నిన్న జరగాల్సిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ను అనుసరించి జగన్ మోహన్ రెడ్డి, మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలు దేరాల్సి ఉంది. ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ చేరుకుని మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో, సాయం త్రం 4.45 గంటలకు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో, రాత్రి 10గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలకాంశలను ఆయన కేంద్ర మంత్రులతోను, కీలకంగా అమిత్ షాతోను చర్చించాల్సి ఉందని, మీడియాకు చెప్పారు. జలవనరుల వ్యవహరాలతో సహా, శాసనమండలి రద్దు, ఎస్ఈసీ వ్యవహరం, కరోనా కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల గురించి జగన్ అమిత్ షాతో మాట్లాడతారనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకాంశాలు, ప్రత్యేకహోదా తదితరంశాల పై జగన్ ఢిల్లీలో అడుగుతారని లీకులు ఇచ్చారు.

అయితే కొవిడ లాక్ డౌన్ సడలింవుల వరిణామాల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా తీరికలేని పరిస్థితుల్లో ఉండటంతో, ఆయనతో చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు అవ్వటంతో, జగన్ తన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం. నిసర్గ తుఫాను కారణంగా ఏర్పడనున్న పరిస్థితుల పై కూడా, ఆయా రాష్ట్రా ల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమీక్షించే పరిస్థితులు ఏర్పడిన కారణంగా జగన్ తో భేటీని కేంద్ర హోంశాఖ తుఫాను తరువాతకు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా పడటంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మరో ప్రచారం కూడా ఇందులో ఉంది. రాష్ట్రానికి చెందిన కొంత మంది బీజేపీ నేతలు, ఢిల్లీ పెద్దలకు ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ ఒక లేఖ రూపంలో నివేదించినట్టు సమాచారం.

ఇక్కడ జగన్ చేసే పనుల పై ప్రజల్లో పోరాటం అలాగే, న్యాయ పోరాటం కూడా చేస్తున్నామని, సుప్రీం కోర్ట్ లో, ఈ ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో, హోం మంత్రి, జగన్ ని కలిస్తే, తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇవన్నీ తేలే దాకా, భేటీ వాయిదా వేసుకోమని రాష్ట్ర బీజేపీ నేతలు, కోరిన తరువాతే, ఈ భేటీ రద్దు అయ్యింది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గవర్నర్ వెంటనే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపటంతో, ఎలక్షన్ కమీషనర్ వ్యవహారం పై, బీజేపీ పై కూడా విమర్శలు వస్తున్న తరుణంలో, సుప్రీంలో ఈ కేసు చేరిన సమయంలో, కేంద్ర హోం శాఖ మంత్రితో, జగన్ భేటీ అయితే, రాష్ట్రంలో బీజేపీకి నష్టం అని, కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించటంతో, రాష్ట్ర బీజేపీ సఫలం అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.

వైసీపీ పాలన పై, ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, పధకాల అమలు, అధికారుల పై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వేదికల పై, పబ్లిక్ ఫోరమ్స్ లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎంపీ రఘురామ రాజు ఉన్నారు. మొన్న ఇళ్ళ స్థలాల విషయం పై, లంచాలు అడుగుతున్న విషయాలను ఆయనే స్వయంగా చెప్పారు. తమది మచ్చలేని స్వచ్చమైన పాలన అని, అక్రమాలు లేని పాలన అని ప్రభుత్వ పెద్దలు చెప్తుంటే, సొంత పార్టీ నేతలే, బహిరంగ వేదికల్లో ఎండగడుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారింది. తాజాగా గుంటూరు జెడ్పీ సమావేశంలో, గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సొంత ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే, ఇసుక మాఫియా రాష్ట్రంలో చెలరేగిపోతుంది అనే వాదనకు బలం చేకుర్చినట్టు అయ్యింది.

ఆయన జెడ్పీ సమావేశంలో, ఇసుక పాలసీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్క పల్లెటూరులో కూడా కనీసం దోసెడు ఇసుక ఇవ్వలేక పోతున్నామని, కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ సమావేశంలోనే, ఈ విషయాన్ని బయట పెట్టారు. నాడు నేడు కార్యక్రమానికి, కూడా తట్టెడు ఇసుక సప్లై చెయ్యలేక పోయామని, చెప్పేది ఒకటి, వాస్తవంలోకి వచ్చే సరికి, జరుగుతున్నడి ఒకటి అని అధికార పార్టీ ఎమ్మెల్యేనే, తమ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. రీచ్ నుంచి వస్తున్న ఇసుక లారీలు, రీచ్ నుంచి బయలుదేరి, అడిగిన ప్రదేశానికి రాకుండా, మధ్యలోనే మాయం అవుతున్నాయని, ఎవరికీ చెప్పలేక పోతున్నాం అంటూ, తమ పరిస్థితిని స్వయంగా అధికార పార్టీనే ఆవేదన వ్యక్తం చేసారు అంటే, ప్రభుత్వం ఇరుకున పడింది అనే చెప్పాలి. ప్రతిపక్ష నేతల దాడినే తట్టుకోలేక పోతుంటే, ఇప్పుడు అధికార పార్టీలో సొంత నేతలు కూడా, ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నారు. మరి ప్రభుత్వం, ఈ సమస్య పై దృష్టి పెట్టి కరెక్ట్ చేసుకుంటుందో లేక, ఇది చంద్రబాబు కుట్ర, అదే సామాజిక వర్గం, పచ్చ మాఫియా అంటూ, ఎదురు దాడి చేస్తుందో చూడాలి.

