రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్, రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమకు ప్రభుత్వం సహకరించటం లేదని, నిధులు ఇవ్వటం లేదని, కోర్టులో పిటీషన్ వేసారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, మీకు ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిచటం లేదో చెప్పాలి అంటూ, అదనపు చార్జ్ షీట్ దాఖలు చేయమని కోరారు. దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్, హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పలు విషయాలు ప్రస్తావించింది. మేము కోర్టులో కేసు వేసిన తరువాత, ప్రభుత్వం 39.63 లక్షలు విడుదల చేసిందని తెలిపింది. అయినా ఇంకా ఆరు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. గతంలో ఎస్ఈసి కోసం, న్యాయవాదులను పెట్టుకున్నారని, వారికి బిల్లులు చెల్లించలేదని తెలిపింది. ఈ విషయం పై తాము ప్రభుత్వానికి వివరాలు పంపామని, అలాగే ఈ విషయం పై గవర్నర్ కు కూడా తాము తెలిపామని అఫిడవిట్ లో తెలిపింది. తమకు సహకారం అందించటం లేదని, నిధులు ఇవ్వటం లేదని, ఇలా చేయటం రాజ్యాంగంలో ఉన్న 243కేను ఉల్లంఘన చేయటమే అంటూ, కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా తాము సమర్పించిన అడిషనల్ అఫిడవిట్ లో, జస్టిస్‌ కనగరాజ్‌ ను ఎస్‌ఈసీగా నియమించినప్పుడు, న్యాయవాదులకు చెల్లించాల్సిన వివరాలు కోర్టుకు తెలిపింది.

