సోషల్ మీడియాలో వైసీపీ నడుపుతున్న సోషల్ మీడియా వింగ్ చేస్తున్న పనులకు ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి, సామాన్య మహిళలు దాకా అందరూ బాధితులే. ఇంకా చెప్పాలి అంటే, ఈ దేశ న్యాయ వ్యవస్థ, అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తులు కూడా బాధితులే. అంతలా విషం చిమ్ముతూ ఉంటుంది వైసీపీ సోషల్ మీడియా. అయితే ఇందులో వింత ఏమిటి అంటే, ఇలాంటి బురదగుంటను, సమర్ధిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు. ఇలా చేస్తుంటే వారిని దండించి, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పాలి కానీ, ఏకంగా మీడియాకు ఎక్కి, వాళ్ళను సమర్ధిస్తూ మాట్లాడటంతో, వాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో న్యాయస్థానాలు, న్యాయ మూర్తుల పై ఇష్టం వచ్చినట్టు, ఈ బ్యాచ్ రేచ్చిపోతూ, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి విసుగు చెందిన హైకోర్టు రిజిస్టార్, ఏకంగా తానె హైకోర్టు తరుపున పిటీషన్ వేయాల్సిన పరిస్థితి. దీంతో ఈ విషయం పై స్పందించిన న్యాయస్థానం వంద మంది వరకు నోటీసులు ఇచ్చి, సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే సిఐడి సరిగ్గా పని చేయకపోవటంతో, ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణకు ఆదేశించినా, హైకోర్టులో ఈ కేసు ఉన్నా, ఈ బ్యాచ్ మాత్రం ఏ మాత్రం భయ పడటం లేదు. ఈ నేపధంలోనే, ఈ మధ్య అమరావతి పై ఎలాంటి ఫేక్ చేస్తున్నారో చూస్తున్నాం. నిన్నటికి నిన్న హైకోర్టు మునిగిపోయింది అంటూ కట్టు కధలు అల్లారు.

అలాగే అమరావతి పోరాటం చేస్తున్న మహిళల పై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అలాగే మరోసారి సోషల్ మీడియాలో అమరావతిలో ఉద్యమం చేస్తున్న ఒక మహిళ పై, తుళ్ళూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గద్దె రాకేష్ అసభ్య పదజాలంతో పోస్టింగ్ పెట్టాడు. మూడు వందల రోజుల ఉద్యమం సందర్భంగా, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తుళ్ళూరు దీక్షా శిబిరాన్ని సందర్శించిన సమయంలో, ఒక మహిళా రైతు లోకేష్ తో తన బాధలు చెప్పుకున్నారు. తన భర్త చనిపోయి, మూడేళ్ళు అయ్యిందని, పగలు దీక్షా శిబిరంలో ఉద్యమం చేస్తూ, రాత్రి పూట మిషన్ కుట్టుకుని జీవనం సాగిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని, ఆమె లోకేష్ ముందు గోడు చెప్పుకున్నారు. అయితే కొన్ని పత్రికల్లో వచ్చిన ఆ వార్త తీసుకుని, తుళ్ళూరు కు చెందిన వైసీపీ కార్యకర్త గద్దె రాకేష్ ఆ మహిళా రైతు పై అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు రాకేష్ వద్దకు వెళ్లి దేహశుద్ధి చేసారు. అమరావతి మహిళల జోలికి వస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకోం అని, ఎవరికైనా ఇలాగే బుద్ధి చెప్తాం అంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు, జరిగిన సంఘటన పై ఆరా తీస్తున్నారు.

ఎప్పుడో 2015 నాటి ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెర మీదకు వచ్చింది. 2015లో తెలంగాణా ప్రభుత్వం, అప్పటి ఏపి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కలిసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేసారు అంటూ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం చాలా పెద్దది అయ్యింది కూడా. వివిధ మొబైల్ ఫోన్ ఆపరేటర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేసారనే ఆరోపణతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై, వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఒక సిట్ ను నియమించింది. ఈ సిట్ కు చీఫ్ గా మహ్మద్‌ ఇక్బాల్‌ ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ కేసు తెర మీదకు తీసుకువచ్చిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ సిట్ కు కొత్త చీఫ్ గా శాంతిభద్రతల విభాగం డీఐజీ రాజశేఖర్‌బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం కీలకంగా మారింది. దీనికి సంబందించిన ఉత్తర్వులను జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రావీ ప్రకాష్ విడుదల చేసారు. అయితే ఇప్పుడు ఈ సిట్ పై ఎందుకు కదలిక వచ్చింది ? అప్పట్లోనే మరుగున పడిన ఈ కేసును మళ్ళీ ప్రభుత్వం ఎందుకు తిరగదొడింది అనే చర్చ మొదలైంది.

