యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, ఎప్పుడూ చెప్పే విధంగా, వాళ్ళ పార్టీ పై ప్రేమతో, తమ నాయకుడి పై గౌరవంతో, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనే తాపత్రయంతో, తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసారు. నిజానికి ఇది జగన్ మర్చిపోయిన విషయం. అలాగే ప్రతిపక్షం కూడా పట్టించుకోని విషయం. అయితే వాళ్ళు మర్చిపోయినా, నేను మర్చిపోను అంటూ, రఘురామకృష్ణం రాజు, లేఖ రాసి మరీ గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అవ్వా , తాతలకు మూడు వేలు పెన్షన్ ఇస్తాను అంటూ, వారిని నమ్మించి ఓట్లు వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత, అవ్వా తాతలకు ఏడాదికి రూ.250 పెంచుకుంటూ వెళ్తానని చెప్పి, మొదటి ఏడాది కేవలం రూ.2,250 ఇచ్చి ఉసూరుమానిపించారు. అయితే మొన్నే ఏడాది పాలన కూడా పూర్తయింది. ఇప్పుడు 14వ నెలలోకి అడుగు పెట్టారు. అయితే రెండో ఏడాది పెంచాల్సిన రూ.250 మాత్రం ఇంకా పెంచలేదు. మాట తప్పను, మడం తిప్పను అని జగన్ చెప్పే డైలాగ్ కి జరిగే విషయానికి తేడా ఉండటంతో, ఆయన మర్చిపోయిన విషయం గుర్తు చెయ్యటానికి, అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు, లేఖ రాసారు.

అవ్వా - తాతలకి మీరు పెంచుతాను అని చెప్పిన రూ.250 పెన్షన్ గురించి మీ దృష్టికి తెస్తున్నాను అంటూ, రఘురామరాజు లేఖ రాసారు. మీరు ఎన్నికల్లో అవ్వా తాతలకు పెన్షన్ రూ.3 వేలు చేస్తాను అని చెప్పారు, దీంతో అందరూ మీకు ఓట్లు వేసారు, తరువాత ప్రమాణ స్వీకారం రోజున రూ.250 పెంచి, ప్రతి ఏడాది రూ.250 పెంచుతాను అని చెప్పారు. వచ్చే జూలై 8న మన ప్రియతమ నాయకుడి జయంతి రోజునైనా, మీరు ఈ ఏడాదికి రూ.250 పెంపు ప్రకటన చేస్తారని ఆశిస్తున్నా అంటూ, రఘురామరాజు లేఖలో పేర్కొన్నారు. ఇక మరో విషయంగా, పెన్షన్ వయసు 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గించారు, మే 30, 2019నే ఆదేశాలు ఇస్తూ జీవో ఇచ్చారు, కానీ వారికి పెన్షన్లు మాత్రం ఫిబ్రవరి 2020 నుంచి ఇస్తున్నారు. దీని వల్ల వారికి, 7 నెలలకు రూ.15,750 నష్టం వాటిల్లింది. వారు నష్టపోయిన డబ్బులు కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని, అలాగే రూ.250 పెన్షన్ పెంచాలని, అలా చేస్తే మీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది అంటూ, రఘురామకృష్ణం రాజు, జగన్ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, లేఖ రాసారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయం సాక్షిగా జరిగిన ఒక భూమి,రెండు చెల్లింపులు కేసులో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. రూ.3.25 కోట్ల అదనపు చెల్లింపుల విషయంలో ఆర్డీవో కార్యాలయం వహించిన నిర్లక్ష్యం వెలుగులోకి తేవడంతో రెవిన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయకుండా నిందితులైన రామసుబ్రహ్మణ్యం, రాజారావులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి విడిచి పెట్టకపోవడం పై అతని బంధువు గంటశాల భాను ప్రకాష్ గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అవకతవకలపై ఎటువంటి నివేదికలు తయారు చేయకుండా కేవలం తమ బంధువులైన పచ్చిపులుసు శ్రీరామ్మూర్తి, పచ్చిపులుసు రవితేజ, సుతాపల్లి సత్యనారాయణ, సుతాపల్లి సాయి, కొమ్మిశెట్టి భీమశంకరంలను అయినవిల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి వేధిస్తున్నారని భానుప్రకాష్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

దీనిని రిట్ పిటిషన్ నెం 10888/2020 క్రింద కోర్టు పరిగణలోకి తీసుకుని శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన కౌంటర్‌ను హైకోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఈ నెల 24వ తేదీన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాలు సమయం ఇచ్చింది. ఇప్పటికే డీజీపీ మూడు సార్లు, హైకోర్టు ముందుకు వెళ్లారు. మొదటి సారి హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో, రెండో సారి చంద్రబాబుకి 151 నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకోవటం పై, మూడో సారి అక్రమ మద్యం రవాణా చేస్తున్న వాహనాలు విడుదల విషయంలో అనుసరిస్తున్న విధానం పై, ఇలా మూడు సార్లు డీజీపీ కోర్టు ముందు హాజరు అయ్యారు. ఇప్పుడు మరో సారి డీజీపీ హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మాజీ ఎంపీ సబ్బంహరి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి, స్పీకర్ తమ్మినేని పై ఫైర్ అయ్యారు. నిన్న స్పీకర్ తమ్మినేని తిరుమలలో, న్యాయస్థానాల పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల జోక్యం ఎక్కువ అయ్యిందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలు, కాదనే హక్కు కోర్టులకు లేదని, వాళ్ళే అక్కడ నుంచి పాలించుకోవచ్చు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పై అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు ఎదురు అవుతున్న సమయంలో, మాజీ ఎంపీ సబ్బం హరి మీడియా సమావేశం పెట్టారు. స్పీకర్ వైఖరి పై అభ్యంతరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, "దేశంలో ఎక్కడా లేనిది ఏపీలోనే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? 30 ఏళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కోర్టు తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. కోర్టుకు ఏపీ ప్రభుత్వం ఎందుకు వెళ్లిందో తెలియదా?. ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని ఎవరూ అనడం లేదు. రాజధాని కోసం రైతులు త్యాగాలు చేస్తే.. అది శ్మశానం అన్నారు. వేలాది ఎకరాలు ఇచ్చిన వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లకూడదా? హక్కులను కోల్పోతున్న ప్రజలు కోర్టుకు వెళ్లడం తప్పా. ఏపీలో మాత్రమే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేశారు. వీటన్నిటిపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. "

