ప‌రిస్థితుల‌న్నీ అనుకూలంగా ఉంటే గ‌డ్డిపోచ కూడా ఒడ్డు చేరుస్తుంది. అవే ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారితే గ‌డ్డిపోచే పామై కాటేస్తుంది. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి ఇలాగే ఉంది. 2019 ఎన్నిక‌ల‌కి ముందు రాంగోపాల్ వ‌ర్మ‌తో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తీసి కొంత టిడిపిని డ్యామేజ్ చేయించ‌గ‌లిగారు. యాత్ర తీయించి కొంత మైలేజ్ తెచ్చుకున్నారు. కోడిక‌త్తి డ్రామా అని తెలిసినా సానుభూతి క‌లిసి వ‌చ్చింది. బాబాయ్‌పై గొడ్డ‌లిపోటు వేయించి నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అని చేసిన ప్ర‌చారం సీట్లు తెచ్చి పెట్టింది. ప‌న్నిన కుతంత్రాల‌న్నీ ఫ‌లించి సీఎం ప‌ద‌వి ద‌క్కింది. అయితే పాల‌న ప‌డ‌కేసింది. ప్ర‌జావ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది. అభివృద్ధి అథఃపాతాళంలోకి చేరింది. ఒక్క‌చాన్స్ ఇచ్చిన ప్ర‌జ‌లు ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయా దింపేద్దామా అన్నంత కోపంలో ఉన్నారు. ఇటువంటి స‌మ‌యంలో మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌లకి ప‌న్నిన కుతంత్రాలలో ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కి తీస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిశోర్ టీముతోపాటు రాంగోపాల్ వ‌ర్మ కూడా ప్యాకేజీకి వైసీపీ కోసం ప‌నిచేశారు. మ‌ళ్లీ ఇప్పుడు కూడా త‌మ ప‌ని మొద‌లుపెట్టారు ఈ ప్యాకేజీ డైరెక్ట‌ర్‌. జ‌గ‌న్ రెడ్డికి ఎన్నిక‌ల్లో ల‌బ్ధి చేకూరేలా  'వ్యూహం' పేరుతో రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. ఆలోచనకు, అహంకారానికి మధ్య జరిగే యుద్ధం అంటూ క్యాప్షన్ కూడా చెప్పారు. దీని ఫ‌స్ట్ లుక్ షూట్ ఫోటోలు విడుద‌ల చేశారు. జగన్‌ పాత్రలో అజ్మల్‌, భారతి పాత్రలో మానస నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత‌కి కూడా జ‌గ‌న్ స‌ర్కారు తాయిలం టిటిడి బోర్డు స‌భ్య‌త్వం ఆల్రెడీ క‌ట్టబెట్టేశారు. జ‌గ‌న్ రెడ్డికి చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌న్నీ అన‌నుకూలంగా ఉన్నాయి. జ‌నంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. చేయించిన అరాచ‌కాలు, బాధితులు ఆర్త‌నాదాల నేప‌థ్యంలో రియ‌ల్ విల‌న్ జ‌గ‌న్‌ని రీల్  హీరోగా రాంగోపాల్ వ‌ర్మ చేసే ప్ర‌య‌త్నం ఎదురు త‌న్నేస్తుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా పోస్ట‌ర్లు రిలీజ్ చేసిన వెంట‌నే ట్రోల్స్, మీమ్స్ హోరెత్తిపోయాయి. వాటి రీచ్ కూడా విప‌రీతంగా ఉండ‌డం వ్యూహం బెడిసికొట్ట‌డం ఖాయ‌మంటున్నారు సినీ విశ్లేష‌కులు.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల‌లో ఉద్యోగ‌సంఘ నేత‌లు ఎన్ని డిమాండ్లు, ఎన్ని నిర‌స‌న‌లు చేశారో లెక్కే లేదు. వేదిక‌ల‌పై నుంచి సీఎం బాబు, నాటి స‌ర్కారుని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేవారు. ఏ నాడూ ఏ ఉద్యోగ‌సంఘ నేత‌ని క‌నీసం హెచ్చ‌రించిన పాపాన పోలేదు. ఫిట్మెంట్ తెలంగాణ కంటే ఎక్కువ‌గా ప్ర‌క‌టిస్తే, అప్ప‌టి టిడిపి స‌ర్కారుని అభినందించాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఎవ‌డి కోసం పెంచుతాడంటూ బ‌హిరంగ వేదిక నుంచే చంద్ర‌బాబుని తూల‌నాడుతూ మాట్లాడారు. అయినా ఏనాడూ ఆయ‌న‌పై ఏ కేసులూ స‌ర్కారు పెట్ట‌లేదు. ఉద్యోగ‌ప‌రంగా, సంఘ‌ప‌రంగా ఇబ్బందులు పెట్టలేదు. లోటు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన రాష్ట్రంలోనూ ఉద్యోగుల‌కీ ఏ లోటూ రాకుండా చూసుకుంది టిడిపి ప్ర‌భుత్వం. అయినా స‌రే రెండుచేతుల‌తో ఓట్లు వేసి-వేయించి వైసీపీ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు ఉద్యోగులు. ఇది వారే చెప్పిన మాట‌. పాలిచ్చే ఆవుని కాద‌నుకుని త‌న్నే దున్న‌పోతుని తెచ్చుకున్న‌ట్ట‌య్యింది. త‌మ‌కి ఇచ్చిన హామీలు, న్యాయంగా రావాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు మాదిరిగానే జ‌గ‌న్ రెడ్డిని డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) స‌భ్యులు. దీంతో