అందులో తెలిపిన వివరాలు ప్రకారం, జస్టిస్‌ కనగరాజ్‌ తరుపున వాదించటానికి, అలాగే ఇతర ఖర్చుల కింద, సీనియర్ న్యాయవాది అయిన ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ను పెట్టుకున్నారని, ఆయన ఒకసారి హాజరు అయితే, రూ.3.3 లక్షలు ఇవ్వాలని, ఆయన ఈ కేసు విషయమై 16 సార్లు హాజరు అయ్యారని, ఆయనకు రూ.58.70 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇక అలాగే, ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి తరుపున, మరో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హాజరు అయ్యారని, ఆయనకు రూ.18 లక్షల చెల్లించాలని, అలాగే ఇతర న్యాయవాదుల వివరాలు కూడా చెప్పారు. ఇక ఎన్నికలు ఆపినందుకు, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ తరుపున, హాజరు అయిన న్యావాదికి రూ.10.50 లక్షలు చెల్లించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ సందర్భంగా, న్యాయవాదులు ఫీజులు చుసిన హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవన్నీ లెక్కేస్తే కోట్ల రూపాయలు అవుతుందని, ఇదంతా ప్రజలు కట్టే సొమ్ము అని, ప్రజల సొమ్ముని ఇలా ఖర్చు చేయటం బాధాకరం అని అన్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, హైదరాబాద్ లో, విజయవాడలో నివాసం ఉండటం పై కూడా కోర్టు కామెంట్ చేస్తూ, రెండు చోట్ల ఎందుకని ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై, గత ఏడాది వేసిన కేసు హైకోర్టుకు రావటంతో, గత వారం హైకోర్టులో ఈ విషయం పై విచారణ జరిగిన సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం కో-వి-డ్ ఉంది కాబట్టి, ఎన్నికల నిర్వహణ కష్టం అని చెప్పగా, ఆ విషయం చెప్పాల్సింది ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కాదు అంటూ, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతుంటే, మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది ఏమిటి, ఎన్నికల నిర్వహణ పై అభిప్రాయం చెప్పండి అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు , అఫిడవిట్ దాఖలు చేయమని, ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నేపధ్యంలో, హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్ ఈ కసరత్తు ప్రారంభించింది. అసలు ఎన్నికల నిర్వహణకు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమని అనుకుంటున్నాయి అనే అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే, నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పై మీ అభిప్రాయం చెప్పండి అంటూ, ఆ ప్రెస్ నోట్ లో తెలిపింది. విజయవాడలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే సూచనలు ప్రకారం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై, ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. సహజంగా మెజారిటీ పార్టీల అభిప్రాయం ఎటు వైపు మొగ్గు ఉంటే, అటు వైపు నిర్ణయం తీసుకునే అభిప్రాయం ఉంది. అదే విధంగా, అధికార పార్టీ ఈ విషయంలో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఎందుకంటే గతంలో, వారు ఎన్నికలు జరపాలసిందే అంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టారు. ఇక మరో విషయం ఏమిటి అంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్, గతంలో ఇచ్చిన షడ్యుల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం పై, ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతంలో, పంచాయతీ, ఎంపీటీసి, జెడ్పీటీసి, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహణ చేయాలనీ అనుకున్నారు. దీనికి సంబంధించి, నామినేషన్ లు కూడా వేసారు. ఇక చాలా చోట్ల ఏకాగ్రీవాలు అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో, ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం పై ఆసక్తి నెలకొంది. దాదాపుగా 8 నెలలు దాటిపోయింది కాబట్టి, ఆ నోటిఫికేషన్ చెల్లుతుందా, చట్ట ప్రకారం ఏమి చేస్తారు, ఏకగ్రీవాలు ఏమవుతాయి లాంటి అంశాల పై, స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరో పక్క అధికార పక్షం ఎన్నికల నిర్వహణకు ఒప్పుకోకుండా, మిగతా ప్రతిపక్షాలు అన్నీ ఒప్పుకుంటే, పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా, తమకు నిర్వహణకు డబ్బులు ఇవటం లేదు అంటూ, ఎన్నికల సంఘం కూడా కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం నేపధ్యంలో ఏమి జరుగుతుందో చూడాలి.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిన్న హైకోర్టులో, ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వటం లేదు అంటూ వేసిన పిటీషన్ పై, ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, ఈ పిటీషన్ విచారణకు రావటానికి ముందే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు రూ.39 లక్షల రూపాయాల నిధులు బదిలీ చేసింది. అయితే ఈ పిటీషన్ వేయటంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యి, నిధులు విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో, ఈ పిటీషన్ విచారణకు రావటంతో, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నాం అంటూ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటుగా, రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న ఎన్నికల కమిషన్, నిధులు కోసం, హైకోర్టుకు రావటం బాధాకరం అని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అంటూ, రాష్ట్ర ప్రభుత్వ తరుపున న్యాయవాది చెప్పారు. అయితే ఇదే సమయంలో హైకోర్టు మేము, ఈ విషయాలు అన్నీ గమనిస్తున్నామని, ఈ విషయాలు గమనిస్తే తప్పు ఏంటి అంటూ, హైకోర్టు ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణకు, కావాల్సిన సిబ్బందిని కూడా అందించాలని ఎన్నికల కమిషన్ పిటీషన్ లో తెలిపింది. దీనికి సంబంధించి కూడా, రేపు హైకోర్టులో పూర్తీ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలనీ ఆదేశించింది. అఫిడవిట్ పరిశీలించిన తరువాత, అది పరిశీలించి తాము ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపధ్యంలోనే ఎన్నికల కమిషన్ పిటీషన్ వేయటం, వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయటం జరిగిపోయింది. మిగతా ఎన్నికల ప్రక్రియకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమి ఆవసరం, ఏమి సహకారం కావలి అంటూ, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రేపు ఎన్నికల కమిషన్ ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేస్తే, ఆ తరువాత హైకోర్టు పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చే అవకాసం కనిపిస్తుంది. అయితే నిన్న ఈ విషయం పై నిమ్మగడ్డ పిటీషన్ దాఖలు చేసారు. ఆర్టికల్243(కే) ప్రకారం, ఎలక్షన్ కమిషన్ నిధులు ఆపేయటం, రాజ్యాంగ విరుద్ధం అని తన పిటీషన్ లో తెలిపారు. ప్రభుత్వం తమకు సహకరించటం లేదు కాబట్టి, కోర్టు జోక్యం చేసుకోవాలని, ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ పరిణామం పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని, ఈ దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి జరిగి ఉండదని, వ్యవస్థలతో , కావాలని ఇలా డీ కట్టటం ఏమిటి అంటూ, ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటారు, రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు. ఇంకేముంది, మేము కేంద్ర మంత్రి వర్గంలో కూడా చేరిపోతున్నాం అని హడావిడి చేసారు. విజయసాయి రెడ్డి లాంటి నేతలు అయితే, మేము అన్నీ మోడీ, అమిత్ షా కు చెప్పే చేస్తున్నాం అంటూ, తాము చేసేవి అన్నీ కేంద్ర సహకారంతోనే అనే విధంగా చెప్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు కూడా, వైసీపీకి అనుకూలంగానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇంత సమన్వయం, ఇంత స్నేహం ఇద్దరి మధ్య ఉన్నా, రాష్ట్రానికి రావాల్సిన బకాయలు కానీ, విభజన హామీల్లో చెప్పిన అంశాలు కానీ, పోలవరం కానీ, ప్రత్యెక హోదా కానీ, ఇలా లిస్టు చెప్పుకుంటూ పొతే చాలా పెద్దగా ఉంటుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేక పోయారు. పోలవరం విషయంలో, గత ప్రభుత్వ హయంలో చేసిన ఖర్చుని కూడా ఇప్పటికీ కేంద్రం నుంచి తెచ్చుకోలేక పోయారు. ఇక పొతే పోలవరం విషయంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి వస్తుంది. ఈ సంకేతాలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కేంద్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏమి చెప్పలేదు కాబట్టి, మిన్నకుండి పోయారు. ఇక విషయం ఏమిటి అంటే, కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు, కేంద్ర జల శక్తి శాఖకు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇందులో, పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పై కొర్రీలు పెడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన అంచనా కాకుండా, 2013-14 అంచనా ప్రకరామే భరిస్తామని, దీని పై అభిప్రాయం చెప్పాలి అంటూ, కేంద్ర ఆర్ధిక శాఖ, కేంద్ర జల శక్తి శాఖను కోరింది.

