స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం నుండి ఎలాంటి చర్యలు లేవు. నాలుగు దశల ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. ఫలితాలు ప్రకటించకుండా దాచి, రాత్రి 8 తర్వాత వైసీపీ బలపర్చిన అభ్యర్ధులకు అనుకూలంగా ప్రకటనలు వెలువరుస్తున్నారు. గత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ, నేడు జరిగిన చివరి దశలోనూ అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చీకటి పడిన తర్వాత జరుగుతున్న ఫలితాల తారుమారు అంశాలన్నింటిలో కూడా పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వైసీపీ అభ్యర్ధులకు అనుకూలంగా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరపున ఈ ఘటనలను మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 1. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. 2. చీకటి పడిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల్లో లైట్లు ఆపేసి ఫలితాలను తారుమారు చేస్తున్నారు. ఉదా: ఈ రోజు (21.02.2021) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనగమయ్యపాలెం కౌంటింగ్ సెంటర్లో లైట్లు ఆపేసి వైసీపీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రకటన చేశారు. 3. సింగిల్ డిజిట్ మెజార్టీతో ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాల్సి ఉన్నా.. వైసీపీ గెలుపు కోసం రెండు, మూడు అంకెల ఫలితాల తేడా ఉన్నప్పటికీ రీ కౌంటింగ్ చేస్తున్నారు. 4. ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్ధుల గెలుపు ఖాయమైనప్పటికీ.. ఫలితాలు బయట పెట్టకుండా దాచిపెట్టి.. తర్వాత వైసీపీ అభ్యర్ధులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారు. ఉదా 1 : నాలుగో విడతలో ఎన్నికలు జరిగిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ మద్దతు దారుడు 9 ఓట్ల మెజార్టీతో గెలిచినా ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా దాచిపెట్టారు. ఉదా 2 : కర్నూలు జిల్లా నందవరం మండలం మిట్టసోమాపురం పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధి ఒక ఓటు మెజార్టీతో గెలిచిన తర్వాత ఎన్నికల ఫలితాలు దాచిపెట్టి.. తర్వాత వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించారు.

5. ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధులు రీ కౌంటింగ్ కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉదా : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలో వైసీపీ అభ్యర్ధి ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటిస్తే.. రీ కౌంటింగ్ చేయాలని ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులు ప్రతిపాదించినా అధికారులు పట్టించుకోవడం లేదు. 6. వైసీపీ అభ్యర్ధులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లను అనధికారికంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లతో పంపిస్తూ.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లను మాత్రం పంపించడం లేదు. 7. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లోకి పోలీసులు వెళ్లి ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులను, కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల అధికారులను కూడా బెదిరిస్తున్నారు. 9. ఒకటి రెండు ఓట్ల తేడాతో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధులు గెలిస్తే.. వైసీపీ బలపర్చిన అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. అదే సమయంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహించాలి. ఎన్నికల కౌంటింగ్ సమయంలో పలు ఓట్లు దారి మళ్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎన్నికల సంఘం గమనించి సరైన చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఎన్నికల సంఘం నుండి సరైన స్పందన లేకపోవడంతో ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ప్రజల అభిప్రాయాలను నాశనం చేస్తోంది. ఇప్పటికైనా ఎన్నికల ఫలితాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ గగిలింది. 90 శాతం గెలుచుకుంటాం అని చెప్పిన వైసిపీ నేతలు, బొక్క బోర్లా పడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పోటా పోటీగా సీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కంచుకోతలను కూడా టిడిపి బద్దలు కొడుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తమ సొంత గ్రామంలో ఓడిపోతున్నారు. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సొంత గ్రామం అయిన, రాయుడుపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక్కడ టిడిపికి చెందిన చింతమనేని ప్రభాకర్ ఎంతో కష్టపడి సాధించారు. చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక మంత్రి విశ్వరూప్ సొంత ఊరిలో తెలుగుదేశం బలపరించిన అభ్యర్ధి గెలిచారు. అలాగే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ ఆళ్ల దశరధరామిరెడ్డి సొంత వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇది పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, పెదకాకాని మేజర్ పంచాయితీలో ఉంది. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ గారి సొంత గ్రామం, తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో వైసిపీ ఓడిపోయింది. అలాగే కొంత మంది వైసిపీ, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారు.

