అమరావతి రైతులకు పోలీసులు బేడీలు వేసిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం రేగింది. అమరావతి రైతులకు బేడీలు వేయటం పై, గత మూడు రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆ ఆందోళనలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, నిర్బంధాలతో, ఈ రోజు మొత్తం సాగింది. అయితే ఈ సంఘటనలో, ఈ రోజు సాయంతం కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం, వస్తున్న విమర్శలకు తలొగ్గి, అమరావతి రైతులకు బేడీలు వేసిన ఆరుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అమరావతి రైతులు ఇచ్చిన జైలు భరో కార్యక్రమం ముగియగానే, ఈ ఆరుగురు పోలీసులు పై సస్పెన్షన్ ఎత్తేసారు పోలీసులు. రైతులకు బేడీలు వేసిన, ఆరుగురు సిబ్బంది పై సస్పెన్షన్ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఘటన తాము కావాలని చేయలేదని, వారికి బేడీలు వేసే సమయంలో, వారు రైతులు అని తమకు తెలియదని, తమ పై సస్పెన్షన్ ఎత్తేయాలని, ఉన్నతాధికారులకు మోర పెట్టుకోవటంతో, వారి పై సస్పెన్షన్ ఎత్తేసారు. అయితే వీరి పై సస్పెన్షన్ ఎత్తి వేసినా, ఈ ఘటన పై శాఖాపరమైన విచారణ, కొనసాగుతూనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఆదేశాలు ఇచ్చిన వారి పై చర్యలు తీసుకోవాలని, డీఎస్పీ పై, డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చిన ఆ నాయకుడు పై చర్యలు తీసుకోవాలి అంటూ, రైతుల నుంచి గత రెండు రోజులుగా డిమాండ్ లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎవరినీ బాధ్యత లేకుండా, కేవలం విచారణ జరుగుతుంది అంటూ, తంతు ముగించారు.

వారం రోజులు క్రితం, అమరావతిలో, మూడు రాజధానులకు మద్దతుగా, ఆటల్లో కొంత మంది జనాలను తోలుకు వస్తు ఉండటం, అలాగే వారికి ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇస్తూ ఉండటంతో, అసలు మీరు ఎవరు ఎక్కడ నుంచో వచ్చి, మా ఊరిలో ధర్నాలు చేయటానికి అంటూ, అమరావతి రైతులు, ఈ ఆటో ఆర్టిస్ట్ లని పట్టుకుని నిలదీశారు. అయితే తమను నిలదీశారు అంటూ, కొంత మంది కేసు పెట్టారు. వాళ్ళు పెట్టిన కేసు ఒకటి అయితే, పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇలా ఎందుకు కేసు పెట్టారు అంటూ కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి , తాను కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నాను అని ప్రకటించగా, పోలీసులు మాత్రం వినలేదు. రెండు వైపులా వెళ్లి కోర్టులోనే తేల్చుకోవాలి అంటూ, 11 మందిని అరెస్ట్ చేసారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఈ దేశ చరిత్రలో లేని విధంగా, ఎస్సీల పైనే, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇలాంటి కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసారు. అయితే ముందుగా నరసరావుపేట సబ్ జైలుకు తీసుకుని వెళ్ళగా, అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు జైలుకు తీసుకుని వచ్చారు. ఈ తీసుకుని వచ్చే క్రమంలో, రైతులకు బేడీలు వేసి తీసుకుని వచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాక, దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీంతో మొదట ఈ ఘటనకు బాధ్యులని చేస్తూ, కొంత మంది కింద స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయగా, రెండు రోజులుకే వారి పై సస్పెన్షన్ ఎత్తేసారు. మరి ఈ ఘటనకు బాధ్యులు ఎవరో ప్రభుత్వమే చెప్పాలి.