అప్పట్లో ఓటుకు నోటు అంటూ, తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేసింది. అయితే ఇది ఇలా నడుస్తూ ఉండగానే, తెలంగాణా ప్రభుత్వం ఏపి ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ కొన్ని ఆధారాలు ఇవ్వటంతో, కేసీఆర్, జగన్, తెలంగాణా హోం మంత్రిగా చేసిన నాయని, సాక్షి టీవీ, టీ న్యూస్ పై, ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 88 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మహ్మద్‌ ఇక్బాల్‌ ని ఈ సిట్ కు సారధ్యం వహించాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆయన తన 2018లో పదవికి రిటైర్మెంట్ ప్రకటించటంతో, అప్పటి నుంచి ఈ కేసు మరుగున పడి పోయింది. ఇందులో మరో కొస మెరుపు ఏమిటి అంటే, మహ్మద్‌ ఇక్బాల్‌ ఇప్పుడు వైసీపీలో చేరి, ఏకంగా ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఈ సిట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సిట్ కు రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా మరో అధికారికి బాధ్యతలు ఇవ్వటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వైసీపీప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా మరోకుట్ర పన్నిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ రాజధానికి వ్యతిరేకంగా ఎన్నోరకాల కుట్రలు పన్నారని, ఇంకెన్నో రకాల అభాండాలు వేశారని, మరెన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరదను సకాలంలో కిందకు వదలకుండా కావాలనే నీటిని అమరావతి మునిగేలా నిల్వచేశారు. అయినాకూడా జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజీ నుంచి సకాలంలో నీటిని దిగువకు వదలకుండా, బ్యారేజీ గేట్లు పూర్తిగా తెరవకుండా కుట్రలు చేసిందన్నారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలోని నీటినిల్వలు, పైనుంచి వస్తున్న ప్రవాహం, దిగువకు వదులుతున్న నీటి ప్రవాహం వివరాలు ఉంటాయన్నారు. ఆ వెబ్ సైట్ ను పరిశీలిస్తే, 13-10-2020న సాయంత్రం 4గంటలకు, ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద 2లక్షల79వేల490 క్యూసెక్కులైతే, దిగువకు వదిలే నీరు, లక్షా 98వేల450 క్యూసెక్కులుగా ఉందని పట్టాభి పేర్కొన్నారు. అదేవిధంగా 14-10-2020న ఉదయం 8 గంటలకు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ప్రవాహం 13వ తేదీ మాదిరే 2లక్షల79వేల 490క్యూసెక్కులుగానే ఉందని, బ్యారేజీనుంచి దిగువకు వదిలే నీటిపరిమాణం మాత్రం అమాంతం 5లక్షల64వేల06క్యూసెక్కులకు పెరిగిందన్నారు.

