కాదు. నాకు కులం లేదు. మొట్టమొదటి సారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు కులం అంటగట్టారు. నాకు కులం అంటదు. సామాజిక న్యాయం కోసం ఎప్పుడూ పోరాడుతా. పాటు పడతా. అవసరమైతే ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. "

"హైదరాబాద్ నిర్మాణ సమయంలో కనిపించని కులం అమరావతిలోనే ఎందుకు కనిపించింది. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కుల ముద్ర వేశారు. కులం అన్నారు. నా కులం ఉందని కుప్పంలో 35 ఏళ్లుగా గెలుస్తున్నానా...? అమరావతిలో ఒకే కులం ఉందా.? నేను 35 ఏళ్లుగా కుప్పంలో గెలుస్తున్నా. అక్కడ ఏ కులం ఉంది.? కులం గురించి మాట్లాడే వారి నోటికి హద్దులేదా.? ఇష్టానుసారంగా మాట్లాడుతారా.? ఎప్పుడూ లేని విషయాల గురించి మాట్లాడడం సరికాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. నేను చిన్నప్పటి నుండి కులాలకు అతీతంగా పని చేశాను. అమరావతిలో ఒక కులం అంటున్నవారికి చెబుతున్నా. ఆ చుట్టుపక్కలున్న నియోజకవర్గాలన్నీ ఎస్సీ నియోజకవర్గాలేనని తెలియదా.? బీసీలు, ముస్లింలు అధిక ప్రాంతానికి కుల ప్రస్థావన తీసుకురావడం దుర్మార్గం. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు.. పాలన చేతకాక కులం పేరుతో నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి అన్నారు. ఏం సాధించారు.? ఏం నిరూపించగలిగారు.? ఎదురు దాడి మానుకుని.. వాస్తవాలను గమనించి అమరావతిని కొనసాగించండి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. భావితరాల భవిష్యత్తును అంధకారం చేయొద్దని విన్నవిస్తున్నా. " అని చంద్రబాబు అన్నారు....

నిన్న కడప జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన, టిడిపి మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్ తగిలింది. ఆయన పై ఈ రోజు మరో మూడు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కడప జైలు నుంచి దాదపుగా 50 రోజులు తరువాత, జేసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి విడుదల అయ్యారు. అయితే నిన్న కడప సెంట్రల్ జైలు నుంచి, తన అనుచరులతో అనంతపురం వెళ్ళారు. ఈ సమయంలో, వారు, వారితో పాటు ఉన్న మరి కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే అక్కడతో అయిపోలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి సిఐ పై, దురుసుగా ప్రవర్తించారని, మరో కేసు కూడా పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు జేసి ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు, తమకు ఇచ్చిన కండీషనల్ బెయిల్ లో భాగంగా, ఈ రోజు ఉదయం అనంతపురంలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంతకాలు చేసేందుకు వచ్చారు.

అయితే సంతలకు పూర్తి అయినా కూడా, ఇంకా వారిని విడుదుల చెయ్యకపోవటం, మరో పక్క తాడిపత్రి పట్టణంలో పోలీస్ బలగాలు పెంచటంతో పాటుగా, వజ్ర వాహనం కూడా రావటంతో, మళ్ళీ జేసి అరెస్ట్ తప్పదని, అందులో భాగంగానే, పోలీసులు ఈ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో మరో సారి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, జేసి అనుచరులు, స్టేషన్ కు చేరుకుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని, కోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత, మరో కేసు పెట్టటం ఏమిటి, కావాలనే ఇలా కేసులు పెడుతున్నారు అంటూ, తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మరి జేసిని ఈ కేసులో అరెస్ట్ చూపిస్తారా ? లేక విచారణ చేసి వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి, జేసి కుటుంబానికి మాత్రం కష్టాలు తప్పటం లేదు. రాజకీయంగా ఎంత వరుకు అయినా రెడీ అని, పార్టీ మారే పరిస్థితి లేదని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ, 2018లో పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. దీని పై విచారణ జరిపిన హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా కోరింది. దీని ప్రకారం, కేంద్ర హోం శాఖ, నిన్న హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో విభజన హామీల్లో ఇచ్చిన అన్ని అంశాల పై, ఏమి చేసింది, కేంద్రం తెలిపింది. అయితే ఇందులో మూడు రాజధానుల విషయం ప్రస్తావించటంతో పాటుగా, రాజధాని అనేది కేంద్ర పరిధిలోని అంశం కాదు అని కేంద్రం చెప్పటం, ఒకింత చర్చకు దారి తీసింది. అమరావతికి ఇన్ని కోట్లు ఇచ్చాం అంటే అయిపోయే దానికి, అమరావతి గత ప్రభుత్వం ఆమోదించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుంది, మాకు రాజధాని విషయంలో సంబంధం లేదు అని కేంద్రం అఫిడవిట్ లో తెలిపింది. అయితే ఇది కేంద్రం కావాలనే పెట్టిందా అనే అభిప్రాయం వస్తుంది.

ఇక ప్రత్యేక హోదా పై 14వ ఆర్ధిక సంఘం సిఫారుసు మేరకు ఇవ్వటం కుదరదని చెప్పింది. ఆర్ధిక సంఘం సూచించిన విధంగా రెవిన్యూ లోటు పుడ్చామని, చెప్పింది. అలాగే 2015-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, 90 శాతం కేంద్రం భరిస్తుందని, విదేశీ సాయంలో ఋణం, వడ్డీ కేంద్రమే కడుతుందని చెప్పింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ కు అయ్యే ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం అని చెప్పమని, అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు రూ.8,614.16 కోట్లు ఇచ్చామని చెప్పింది. ఇక అలాగే మిగతా అంశాలు పై కూడా, కేంద్రం ఏమి చేసింది, ఆ అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. మొత్తానికి, విభజన చట్టం అమలు పరుస్తున్నామని, కొన్ని ఇప్పటికే ఇచ్చేసామని చెప్తూ, కీలకమైన ప్రత్యెక హోదా ఇవ్వలేమని, అలాగే రాజధాని విషయం మాకు సంబంధం లేదని కేంద్రం చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read