మీడియా గొంతు నొక్కుతూ, నిరాధార కధనాల పేరుతో, కేసులు పెట్టే అవకాసంతో ఇచ్చిన జీవో 2430 పై, నిన్న ప్రభుత్వం హడావిడిగా ప్రకటన విడుదల చేసింది. ఈ జీవో పై గతంలో హైకోర్ట్ లో కొంత మంది కేసు వేసారు, అయితే తదుపరి విచారణలకు సదరు పార్టీ రాకపోవటంతో, హైకోర్ట్ ఈ కేసులో ప్రభుత్వ తరుపు వాదన మాత్రమే పరిగణలోకి తీసుకుని, కొన్ని సలహాలు ఇస్తూ, కేసును డిస్పోజ్ చేసింది. అయితే మూడు నెలల క్రిందట హైకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాల పై, తమకు అంకులమైనవి తీసుకుంటూ, ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు నెలల క్రిందట ఆదేశాలు ఇచ్చినా, హైకోర్ట్ ప్రతి నిన్న అందింది అని, అందుకే నిన్న ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది. జీవతో 2430ని హైకోర్ట్ పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వం జీవో ద్వారా అసత్యమైన, నిరాధారమైన వార్త కథనాలపై ఆయా ప్రభుత్వ శాఖలకు చట్టప్రకారం రీజాయిండర్లు విడుదల చేసేందుకు, అవసరమైతే కేసులు నమోదు చేయడానికి హైకోర్ట్ అవకాశం కల్పించింది అంటూ ఆ ప్రకటనలో తెలిపారు.

జీవో నెంబరు 2430 ప్రకారం వార్తా కథనాలు, ప్రసారాల పై ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా ఆయా న్యాయస్థానాలు, వాటి పరిధికి లోబడి తగు విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి హైకోర్టు స్వేచ్ఛను కల్పించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ జీవో 2430 కేవలం క్రిమినల్ చర్యలకు ఉద్దేశించింది కాదని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి కోర్టుకు తన ప్రమాణపత్రంలో వివరించారు. దీనిద్వారా సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడం, పత్రికా ప్రసారం, ప్రచురణ, పంపిణీ స్వేచ్చలకు భంగం కలిగించే ఉద్దేశం లేదని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. నైతిక విలువలతో కూడిన బాధ్యతాయుతమైన వార్తా కథనాల ప్రచురణ కోసమే ఈ జీవో ఉద్దేశించబడిందని కోర్టుకు వివరించారు. ప్రెస్ కౌన్సిల్ నిబంధనల మేరకు వార్తలను ప్రచురించడం సముచితమని హైకోర్ట్ అభిప్రాయ పడింది. అయితే ప్రభుత్వం, తమకు కావలసిందే చెప్పుకుంది అని, కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చాలా విషయాలు ఉన్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి.

ఎన్నో ఏళ్లుగా తన పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇటీవల చీకటి జీవోలను తీసుకువచ్చి దొడ్డిదారిన చైర్మను నియమించారని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ మాజీ చైర్మన్ పూసపాటి అశోకగజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలోని తన బంగ్లాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా నడుస్తున్న విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి, ఆస్తులను కబ్బా చేసేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమన్నారు. మాన్సాస్ ట్రస్టు కింద దేశవ్యాప్తంగా 105 ఆలయాలు ఉండగా ప్రస్తుత చైర్మన్ సంచితా తన తండ్రి ఆనంద గజపతిరాజుతో విడిపోయిన 21 ఏళ్లలో ఏ ఒక్క ఆలయం తరుపున పండుగలకు హాజరుకాలేదన్నారు.

తండ్రి బతికి ఉన్నంత వరకూ చూడటానికి రాని వ్యక్తి చనిపోయిన తరువాత వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిన సంచిత ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకుని మాన్సాస్ చైర్మన్ ఎలా అయ్యారో ఆమె విజ్ఞతకే విడిచిపెట్టామన్నారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి కోర్టుకు వెళ్లామని, తమకు ఫేవర్‌గా తీర్పు వచ్చి మళ్లీ తానే మాన్సాస్ చైర్మన్ అవ్వొచ్చునని చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని ప్రతిపక్ష నాయకులు, చైర్మనను కోరుతున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వాడే పదజాలం సోషల్ మీడియాలో విన్నానని, అసహ్యంగా ఉన్న ఆ పదజాలాన్ని తాము మాట్లాడలే మన్నారు. కార్యక్రమంలో టీడీపీ విజయనగరం ఇన్ చార్జి పూసపాటి అదితీ గజపతిరాజు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read