ఈ సంఘాన్ని ప్ర‌భుత్వం ర‌ద్దుచేసింది. కోర్టుకెళ్లిన ఏపీజీఈఏ విజ‌యం సాధించింది. అయితే జ‌గ‌న్ రెడ్డిది పాము ప‌గ‌. త‌న స‌ర్కారుకి జీ హూజూర్ అన‌కుండా పోరాటం అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ‌ని టార్గెట్ చేశారు. వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ‌లో నిబంధ‌న‌ల‌కి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టార‌నే ఆరోప‌ణ‌ల కేసుని సూర్య‌నారాయ‌ణ చుట్టూ బిగించారు. ఈ కేసులో న‌లుగురిని ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఏపీజీఈఏ అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో పెట్టిన కేస‌ని అంద‌రికీ తెలుసు. అయినా ఆ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టం కోసం ఏపీజీఈఏ అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణని అరెస్టు చేయ‌డం త‌ప్పించి పోలీసులు ఇంకేం చేయ‌లేరు. పాపం, ఉద్యోగులు-ఉద్యోగ సంఘాల నేత‌లు చంద్ర‌బాబు మాదిరిగానే బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్లు సాధించుకోవ‌చ్చ‌నుకుని జ‌గ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర తోక జాడించారు. ఆయ‌న తోకే కాదు జీవిత‌మే క‌ట్ చేసేలా ఉన్నారు.

అంబ ప‌లుకు..ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ ప‌లుకు అంటున్నారు తెలుగు ప్ర‌జ‌లు. రాజ‌కీయాల‌పై ఏ మాత్రం అవ‌గాహ‌న ఉన్న‌వారు న్యూస్ పేప‌ర్ చ‌ద‌వ‌గ‌లిగే వారు రాధాకృష్ణ ప‌లుకు త‌ప్ప‌నిస‌రిగా చ‌దువుతారు. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారం వారం త‌న ప‌త్రిక‌లోనూ, చాన‌ల్లోనూ వినిపించే కొత్త ప‌లుకు ఇప్పుడు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైనది నిలిచింది. ఆంధ్ర‌జ్యోతి అంటే అక్క‌సు వెళ్ల‌గ‌క్కేవారు సైతం ఆర్కే కొత్త ప‌లుకుకి అభిమానులైపోతున్నారు. ఆయ‌న చెప్పిన‌ది ఏ ఒక్క‌టీ త‌ప్పుకాలేదు. రాసిన ప్ర‌తీది అక్ష‌ర‌స‌త్య‌మైంది. మే 7వ తేదీన ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అర‌బిందో శ‌ర‌త్ చంద్రారెడ్డిని అప్రూవ‌ర్‌గా మార్చేందుకు జ‌గ‌న్ రెడ్డి ఒప్పుకున్నార‌ని ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ త‌న కొత్త ప‌లుకులో రాసుకొచ్చారు. స‌రిగ్గా నెలరోజులు తిర‌గ‌క‌ముందే అక్ష‌రం పొల్లు పోకుండా ఏబీఎన్ ఆర్కే చెప్పిన‌ట్టే శ‌ర‌త్ చంద్రారెడ్డి అప్రూవ‌ర్‌గా మారిపోయారు. బాబాయ్ హ‌త్య‌కేసులో అడ్డంగా సీబీఐకి బుక్క‌యిన క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు తానూ ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఏం చేయాలో చెప్పాలంటూ జ‌గ‌న్ రెడ్డి కేంద్రంలో పెద్ద త‌ల‌కాయ కాళ్ల‌పై ప‌డ్డార‌ని, మీరేమి చెప్పినా చేస్తాన‌ని త‌న త‌ల‌ని ఆ పెద్ద‌కి అప్ప‌గించేశార‌ని స‌మాచారం. త‌న విధేయ‌త‌, ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన సాయం గుర్తుంచుకుని సీబీఐ కేసునించి త‌మ్ముడిని, త‌న‌ని బ‌య‌ట‌ప‌డేస్తే చాలు విశ్వాసిగా ప‌డి ఉంటాన‌ని స‌రెండ‌ర్ అయిపోయాడు జ‌గ‌న్. ఇదే విష‌యాన్ని ఆర్కే త‌న కొత్త ప‌లుకులో రాశారు. ఆయ‌న రాసి నెల‌రోజులు కాలేదు. సీబీఐ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయ‌కుండా వెసులుబాట్లు ఇస్తూ, ముంద‌స్తు బెయిల్ వ‌చ్చేందుకు కావాల్సిన స‌మ‌యం ఇచ్చింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అటు అవినాష్ రెడ్డికి రిలీఫ్ ల‌భించ‌గానే ఢిల్లీ లిక్క‌ర్ కేసులో నిందితుడైన శ‌ర‌త్ చంద్రారెడ్డి అప్రూవ‌ర్‌గా మారుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అటు అవినాష్ రెడ్డిని బ‌య‌ట‌ప‌డేసేందుకు విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న‌ని లిక్క‌ర్ స్కాములో బ‌లిప‌శువుని చేయ‌డానికి అంద‌రినీ ఒప్పించుకున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. తాను సేఫ్ అనీ, సాయిరెడ్డి ఆయ‌న కుటుంబం ఆ లిక్క‌ర్ కేసునించి బ‌యట‌ప‌డే దారి వారికి వారే చూసుకుంటార‌నే ధోర‌ణిలో జ‌గ‌న్ రెడ్డి ఉన్నార‌ని స‌మాచారం.