నాలుగోవిడత పంచాయతీ ఎన్నికలఫలితాల్లో 6-20నిమిషాల సమయానికి టీడీపీ మద్ధతుదారులు విజయం సాధించినవి 24 గ్రామాలైతే, వైసీపీవారు గెలిచినవి కేవలం పదిగ్రామాలేనని, ఉదయం నుంచి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన కందులవారి పల్లె పంచాయతీపై మీడియామొత్తం టెన్షన్ వాతావరణాన్ని సృష్టించిందని, ఆగ్రామంలో టీడీపీ మద్ధతుదారు 563ఓట్లతో విజయం సాధించాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సాయంత్రం 6, 7,8 గంటలవరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మద్ధ తుదారులే విజయం సాధిస్తుంటారని, మెజారిటీస్థానాలు టీడీపీకే వస్తాయని, తరువాత చిన్నచిన్నగా వైసీపీవారి చీకటిరాజ్యం మొద లవుతుందన్నారు. టీడీపీ విజయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తు న్నామని, ఈ విధంగా మొదటివిడతనుంచీ చెబుతున్నామన్నారు. అదేవిధంగా వైసీపీవారు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ఆనందబాబు ప్రశ్నించారు. తాము 6గంటలకు గెలుపొందిన 24 పంచాయతీల వివరాలను నియోజకవర్గాలవారీగా వెల్లడిస్తు న్నామని, అదేమాదిరి వైసీపీమద్ధతుదారులు గెలిచిన గ్రామాలను ఆపార్టీవారు ఎందుకు బహిర్గతంచేయడం లేదన్నారు. చీకటి పడే కొద్దీ వైసీపీనేతలు, ఆపార్టీకి చెందిన గూండాలు, రౌడీలు, పోలీసులు కౌంటింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఫలితాలు తారుమారు చేస్తున్నారు. అర్థరాత్రి అయ్యేసరికి పూర్తిగా ఫలితాలన్నీ వైసీపీ పరమే అవుతున్నాయని, గడచిన మూడుదశల్లో వెలువడిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు.

పోలీసులు, వైసీపీనేతలు, ఆపార్టీ రౌడీలు ఎంతలా బెదిరింపులకుపాల్పడినా, టీడీపీకార్యకర్త లు, గ్రామనాయకులు మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి పంచా యతీ ఎన్నికల్లో పోరాడారు. అటువంటి వారందరికీ పేరుపేరునా టీడీపీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా మని ఆనంద్ బాబు తెలిపారు. సాయంత్రం 6గంటలకే వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలకు సిద్ధమయ్యారని, ఫలితాలసరళి వారికి అనుకూలంగా లేకపోయినా, అత్యుత్సాహం చూపుతున్నా రన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతరమంత్రులు సంబరాలకు సిధ్ద మవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 6 గంటల కు వెలువడిన ఫలితాల్లో టీడీపీకి 24స్థానాలు వస్తే, విజయోత్సవ కార్యక్రమాలు ఎలాచేస్తారని మాజీమంత్రి నిలదీశారు. అధికార దర్పంతో, కౌంటింగ్ ప్రక్రియలో ఉన్న అధికారులను, సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురిచేయడానికే విజయోత్సవాల పేరుతో పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. సాయంత్రం 6 తరువాత నుంచి రాబోయే ఫలితాలు తమకే అనుకూలంగా వస్తా యనే అభిప్రాయంలో వైసీపీ వారు ఎలా ఉంటున్నారన్నారు. ముం దుగాను సంబరాలకు పిలుపునిచ్చి, కౌంటింగ్ ప్రక్రియను తారుమా రుచేయడమే లక్ష్యంగా అధికారపార్టీ వ్యవహరిస్తోందన్నారు. నైతికం గా ఓడిపోయిన వైసీపీ, ప్రజలదృష్టి మళ్లించడానికే విజయోత్సవ సంబరాలకు పిలుపునిస్తోందన్నారు. తొలివిడత నుంచీ రాజ్యాంగా న్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేసేలా వైసీపీ ఎన్నికలప్రక్రియను నిర్వహిస్తోందని మాజీమంత్రి మండిపడ్డా రు. గ్రామాల్లో ఎన్నిరకాలుగా చేయాల్సిన దారుణాలు చేసినా, భయోత్పాతం సృష్టించినా, ప్రజలను భయపెట్టి, వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించి, గ్రామాల్లో కలుషితవాతావరణం తీసుకొచ్చినా టీడీపీ కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారన్నారు. ఇదేవిధంగా రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సి పల్ ఎన్నికల్లో కూడా తమపార్టీ నేతలు, కార్యకర్తులు పనిచేస్తారని ఆనందబాబు తేల్చిచెప్పారు.

నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఎన్నికలు అయిన వెంటనే, సాయంత్రం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తంలో, టిడిపి, వైసీపీ మధ్య హోరా హరీగా ఫలితాలు వస్తున్నాయి. సాయంత్రం 7.30 వరకు వచ్చిన ఫలితాలు చూస్తే, తెలుగుదేశం పార్టీకి 222 పంచాయతీలు రాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 248 పంచాయతీలు వచ్చాయి. అయితే ఇంకా చాలా చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. అయితే కృష్ణా జిల్లా గన్నవరం మేజర్ పంచాయతీలో ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ బయటకు రాలేదు. అయితే విషయం ఏమిటి అని ఆరా తీయగా, గన్నవరంలోని పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో పెద్ద హైడ్రామా నెలకొంది. కౌంటింగ్ కేంద్రం గేట్లకు తాళాలు వేసి మరీ కౌంటింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. చివరకు మీడియాకు కూడా ఎటువంటి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో అసలు లోపల ఏమి జరుగుతుందో, ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ముఖ్యంగా అభ్యర్ధులు, మీడియా ఈ విషయం పై ఆరా తీస్తున్నాయి. వల్లభనేని వంశీ నివాసం ఉండే ప్రాంతం కావటంతో, ఈ ఫలితం పై టెన్షన్ నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read