అంతే కాకుండా, తాగునీటి సరఫరాతో, విద్యుత్ బ్లాకుని ఈ ఖర్చులో నుంచి తొలగించాలని కూడా ప్రతిపాదన పెట్టింది. అయితే కేంద్ర జల శక్తీ శాఖ ఎలాంటి సమాధానం చెప్పిందో ఇంకా తెలియలేదు. అయితే ఈ విషయం తమకు కూడా తెలిసిందని, కానీ అధికారికంగా సమాచారం లేదని అంటున్నారు. ఒక వేళ ఇదే కనుక జరిగితే, రాష్ట్రం చాలా నష్టపోతుంది. గతంలో చంద్రబాబు రూ.55656.87 కోట్లతో అంచనాలు పంపించగా, రూ.47,725.24 కోట్లకు కేంద్రం ఒప్పుకునే సూచనలు కనిపించాయి. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి, చంద్రబాబు అవినీతి చేయటానికే అంచనాలు పెంచారు అంటూ ప్రచారం చేసారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ 16 నెలల్లో పెద్దగా పోలవరం పనులు చేసింది కూడా లేదు. గత ప్రభుత్వం చేసిన ఖర్చుని కూడా తెచ్చుకోలేక పోయారు. ఇక ఇప్పుడు 2013-14 అంచనాలు అంటే, 30 వేల కోట్లు కూడా వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికే ఇచ్చిన దాన్ని పక్కన పెడితే, మరో 5-8 వేల కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చే అవకాసం ఉండదు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడి, రూ.47,725.24 కోట్లకు అటూ ఇటూగా అంచనాలు ఆమోదించుకుని రావాలని కోరుకుందాం.

Advertisements

Latest Articles

Most Read