Source : https://epaper.prabhanews.com/c/50557839 కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులు పూర్తిగా పడిపోయింది అంటూ, ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్షన్లు రెండు విడతలుగా చెల్లింపు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏప్రిల్ 1న బ్యాంకులు సెలవు, రెండో తేదీన శ్రీరామనవమి సెలవు కావడంతో ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానట్లు చెబుతున్నారు. అయితే కోత విధించిన జీతాల చెల్లింపుపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి అంటూ చెప్పిన నేపథ్యంలో అన్ని రకాల బిల్లులను మార్చి 21వ తేదీనే పొందుపరచడం, కేటాయించడం జరిగిపోయాయి. ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సంబంధించి సీఎస్ఎంఎస్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి బ్యాంకులకు అనుసంధానం చేయడమే తరువాయి. అయితే మరో కొన్ని గంటల్లో జీతాల చెల్లింపు జరిగే చివరి సమయంలో ప్రభుత్వం, జీతాల్లో కోత పెడుతూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.

ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన గతంలో లేకపోవడంతో, ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్ధిక శాఖాధికారులు సతమతమవుతున్నట్లు తెలియవస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం జీతాలు చెల్లించాలంటే కోతకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి తిరిగి బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో తిరిగి పొందు పరచాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవరించిన బిల్లులు పెట్టాలంటే జీతాలు చెల్లించడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి, కాగా మార్చి నెలకు సంబంధించి 21 వరకే బిల్లులు పొందుపరచడం జరిగింది. తిరిగి బిల్లులు పెట్టాలంటే నెలాఖరు వరకు బిల్లులు పెట్టే అవకాశం ఉంది.

ఈ తరుణంలో అన్ని శాఖలు పూర్తి స్థాయిలో బిల్లులు రూపొందించనున్నాయి. దీంతో బడ్జెట్ అనుకున్న దాని కన్నా కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే నూతనంగా బిల్లులు పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన విధంగా జీతభత్యాలు చెల్లించే మార్గాలను ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది. ఇదిలా ఉండగా మార్చి నెల జీతాలకు సంబంధించి 21కే ప్రక్రియను పూర్తి చేసినందున సాంకేతికతంగా పూర్తి జీతభత్యాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వ ప్రకటన ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని చెబుతున్నారు. మార్చి నెలకు సంబంధించి ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ కలిపి సుమారు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదా పద్దతిలో చెల్లింపు కారణంగా సుమారు రూ. 2 వేల కోట్లు ప్రభుత్వం వద్ద నిల్వ ఉండనుంది. మొత్తం మీద ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయం ఉద్యోగులను కొంత ఆందోళనకు గురి చేసింది.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 39 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 149 కు చేరింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 149కు చేరింది. అనంతపురంలో 2 పోజిటివ్ వచ్చాయి. అలాగే, చిత్తూరులో 9 పోజిటివ్ వచ్చాయి. తూర్పు గోదావరిలో 9 పోజిటివ్ వచ్చాయి. గుంటూరులో 20 పోజిటివ్ వచ్చాయి. కడపలో 18 పోజిటివ్ వచ్చాయి. కృష్ణాలో 23 పోజిటివ్ వచ్చాయి. కర్నూల్ లో 1 పోజిటివ్ వచ్చాయి. నెల్లూరులో 24 పోజిటివ్ వచ్చాయి. ప్రకాశంలో 17 పోజిటివ్ వచ్చాయి. విశాఖలో 11 పోజిటివ్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో 15 పోజిటివ్ వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళంలో, ఎలాంటి పోజిటివ్ కేసులు ఇప్పటి వరకు రాలేదు. మరో పక్క, ఆరు గంటలకు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం, 409 కేసులకు సంబంధించి, ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇందులో, అత్యధికంగా, 211 టెస్ట్ లు, నెల్లూరు జిల్లాకు సంబంధించినవిగా ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా తీవ్రత, నిర్థరణ పరీక్షలు పెంచడం, పాజిటివ్ కేసులు గుర్తించటం, కరోనా చికిత్స చర్యలు, అన్న క్యాంటీన్ల తెరవటం వంటి ఐదు అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు... సీఎం జగన్​కు లేఖ రాశారు. కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచాన్ని అతలాకుతం చేస్తోందన్న చంద్రబాబు... రాష్ట్రంలో కొవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విస్తరిస్తోన్న వేళ నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయాలని సీఎం జగన్​ను కోరారు. సమస్యను అంత తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం కన్నా కరోనా పెనుసంక్షోభమని ఐరాస పేర్కొందని చంద్రబాబు అన్నారు. కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాలు, దేశాలు చేపట్టిన చర్యలను నిశితంగా అధ్యయనం చేయాలన్నారు.

రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్​లు పెంచాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు 1,307 పరీక్షలు మాత్రమే చేశారన్నారు. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అంతగా కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పేదలు పస్తులుండకుండా 'అన్న క్యాంటీన్లు' తెరిచి ఆదుకోవాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు అందజేయాలన్న చంద్రబాబు... ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాల్లో కోత పెట్టవద్దని కోరారు. పింఛన్లలో కోత పెట్టడం సరికాదని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనేక రాష్ట్రాలు, దేశాలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే.. రాష్ట్రంలో వేతనాల్లో కోత పెట్టడం బాధాకరమన్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, లాక్ డౌన్ కు పటిష్టంగా సహకరిస్తూ కరోనా పాజిటివ్ లకు దూరంగా ఉంటూ ఊపిరి పీల్చుకుంటున్న కడప జిల్లా ఒక్క సారిగా ఉలికిపడింది. మాములు ఉలికి పాటు కాదు జిల్లా మొత్తాన్ని గడగడలాడించే ఉలికిపాటు ఇది. కరోనా మహమ్మారి కడప గడప తొక్కకుండా తరిమికొట్టేస్థాయిలో పోరు సాగిస్తున్న జిల్లాలో ఒక్కసారిగా 15 మందికి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఈ భయానక పరిస్థితికి దారితీసింది. దీంతో జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీరు రెండువారాల్లో ఎవరెవరిని కలిశారో, ఎందరికి కలిశారో , ఎక్కడ తిరిగారోనన్న ఆందోళన జిల్లాను వణికిస్తోంది. ఇంత వరకు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాకుండా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్న జిల్లా ఒకేసారి విజృంభించిన కరోనా దాటికి గడగడలాడుతోంది. ఢిల్లీ కి వెళ్ళి వచ్చిన వారిని పోలీసులు రెండు మూడు రోజులుగా గుర్తించి క్వారంటైన్ లో పరీక్షలు చేయించడంతో ఒకేసారి వీరిలో 15 మందికి కరోనా పాజిటిన్లు వచ్చాయి.

వీరిలో బద్వేలు, పులివెందుల, వేంపల్లిలో ఒక్కోక్కరికి పాజిటివ్ లు నమోదు కాగా కడపలో 5మందికి, ప్రొద్దుటూరులో 7 మందికి పాజిటివ్ లు రావడంతో రెండు పట్టణాల్లో ప్రజలు గగుర్పాటుకు గురవుతున్నారు. ఒకేరోజు 15 మందికి రావడంతో ఇంకెంతమందికి పాజిటివ్ వస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. వీరు ఎందరిని కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో నన్న ఆందోళన కడప, బద్వేలు, పులివెందుల, వేంపల్లి, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళకు గురిచేస్తోంది. కడప నగరంలోని యర్రముక్కపల్లి, టూటౌన్, అలంఖాన్ పల్లి తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న వారు బయట పడటంతో నగరం మొత్తం ఆందోళనకు గురవుతోంది. ఇంత వరకు 30 మందికి పైగా క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం.

ఇక మరో పక్క, గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్ నుంచి అధికారులు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. మంగళగిరిలో ఉదయం నుంచే తెరిచి ఉన్న నిత్యావసర, కూరగాయల దుకాణాలను మూయించారు. 144 సెక్షన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణం మొత్తం హైపో ద్రావకం చల్లుతున్నారు. పోలీసులు మైక్​లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మంగళగిరి రెడ్​జోన్​లో ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం తురకపాలెం రెడ్​జోన్​గా ప్రకటించారు. గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్​ అని తేలడంపై.. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు మెగా బ్యాంకుల విలీనం ఆచరణలోకి వచ్చింది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా అవత రించాయి. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాయి. విలీనమైన చిన్న బ్యాంకుల ఖాతాదారులను పెద్ద బ్యాంకుల ఖాతాదారులుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచులుగా కార్యకలాపాలను ప్రారంభించాయని బుధవారం ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం ఏప్రిల్ 1 నుంచి ఆచరణలోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్ గా అవతరించిందని వివరించింది. ఈ విలీనంతో అంతర్జాతీయంగా పోటీ ఇవ్వగల తర్వాతి తరం బ్యాంక్ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్లతో సహా ఖాతాదారులందరూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు గానే పరిగణింపబడతారని స్పష్టం చేసింది.

విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచులు 11 వేలు కాగా ఏటీఏంలు 13 వేలకుపైగానే ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 1 లక్ష, బిజినెస్ మిక్స్ రూ.18 లక్షల కోట్లని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివరించింది. ఆ విలీనంతో ఎక్కువమంది ఖాతాదారులకు, సమర్థవంతమైన సేవలు అందించవచ్చునని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఎస్ఎస్ మల్లికార్జున రావు పేర్కొన్నారు. ఇదిలావుండగా బ్యాంకుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.68,855 కోట్లను ఆయా బ్యాంకులకు మూలధనంగా అందజేసింది. ఈ విలీనంతో 2017లో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 కాగా 2020లో 12కి తగాయి. ఈ 12లో 6 విలీనమైన బ్యాంకులు కాగా మరో 6 స్వతంత్ర బ్యాంకులుగా పనిచేస్తున్నాయి.

ఆంధ్రాబ్యాంక్ కనుమరుగు... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమవ్వడంతో ఆంధ్రాబ్యాంక్ కనుమరుగైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి విలీనం ఆచరణలోకి రావడంతో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు వినియోగదారులను కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదా రులుగా వ్యవహరించనున్నారు. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. బ్యాంక్ వ్యాపారం ర.11.59 లక్షల కోట్లకు పెరిగింది. బ్రాంచుల సంఖ్య 9,609కి పెరిగింది. అయితే ఈ పరిణామంతో, ఆంధ్రా ప్రేమికులు, ఒకింత అసహనంగా ఉన్నారు. ఆంధ్రా అనే పదం లేకుండా చెయ్యటం పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసింది ఆంధ్ర బ్యాంక్. తొలి సారి, క్రెడిట్ కార్డులు జరీ చేసిన బ్యాంక్ కూడా ఆంధ్రా బ్యాంకే.

Advertisements

Latest Articles

Most Read