పోలవరం ప్రాజెక్ట్ పై నెలకొన్న అనిశ్చితి పై జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. ప్రధాని నరేంద్ర మోడీకి సవివరంగా జగన్ లేఖ రాసారు. గత కొన్ని రోజులుగా, పోలవరం సవరించిన అంశాల పై చర్చ జరుగుతుందని, దీనిని మీ దృష్టికి తెస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 90లో పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా చెప్పారని, కేంద్రం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని అనుమతులు తెచ్చి, పోలవరం ప్రాజెక్ట్ తో పాటుగా, ఆర్ అండ్ ఆర్ కూడా చేస్తుందని చెప్పారని గుర్తు చేసారు. ఏప్రిల్ 1, 2014 వరకు పెట్టిన ఖర్చు మినిహా, దాని తరువాత నుంచి పెట్టిన ఖర్చు మొత్తం ఇస్తాం అని చెప్పారని గుర్తు చేసారు. అలాగే 2013 ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ ప్రకారం, ఖర్చు పెరుగుతుందని కూడా చెప్పారని లేఖలో తెలిపారు. కేంద్ర క్యాబినెట్ నోట్ లో కూడా, పెరిగిన ఖర్చు మొత్తాన్ని కేంద్రమే పెట్టుకుంటుందని చెప్పారని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి కోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పెట్టారని గుర్తు చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఈ ఉత్తరంలో ఒక కీలక విషయం చెప్పారు. గత చంద్రబాబు హయంలో, రాష్ట్రాన్ని, పూర్తి స్థాయి రివైజడ్ ఎస్టిమేట్స్ గురించి అడిగారని, దానికి తగ్గట్టు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, అంటే 02-01-2018లో 2017-18 రివైజడ్ ఎస్టిమేట్స్ ప్రకారం రూ 57,292.42 కోట్లు అవుతుందని కేంద్రానికి సవరించిన అంచనాలు సమర్పించారని చెప్పారు.

దీని ప్రకారం, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, 55,548.87 కోట్లకు సవరించిన అంచనాలు ఒప్పుకుంటూ, రాష్ట్రానికి 18.2.2019న ఆమోదం తెలిపిందని చెప్పారు. అంటే చంద్రబాబు హయంలోనే 55,548.87 కోట్లకు కేంద్రం ఒప్పుకున్నట్టు, జగన్ గారే తన లేఖలో ప్రధానికి తెలిపారు. అయితే తన హయంలో అంటే, తాను అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు హయంలో ఒప్పుకున్న 55,548.87 కోట్లను, కేంద్రం తగ్గించి 47,617.74 కోట్లకు ఒప్పుకుందని, అంటే చంద్రబాబు హయాంకు, తన హయాంకు, దాదాపుగా 8 వేల కోట్లు కోత పెట్టిందని జగన్ గారే ఒప్పుకున్నారు. అలాగే చంద్రబాబు హయంలో ఖర్చు చేసిన 12520.91 కోట్లతో, రూ.4,013.65 కోట్లు ఇంకా పెండింగ్ ఉందని, అది కూడా విడుదల చెయ్యాలని కోరుతున్నారు. అలాగే ఇంత అంచనాలు పెరగటానికి కారణం, కేవలం ఆర్ అండ్ ఆర్ కి మాత్రమే రూ.28,191.03 కోట్లు అవుతాయని అన్నారు. ఒక్క అండ్ ఆర్ కి రూ.28,191.03 కోట్లు అయితే, మీరు 20 వేల కోట్లకు ఎలా ఆమోదిస్తారని, ప్రధానికి రాసిన లేఖలో జగన్ తెలిపారు. అయితే ఇక్కడ ప్రధానికి లేఖ కాబట్టి అన్నీ వాస్తవాలు రాసారు. బయటేమో చంద్రబాబు ఏమి చేయలేదు అని చెప్తూ, ప్రధానికి రాసిన ఉత్తరం మొత్తం, చంద్రబాబు చేసిన పని గురించి చెప్పుకుని, అడుగుతున్నారు. అంటే వైసీపీ చేసిన ఆరోపణలు జగన్ గారే ఖండించినట్టు అనమాట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 రోజులుగా కుదిపేస్తున్న టాపిక్ పోలవరం. గత తెలుగుదేశం హయంలో పునాదులు లోపల ఉన్న ప్రాజెక్ట్ పనులు, 72 శాతం పూర్తి చేస్తే, ఇప్పటికీ రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇవ్వలేదు. ఇక మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచాలు దాదాపుగా 55 వేల కోట్లు రూపాయలను, కేంద్ర జల శక్తి శాఖ టెక్నికల్ కమిటీ ఆమోదించి, కేంద్ర ఆర్ధిక శాఖకు పంపించింది. ఇందు కోసం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక లక్ష కాయితాలు ఢిల్లీ పంపించి, కేంద్రాన్ని ఒప్పించింది. అయితే అధికారం పోవటం, వైసీపీ అధికారంలోకి రావటం, తరువాత పోలారం నిర్మాణం అటకెక్కటం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా, గతంలో తెలుగుదేశం ఆమోదింపచేసుకున్న రూ.55 వేల కోట్లు కాకుండా, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. అయితే కేంద్ర వైఖరి పై అందరూ స్పందిస్తుంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రముఖ పార్టీగా ఉన్న జనసేన మాత్రం స్పందించటం లేదు. దాదాపుగా 10 రోజులు తరువాత, జనసేన ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, పోలవరం పై స్పందించింది. జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేశ్ పేరుతొ ఈ ప్రకటన విడుదుల అయ్యింది. ఈ ప్రకటన చూసిన వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కూడా రాజకీయ పార్టీ కాబట్టి, సహజంగానే, తెలుగుదేశం, వైసీపీ పై విమర్శలు చేసింది. ప్రకటన మొదటి లైన్ లోనే, పోలవరం ఇలా అవ్వటానికి కారణం తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ అంటూ, మొదటి లైన్ లోనే విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీల విమర్శలు సహజం కాబట్టి, దీని విషయంలో ఏమి మాట్లాడ లేం.