"అక్కడ జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్పీకర్ తమ్మినేని తనపని తాను చేస్తే సరిపోతుంది. అసెంబ్లీ వరకు మాత్రమే స్పీకర్‌కు అధికారాలు ఉంటాయి. కోర్టుల తీర్పులపై వ్యాఖ్యలు చేయడం స్పీకర్‌కు తగదు. కోర్టులను బ్లాక్ మెయిల్ చేసేలా స్పీకర్ వ్యాఖ్యలు. లా చదివినంత మాత్రాన తమ్మినేనికి అంతా తెలిసినట్టు కాదు. స్పీకర్ తన పరిధి తెలుసుకుని మాట్లాడాలి. పదే పదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. తమ్మినేని రాజ్యాంగ శక్తిగా భావిస్తే తప్పు చేయడమే. చాలా మేధావి అనుకుని మాట్లాడటం తప్పు. కోర్టుకి అధికారం ఉంటే.. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసినా తప్పులేదు. రద్దు చేయమని నా ఉద్దేశం కాదు. కోర్టులను బ్లాక్ మెయిల్ చేసేలా స్పీకర్ వ్యాఖ్యలు చేయడం తగదు. మీకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవిని వదిలేయాలి. మీ సీఎంను అడిగి మంత్రి పదవి తీసుకుని మాట్లాడాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కోర్టుకెళ్తారు. కోర్టులు ఏ పనీ చేసుకోనివ్వడం లేదనడం సరికాదు. ఈ విధంగా తమ్మినేని మాట్లాడితే.. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు" అని సబ్బం హరి అన్నారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారం రోజులుగా వృద్ధుడి కుటుంబ సభ్యులు వడుతున్న ఆవేదనకు శుక్రవారం తెరవడింది. సదరు వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు శుక్రవారం ధృవీకరించారు. వివరాల ప్రకారం విజయవాడ, వన్ టౌన్ ప్రాంతంలో ఒక దంపతులు నివాసముంటున్నారు. దంపతుల్లో వృద్ధునికి ఆయాసం ఎక్కువవుతుండటంతో తొలుత ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆయనకు కోవిడ్ లక్షణాలు న్నాయని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కోవిడ్ పేరు చెప్పగానే బంధువులు సైతం దూరంగా వెళ్ళారు. దీనితో 60 సంవత్సరాల వయస్సున్న వృద్ధుడు తన భార్యతో కలిసి గత నెల 24న విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం సదరు వృద్ధుని వెంటిలేటర్ పై ఉంచేందుకు లోపలకు తీసుకెళ్ళారు. అయితే అతని భార్యను మాత్రం అదే రోజు ఇంటికి పంపించివేశారు. 25వ తేదీ ఉదయం వృధుని చూసేందుకు అతని భార్య ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు వైద్య సిబ్బంది. ఆమె భర్త ఇక్కడ లేడని చెప్పడంతో అవాక్యయ్యింది. ఉన్నతాథికారులను కలిసి వేడుకున్నా ఫలితం కానరాక పోవడంతో నాలుగు రోజుల పాటు అక్కడే తిరిగి అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి లోని సిసి టివి పుటేజిని పరిశీలించారు. వృద్ధుడు ఆస్పత్రి లోపలకు వెళ్ళడం కూడ సిసి టివి పుటేజిలో రికార్డయ్యింది. అయితే తిరిగి బయటకు రావడం మాత్రం సిసి టివి పుటేజీలో లేదు. దాంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పలువురు వైద్యాధికారులను ఈ సందర్భంగా విచారించారు. మీడియాలో కూడ దీనికి సంబంధించి వార్తా కథనాలు ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. వృద్ధుని మృతదేహం మార్చురీలోనే ఉందని, జూన్ 25వ తేదీ తెల్లవారుజామయున ఆయన కోవిలో మృతి చెందినట్లుగా వైధ్యాధికారులు ధృవీకరించారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఫోన్లో వృద్ధుని ఫొటోను తీసి ఆస్పత్రి సిబ్బంది నేరుగా ఖననం చేసేందుకు వృద్ధుని మృతదేహాన్ని తీసుకెళ్ళారు. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్ల వారం రోజులుగా భర్త కోసం విలవిలలాడిన సదరు మహిళ ఆవేదన శుక్రవారం వైధ్యాధికారులు అందించిన సమాచారంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read