కరోనాపై పోరులో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్-19 కట్టడి, గడచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య పెరిగినందుకు గల కారణాలను సీఎం జగన్ వివరించారు. ప్రధాని మోదీతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను, గడచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను ప్రధానికి వివరించారు. కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని పేర్కొన్నారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను చర్చించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా, క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని ప్రధానికి, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధాని మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో టెస్టులు నిర్వహించడం సహా బాధితుల్ని గుర్తించడం, ఐసోలేషన్​, క్వారంటైన్​పైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.

9 రోజులుగా దేశంలో లాక్​డౌన్​ కొనసాగుతున్నప్పటికీ, కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపైనా ఆరా తీశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రాలన్నీ ఏకమై పోరాడటం ప్రశంసనీయమన్నారు మోదీ. లాక్​డౌన్​ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎంలతో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్నారు. కొవిడ్​-19 బాధితుల కోసం, ప్రత్యేకంగా ఆసుపత్రుల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కోరారు ప్రధాని. అత్యవసర వైద్య ఉత్పత్తి పరికరాల సరఫరా, ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల లభ్యతకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. చివరగా కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

సంక్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారని మోదీని కొనియాడారు ముఖ్యమంత్రులు. దిల్లీ మర్కజ్​ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇంకా ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను మోదీకి వివరించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, అమిత్​ షా కూడా ఈ దూరదృశ్య సమీక్షలో పాల్గొన్నారు. కరోనా సంక్షోభంపై రెండు వారాల వ్యవధిలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి. మార్చి 20న తొలిసారి సీఎంలతో సమావేశమైన మోదీ, 24న దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఏప్రిల్ 14 తో, లాక్ డౌన్ ముగుస్తు ఉండటంతో, ఆ తరువాత, ఒకేసారి కాకుండా, విడతల వారీగా లాక్ డౌన్ ఎత్తి వేసే అవకాశం ఉందని, ప్రధాని చెప్పినట్టు తెలుస్తుంది. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా ఇదే విషయంతో ట్వీట్ చేసారు. లాక్ డౌన్ తరువాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని కోరారని ఆయన ట్వీట్ చేసారు.

ఒక పక్క కరోనా రాష్ట్రంలో, గత రెండు రోజులుగా విలయతాండవం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, అమరావతి మీద నుంచి ఫోకస్ తప్పించటం లేదు. రాజధాని పరధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూములు లేనందున రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాల్సిందిగా ఆ 2 జిల్లాల కలెక్టర్లు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాల్సిందిగా పురపాలక శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఆదేశాలు జారీచేశారు. సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని సీఆర్​డీఏకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.

సీఆర్​డీఏలోని భూకేటాయింపుల నిబంధనల్లో సడలించాలని సూచించింది. 2017లో జారీ చేసిన అమరావతి భూకేటాయింపుల నిబంధనల్లో భాగంగా 6.5.1 ప్రకారం రెవెన్యూ విభాగాన్ని ఓ దరఖాస్తుదారుగా పరిగణించాలంటూ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పేదలకు ఇళ్లస్థలాల కేటాయించేందుకే రెవెన్యూ శాఖ ఈ పథకాన్ని చేపట్టిందని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి సీఆర్డీఏలోని భూకేటాయింపుల నిబంధనల్లో సడలింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. మాస్టర్ ప్లాన్​లోనూ నిబంధనల ప్రకారం అవరమైన సవరణలు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ చర్యలన్నీ సుప్రీం కోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల్లో పేదల ఇళ్ల కోసం 1251.51 ఎకరాలను, గతంలో ప్రభుత్వం సిద్దం చేసింది. వేరే ప్రాంతంలోని వారికి, ఇక్కడ భూములు కేటాయించాలని, ప్రభుత్వం అనుకుంది. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని వారికి, అమరావతి పరిధిలో భూములు ఇవ్వాలని అనుకున్నారు. అయితే, దీని పై రాజధాని రైతులు హైకోర్ట్ కు వెళ్లారు. దీని పై విచారణ చేసిన హైకోర్ట్, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అమరావతి నిర్మాణం ఏమి జరగకుండా, ఏమి చెయ్యకుండా ఇక్కడ రైతులు ఇచ్చిన భూమి, ఎలా పంచుతారు అంటూ, ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. ప్రభుత్వం అమరావతిలో పంచాలి అనుకునున్న, జీవోని రద్దు చేస్తూ, హైకోర్ట్, గత నెలలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్న 24 గంటల్లోనే, కొత్తగా 67 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి వరకు 111 కేసులు ఉనంట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు, ఈ రోజు తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో, 21 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 132 కు చేరింది. నిన్న రాత్రి పది గంటల నుంచి, ఈ రోజు ఉదయం పది గంటల వరకు, మొత్తంగా 21 కేసులు పోజిటివ్ గా తేలాయి. మొత్తంగా ఇప్పటి వరకు, 1800 టెస్ట్ లు చేసారు. 132 పోజిటివ్ రాగా, 1175 నెగెటివ్ వచ్చాయి. ఇంకా 493 రిజల్ట్స్ రావాల్సి ఉంది. ముఖ్యంగా, ఢిల్లీలోని ఒక సభకు వెళ్లి వచ్చిన వారు, ఎక్కువగా ఈ కరోనా పోజిటివ్ బారిన పడుతున్నారు. వారు వారి సన్నిహితులు, బంధవులలో కూడా, ఈ లక్ష్యనాలు కనిపిస్తున్నాయి. వీరి వల్లే, ఇన్ని కేసులు వచ్చాయని, నిన్న జగన్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. వారి అందరినీ ప్రభుత్వం ముందుకు వచ్చి, టెస్ట్ లు చేసుకోవాలని, జగన్ కోరిన విషయం కూడా తెలిసిందే.

ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో, ఒక్కో జిల్లాల్లో, 20 కేసులతో, అత్యధికంగా కరోనా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో బుధవారం రాత్రి 10 నుంచి గురువారం ఉదయం 10 వరకు 21 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 1800 మందికి పరీక్షలు నిర్వహించగా, 132 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో, కర్నూల్ లో ఎక్కువ మంది, తరువాత అనంతపురంలో ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు, కర్నూల్ లో, కేవలం 61 మందిని మాత్రమే టెస్ట్ చేసారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, కర్నూల్ లో, 189 మంది ఉన్నారని, రెండు రోజుల క్రితం, ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో తేలింది. ఇంకా వీరిలో, దాదాపుగా 120 మందికి టెస్టింగ్ చెయ్యాల్సి ఉంది.

ఇక ఈ రోజు బులిటెన్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, 11 జిల్లాల్లో కరోనా కేసులు వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళంలో, ఇప్పటి వరకు ఒక్క కరోనా పోజిటివ్ కేసు కూడా లేకపోవటంతో, అక్కడ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయినా అపత్రమత్తంగానే ఉన్నారు. ఇక అనంతపురంలో, 153 మందిని టెస్ట్ చేస్తే, 2 పోజిటివ్ వచ్చాయి. అలాగే, చిత్తూరులో, 93 మందిని టెస్ట్ చేస్తే, 8 పోజిటివ్ వచ్చాయి. తూర్పు గోదావరిలో, 229 మందిని టెస్ట్ చేస్తే, 9 పోజిటివ్ వచ్చాయి. గుంటూరులో, 302 మందిని టెస్ట్ చేస్తే, 20 పోజిటివ్ వచ్చాయి. కడపలో, 174 మందిని టెస్ట్ చేస్తే, 15 పోజిటివ్ వచ్చాయి. కృష్ణాలో, 47 మందిని టెస్ట్ చేస్తే, 15 పోజిటివ్ వచ్చాయి. కర్నూల్ లో, 61 మందిని టెస్ట్ చేస్తే, 1 పోజిటివ్ వచ్చాయి. నెల్లూరులో, 253 మందిని టెస్ట్ చేస్తే, 20 పోజిటివ్ వచ్చాయి. ప్రకాశంలో, 133 మందిని టెస్ట్ చేస్తే, 17 పోజిటివ్ వచ్చాయి. విశాఖలో, 202 మందిని టెస్ట్ చేస్తే, 11 పోజిటివ్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో, 96 మందిని టెస్ట్ చేస్తే, 14 పోజిటివ్ వచ్చాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్లో నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సేవలను, అందరూ మెచ్చుకుంటున్నారు. మొదట్లో, ఎక్కువుగా కొడుతున్నారు అని విమర్శలు వచ్చినా, తరువాత తరువాత ప్రజలు కూడా సహకరిస్తూ వచ్చారు. అయితే, కొంత మంది పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం. విజయవాడ పరిధిలో పని చేస్తున్న శాంతారాం అనే ఎస్సై తల్లి మూడు రోజుల క్రితం విజయనగరంలో అనారోగ్యంతో మృతి చెందారు. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న శాంతారాం అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. సెలవు దొరికినా విజయనగరంకు వెళ్లాలంటే మూడు జిల్లాలు దాటుకుని వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తన సోదరుడికే అంత్యక్రియల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కష్టమైన నేపథ్యంలో విధుల్లోనే నిమగ్నమయ్యారు. ఈ ఘటన పోలీసుల విధుల నిబద్ధతకు నిదర్శనంగా మారింది. లాక్​డౌన్​ సమయంలో ప్రజలంతా రెండు వారాల పాటు బయటకు రావద్దని ఈ సందర్బంగా పోలీసులు సూచిస్తున్నారు.

ఇక మరో పక్క, బుధవారం అరకులోయలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షించడానికి విచ్చేసిన ఆరుకు శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరకు లోయ ఎస్సై మోహన్ రావు దగ్గరకు వెళ్ళి, ఆయన పాదాలకు నమస్కారం చేశారు. విపత్కర సమయంలో పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిదని పేర్కొంటూ మోహన్ రావు పాదాలుతాకి, శిరస్సు వంచి పాదాభి వందనం చేసారు. దీంతో మోహన్ రావు, పోలీసు సిబ్బంది ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ మహమ్మారి కరోనా వైరస్ ను ఆపేందుకుగాను పోలీసులు చేస్తున్న కృషి పాదాభివందనం తెలిపినట్లు ఆయన చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలను ఫలంగా పెట్టి కృషి చేయుచున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు అని అన్నారు.

ముఖ్యంగా పోలీ సులు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మీడియా రేయింబవళ్లు పని చేస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి ప్రజలు కూడా తమ మద్దతును ఇవ్వా లని కోరారు. ప్రజలు తమ ఇళ్లను వదిలిబయటకు రావద్దని, మాస్క్ లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో బయటకు వస్తున్న ప్రజలు తప్పని సరిగా దూరం పాటించాలన్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ప్రజలు కూడా, సిబ్బంది మొత్తానికి సహకారం అందిస్తున్నారు. లాక్ డౌన్ జరిగిన మొదటి రోజు, బయటకు వచ్చి అందరినీ అభినందిస్తూ, చప్పట్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల మాత్రం, పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పోలీసు వారికి, వైద్యులకి సహకరించని వారు కూడా ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read