చంద్ర‌బాబు త‌న స్టైల్ మార్చేశారు. పంచ్‌కి పంచ్‌. యాక్ష‌న్‌కి రియాక్ష‌న్‌. కౌంట‌ర్ వేస్తే ఎన్ కౌంట‌ర్ ఇదే స్టైల్ ఫాలో అవుతూ కేడ‌ర్‌లో జోష్ నింపుతున్నారు. టిడిపి సోష‌ల్ మీడియా సైన్యంలో ఉత్సాహం నింపుతున్నారు. చంద్ర‌బాబు ప్రెస్మీట్ మాట్లాడితే గ‌ణాంకాలు, త‌న హ‌యాంలో సాధించిన నిధులు, తెచ్చిన ప్రాజెక్టులు, ఇప్పుడు వెళ్లిపోయిన ప్రాజెక్టులు ఇలా ప‌ద్ధ‌తిగా చెప్పుకుంటూ పోతారు. ఇవి ప్ర‌ధాన మీడియాలో వార్త‌లుగా ప‌నికొస్తాయి. సోష‌ల్మీడియాలో ఉండాల్సిన విరుపు-మెరుపు బాబు స్పీచుల్లో దొరికేవి కావు. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన శైలి భాష‌, భావం వ‌ల్ల సోష‌ల్ మీడియాలో సీబీఎన్ డైలాగ్స్ పెద్ద‌గా వైర‌ల్ కావు. ఇటీవ‌ల ట్రెండ్ మార్చిన బాబు సెటైర్లు, పంచ్ డైలాగుల‌తో చెల‌రేగిపోతున్నారు. టిడిపి సోష‌ల్ మీడియాకి మంచి కంటెంట్ అందిస్తున్నారు. సీబీఎన్ స్పీడు చూస్తే సోష‌ల్మీడియాలో ట్రోల‌ర్స్ కంటే దారుణంగా జ‌గ‌న్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్నారు. టిడిపి మేనిఫెస్టో గురించి జ‌గ‌న్ మాట్లాడిన దానిపై స్పందిస్తూ.. జ‌గ‌న్ ప్ర‌పంచ మేధావి అనీ, వ‌ర‌ల్డ్ బెస్ట్ యూనివ‌ర్సిటీలో చ‌దివాడు, కానీ ఆ వ‌ర్సిటీ ఎక్క‌డో చెప్ప‌లేడంటూ మాస్ట‌ర్ స్ట్రోక్ ఇచ్చారు. జ‌గ‌న్ గొప్ప సంఘ సంస్క‌ర్త అనీ, జ‌గ‌న్ సంఘ సంస్క‌ర‌ణ ఏంటో తెలుసా బాబాయ్‌ని గొడ్డ‌లితో లేపేయ‌డం అని బాబు వేసిన చుర‌క‌లు సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ష్ అయి తెగ తిరుగుతున్నాయి. 2 వేల నోటు ర‌ద్దు ఐడియా త‌న‌కు రానిది, చంద్ర‌బాబుకి ఎలా వ‌చ్చింద‌ని జ‌గ‌న్ అంటున్నాడ‌ని..ఆయ‌న‌కి 2 వేల ర‌ద్దు చేయాల‌నే ఐడియా రాదు కానీ, 2 వేల దొంగ నోట్లు ప్రింట్ చేయ‌డం వ‌చ్చ‌ని ఒక రేంజులో ఎద్దేవ చేశారు. టిడిపి మేనిఫెస్టోని జ‌గ‌న్ పులిహోర‌, బిస్బిల్లా బాత్ అంటూ వెట‌కారం చేశార‌ని..పులిహోర రుచి, బిసిబిల్లా బాత్ పోష‌కాలుంటాయ‌ని..అంటే జ‌గ‌న్ టిడిపి మేనిఫెస్టో బాగుంద‌ని అంటున్నార‌ని చెణుకులు విసిరారు చంద్ర‌బాబు. ప్ర‌సంగం మొత్తం జ‌గ‌న్ రెడ్డిపై వ్యంగ్య‌బాణాలు సంధించేందుకు చ‌క్క‌గా వాడుకుని బాబు ట్రోల‌ర్లు కంటే ఎక్కువ‌గా జ‌గ‌న్ ని ర్యాగింగ్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read