అయితే ఈ వివాదానికి, మోసానికి మొత్తం కారణం అయిన కేంద్రం ప్రభుత్వం పై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది , ఆంధ్రప్రదేశ్ హక్కు. ఈ దేశ పార్లమెంట్ ఇచ్చిన హక్కు. అది ఎవరో దయ మీద మనకు వచ్చేది కాదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఉత్తరాది అహంకారం మీద మాట్లాడుతూ, చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే జనసేన తమ అధినేత చెప్పిన మాటలే మర్చిపోయినట్టు ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పై ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం ఉదారంగా స్పందించి, పోలవరం పూర్తి చేయాలి అంటూ, సన్నాయి నొక్కులు నొక్కుతుంది. కేంద్రం చొరవ చూపాలని, ఉదారంగా వ్యవహరించాలని దేబిరించటం ఏమిటో జనసేనకే అర్ధం కావాలి. ఎంత మిత్ర పక్షం అయితే మాత్రం, పోలవరం ప్రాజెక్ట్ కు ఇంత అన్యాయం చేస్తుంటే, ఎలా ఊరుకుంటారు ? జనసేన అన్నట్టు, తెలుగుదేశం, వైసీపీది తప్పే కావచ్చు, కానీ అంతకు మూడింతల తప్పు కేంద్రం చేస్తుంది. మనకు పార్లమెంట్ వేదికగా, ఈ దేశ చట్టాల ప్రకారం, పోలవరం హక్కు. ఇది మోడీ ఇష్టమో, ఎవరో దయో కాదు. కేంద్రాన్ని నిలదీయాల్సిన పార్టీలు అన్నీ, ఇలా కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాయి కాబట్టే, కేంద్రం ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఇంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా, కేంద్రం ఉదారంగా సాయం చేయాలి అంటుంటే, కేంద్రానికి అలుసు కాక ఇంకేం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఈ పార్టీలను నమ్ముకోకుండా, కేంద్రం పై పోరాడాల్సిన సమయం వచ్చిందేమో.