13వతేదీ సాయంత్రం లక్షా98వేల450క్యూసెక్కులుగా ఉన్న వరద, కేవలం 12 గంటలవ్యవధిలోనే 5లక్షల64వేలకు పెరిగిందన్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరదప్రవాహాం 13వతేదీన ఎలాఉందో, 14 వ తేదీ ఉదయానికి కూడా అలానేఉంటే, వస్తున్ననీటిని దిగువకు వదలకుండా కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లనుమూసి, ఎగువప్రాంతాల్లో నిల్వచేశారని పట్టాభిపేర్కొన్నారు. వస్తున్న నీటి పరిమాణంలో మార్పులేనప్పుడు, రాత్రికి రాత్రే 5లక్షలక్యూసెక్కులకు నీరు ఎలాపెరిగిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువప్రాంతంలో నిల్వచేయబట్టే, రాత్రికి రాత్రి వరదనీటి ఉధృతి పెరిగిందని, ఏదో రకంగా అమరావతి ప్రాంతాన్ని ముంపునకు గురిచేయాలన్న కుట్రతోనే ప్రభుత్వం నీటిని తొక్కిపట్టిందన్నారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే లక్షా98వేల క్యూసెక్కులుగా ఉన్న నీరు 5లక్షల64వేలక్యూసెక్కులకు ఎలా పెరిగిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం రాజధాని అమరావతిని ముంచడంకోసమే జగన్ ప్రభుత్వం ప్రకాశంబ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదలలేదన్నారు. ఈ విధంగా అమరావతికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం పన్నినకుట్ర ప్రజలముందు బహిర్గతమైందన్నారు. అత్యంత కర్కశంగా, దారుణంగా ఒక్కసారిగా నీటిని కిందకు వదలబట్టే విజయవాడలోని కృష్ణలంక వంటి ప్రాంతాలు నీటమునిగాయన్నారు. 5లక్షల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా వదలబట్టే, విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. అయితే ఈ ఆధారాల పై ఇప్పటి వరకు ప్రభుత్వం, ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ నాయకులకు, అధికార ప్రతినిధులకు, మీడియా ముందుకు తరుచూ వెళ్ళీ నాయకులకు, కీలక ఆదేశాలు పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, ఈ ఆదేశాలు పంపించారు. తమ పార్టీకి చెందిన వాట్స్ ఆప్ గ్రూపుల్లో ఇది పంపించారు. దీనికి సంబంధించిన మెసేజ్ సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. గత శనివారం రాత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం పెట్టి, కోర్టుల పై, న్యాయమూర్తుల పై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, తరువాత మీడియాకు కొన్ని లేఖలు విడుదల చేసారు. ఇందులో జగన్ మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు, కొంత మంది హైకోర్టు జడ్జిల పై, అదే విధంగా ఒక సుప్రీం కోర్టు జడ్జి పై ఫిర్యాదు చేసినట్టు ఆ లేఖలో ఉంది. అయితే ఈ మీడియా సమావేశం గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, మిగతా వార్తా చానల్స్ ప్రసారం చేయలేదు. కేవలం ఒక టీవీ ఛానల్ మాత్రమే ప్రసారం చేసింది. అయితే గత రెండు మూడు రోజులుగా, కేవలం చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ పై, మిగతా చానల్స్ కూడా ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో, మీడియాలో దీని పై చర్చ మొదలైన నేపధ్యంలో, తమ పార్టీ ముఖ్యులకు, నాయకులకు, అధికార ప్రతినిధులకు, మీడియా ముందు తరుచూ వెళ్ళే వారికి, పార్టీ అధిష్టానం ఒక వాట్స్ అప్ సందేశం పంపించింది.

ఇప్పటికే హైకోర్టు అంశం పై, జగన్ మోహన్ రెడ్డి గారు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారని, ఇక పై దీని పై ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టటం కానీ, లేక ప్రెస్ నోట్ విడుదల చేయటం కానీ, చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా పదే పదే రెట్టించి ఈ అంశంలో ప్రశ్నలు అడిగితే మాత్రం, ఇప్పటికే ఈ అంశం పై ప్రభుత్వం తరుపున ప్రకటన విడుదల అయ్యింది అని, ఇక దీని పై తాము స్పందించాల్సింది ఏమి లేదు అంటూ, మీడియాకు చెప్పాలి అంటూ సజ్జల ఆదేశాలు జారీ చేసినట్టు, ఆ వాట్స్ అప్ మెసేజ్ సారాంశం. దానికి తగ్గట్టుగానే, వైసీపీ నేతలు ఎవరూ, గత మూడు నాలుగు రోజులుగా ఈ అంశం పై ఎటువంటి వ్యాఖ్యలు మీడియా ముందు చేయలేదు. ఇక అలాగే ఈ అంశం పై, ట్వీట్లు కూడా ఏ నాయకుడు పెట్టలేదు. మరి ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారు ? కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కోర్టుల పై ఏమీ మాట్లాడ వద్దు అని చెప్పరా ? లేక ఈ అంశం పై వైసిపీ వైఖరి ఏమైనా మారిందా అనే అంశం చర్చనీయంసం అయ్యింది. ఇక మరో పక్క, ఈ లేఖ పై వివధ కోర్టు సంఘాలు, సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా స్పందిస్తూ, జగన్ వైఖరిని తప్పు బడుతున్న విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read