‘‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’’ ఆన్ లైన్ సమావేశంలో శనివారం మధ్యాహ్నం ఐఐటి బోంబే విద్యార్ధులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సామర్ధ్యం బైటపడుతుంది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుంటే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క-రో-నాను ఎదుర్కొన్న తీరుతెన్నులను బట్టే రాబోయే రోజుల్లో వివిధ దేశాలు ముందంజ వేస్తాయి. ఈ నేపథ్యంలో మా వంతు బాధ్యతగా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపాం. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు దోహదం చేశాం. మా తరం దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పుట్టినవాళ్లం. మీ యువతరం ఆర్ధిక సంస్కరణల ముందు, తర్వాత పుట్టినవాళ్లు. 1991లో టైమ్స్ మ్యాగజైన్ లో ‘‘ప్రపంచ ఆర్ధిక సవాళ్లను భారతదేశం ఎదుర్కోగలదా’’ అనే వ్యాసం మమ్మల్నెంతో అసంతృప్తికి గురిచేసింది. దానినొక సవాల్ గా తీసుకునేలా చేసింది. ఆర్ధిక సంస్కరణలకు ముందు మనదేశంలో ఏకపార్టీ పాలన ఉండేది. తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల పాలన వచ్చింది. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టినప్పుడు పెట్రోల్ డీజిల్ దిగుమతులకు కూడా ఆర్ధిక కటకట. బంగారం కూడా కుదవబెట్టిన పరిస్థితులు. ఆ స్థితినుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరాం, భవిష్యత్తులో ప్రపంచంలోనే తొలిరెండు స్థానాల్లో భారతదేశం చేరనుంది. 1991లో ఆర్ధిక సంస్కరణలు, 1995లో తాను సీఎం కావడం, 1996లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఏపిలో సెకండ్ జనరేషన్ రిఫామ్స్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తొలిసారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించానని, 20ఏళ్ల ముందు ఆలోచనలు చేయడం ఏమిటనే కొందరి సందేహాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా చేసిన కృషి వివరించారు.

హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటి ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటి అభివృద్దికే నమూనా అయ్యింది. ఆర్ధికంగా ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి దోహదం చేసింది. సియాటెల్ తర్వాత రెండవ బేస్ గా హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో ఆంధ్రప్రదేశ్ నుంచే, గూగల్ సిఈవో ఇండియా నుంచే, అనేక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మనదేశం నుంచే కావడం విశేషం. హైదరాబాద్ లో అప్పుడు అభివృద్ది చేసిన బయో టెక్నాలజీ పార్క్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ముందంజలో ఉండటం, 8లేన్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, దేశానికే 4% జిడిపి ఇచ్చే స్థాయికి హైదరాబాద్ చేరేందుకు ఇవన్నీ దోహదపడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత 13జిల్లాల ఏపికి ఆర్ధిక కష్టాలు..రాజధాని లేదు, బస్సులోనుంచే పరిపాలన.. పట్టుదలతో పనిచేసి 10.5% వృద్దిరేటు సాధించాం, జాతీయ వృద్దిరేటు 7.3% ఉంటే దానికన్నా మూడు నాలుగు రెట్లు ముందున్నాం. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించాం. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 17% వృద్ది సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4ఏళ్లు నెంబర్ వన్ గా నిలబడ్డాం. రూ 15.48లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టాం, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా ఏపికి తెచ్చాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం, పట్టుదలగా పనిచేయడం ద్వారానే పురోగతిని సాధించాం. గత 30ఏళ్లలో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాబోయే 30ఏళ్ల అభివృద్ధి వైపు మనందరి దృష్టి ఉండాలి. 2050నాటికి ఎలా ఉండాలన్న ఆలోచన చేయాలి.

మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి. ప్రతి విజయానికి ఒక విజన్ ఉంటుంది. మీ అందరికీ ‘‘మెగా మైండ్ సెట్’’ ఉండాలి. భారతదేశం మెగా సూపర్ పవర్ గా ఎదిగేలా మీరంతా మెగా సూపర్ పవర్ గా ఎదగాలి.. ఇప్పుడు నడుస్తోన్న పారిశ్రామిక విప్లవం 4.0లో మీ భాగస్వామ్యంపై ఆలోచన చేయాలి. దీనికంటె ముందు 4 పారిశ్రామిక విప్లవాల వృద్ది పరిణామ క్రమం చూడాలి. 4వ పారిశ్రామిక విప్లవంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మిషన్ టూల్స్, డేటా సెంటర్ వచ్చాయి. పర్యావరణ హిత వాతావరణం, ఆటోమోటెడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వృద్ది నేపథ్యంలో కాలుష్య రహిత సమాజం కోసం మీరంతా దృష్టి పెట్టాలి. 4.0పారిశ్రామిక విప్లవంలో సాంకేతికత, టూల్స్ వినియోగం అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ రాకముందు అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం పంపాలంటే 3, 4రోజులు పట్టేది. ఫోన్ లో మాట్లాడాలంటే వందల రూపాయల ఖర్చయ్యేది. అలాంటిది ఇంటర్నెట్ అభివృద్ది చెందాక ప్రపంచమే గ్లోబల్ విలేజిగా మారింది. గతంలో ఉపాధ్యాయులనుంచి పాఠాలు నేర్చుకునేవాళ్లం. ఇప్పుడు అధ్యాపకులకే పాఠాలు చెప్పే పరిస్థితిలో విద్యార్ధులు ఉన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులుగా ఉండే వర్గీకరణ ఇప్పుడు ఐటి లిటరేట్, ఐటి ఇల్లిటరేట్ గా మారింది. ఒకప్పుడు రూ 14 ఉండే సోలార్ పవర్ యూనిట్ తర్వాత రూ 7కు, ఇప్పుడు రూ 2.50కు వచ్చింది. భవిష్యత్తులో సోలార్ పవర్ యూనిట్ రూపాయి, రూపాయిన్నరకే వచ్చే అవకాశం. ప్రకృతే సహజ ఇంధన ఉత్పాదన వనరు. సమాజంలో ఏవిధంగా వినూత్న మార్పులు వస్తున్నాయో ఇవే ప్రబల సాక్ష్యాలు. జలవిద్యుత్ సీజనల్ కాబట్టి, థర్మల్ పవర్ తప్ప మార్గాంతరం లేదని గతంలో భావించారు. ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్, సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరులు వచ్చాక థర్మల్ పవర్ తెరమరుగు అవుతోంది. పర్యావరణహితంగా సమాజంలో వచ్చే మార్పులను స్వాగతించాలి, అనుసరించాలి.

‘‘2050నాటికి భారతదేశంలో చోటుచేసుకున మార్పుకు నేను ఏవిధంగా దోహద పడగలను అనేది’’ ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక నిముషం ఆలోచించాలి. ఆ విధమైన నిద్రలేని రాత్రులే మిమ్మల్ని ఈ మార్పుకు నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. ఓటమి భయం ఉండకూడదు. రిస్క్ లను ముందే ఊహించి ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మానవీయ విలువలను కోల్పోరాదు. ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరూ అప్ గ్రేడ్ కావాలి. మీ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరికరాల వినియోగంపై పట్టు సాధించాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలి, దానిని ప్రోత్సహించాలి, పోటీతత్వంతో, నైపుణ్యాభివృద్దితో ముందడుగు వేయాలి. సరైన విజన్ ఉన్నప్పుడే మన లక్ష్యసాధన, దిశానిర్దేశం ఉంటుంది. మన జీవితానికి దిక్సూచి, లక్ష్య సాధన ద్వారా మన కలల సాఫల్యానికి శక్తి మన విజన్. మన కలలు నెరవేర్చే విజన్ ఉండాలి, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అద్భుత నాయకుడిగా ఎదగగలరు. తద్వారా మీ సాధికారతతోపాటు దేశ సాధికారత సాధ్యమయ్యేలా ఉభయతారకంగా మీ అందరి ఎదుగుదల ఉండాలి. మీ ఎదుగుదల కోసం ఒక విజన్ రూపొందించుకోండి. మెగా మైండ్ సెట్ ద్వారా దానిని చేరుకోండి. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయండి, స్థూలంగా కార్యాచరణ చేయండి. అప్పుడే మీరు మీమీ రంగాల్లో అద్భుత నాయకుల్లాగా ఎదుగుతారు.
2050 వైపు మీ ప్రయాణంలో ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే, ‘‘నేను కాలాన్ని మార్చగలనా, లేక కాలమే నన్ను మార్చుతుందా..?’’ అని...

Advertisements

Latest Articles

Most Read